Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరైనా 86 ఏండ్ల వయసు వచ్చేసరికి హాయిగా ఇంట్లో కూర్చుని తోటి వయసు వారితో కాలక్షేపం చేయాలనుకుంటారు. చాలామందికి ఆ వయసు వచ్చేసరికి ఎక్కువ పని చేసే ఓపిక వుండదు. కాస్తో కూస్తో ఓపిక వున్నా అది సొంత పనులు చేసుకోడానికి సరిపోతుంది. మహా అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే క్రమంలో మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తుంటారు. కానీ బెంగళూరుకు చెందిన బిలహళి రఘునాథ్ జనార్దన్ మాత్రం ఈ మాటంటే ఒప్పుకోడు. జనార్దన్కి ఇప్పుడు 86 ఏండ్ల వయసు. అయినా సరే కొండలు - గుట్టలు ట్రెక్కింగ్ చేయాలి, అథ్లెట్గా పరుగులు పెట్టాలి, కిలోమీటర్ల కొద్దీ సైకిల్ తొక్కాలంటాడు.
ఇప్పటికి సుమారు నాలుగు లక్షల కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. అంటే దాదాపు ప్రపంచాన్ని చుట్టేసినట్లే. అయితే ఇదంతా కేవలం 22 ఏండ్ల కాలంలోనే. కైలాసగిరితో సహా ఇప్పటికి హిమాలయాల్ని 20 సార్లయినా ట్రెక్కింగ్ చేసుంటాడు. ఐదుసార్లు మారథాన్లో పాల్గొన్నాడు. ఇక హాఫ్ మారథాన్ల సంఖ్య అయితే లెక్కే లేదు. తన బలం, మానసిక స్థైర్యం కేవలం శరీరానికి సంబంధించినదే కాదు, మనసుకు సంబంధించినది కూడా అంటాడు జనార్దన్. ఇలా సైక్లింగ్ చేయడం వల్ల తన చిన్నతనాన్ని తిరిగి పొందిన అనుభూతి కలుగుతుందంటున్నాడు.
మలి సంధ్యలో..
జనార్దన్ మొదటి నుండి అథ్లెట్ కాదు. రైల్వే డిపార్ట్మెంట్లో రిటైరైన మామూలు ఉద్యోగి. రిటైరయిన జీవితం.. పిల్లలు చదువులైపోయి సెటిలైపోయారు. గార్డెనింగ్ లాంటి ఏదో ఒక వ్యాపకంతో జీవిస్తున్నాడు. సైక్లింగ్ మొదలు పెట్టింది అతని 64 ఏండ్ల వయసులో. అంటే జీవిత మలి సంధ్యలో నన్నమాట! ఆ వయసులో జనార్దన్ సైక్లింగ్ మొదలు పెట్టడానికి కారణం వుంది.
ఒకసారి జనార్దన్ కుటుంబ సభ్యులతో కారులో ప్రయాణిస్తున్నప్పుడు హఠాత్తుగా స్పృహ తప్పాడు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు అతన్ని హాస్పటల్కు తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు చెప్పిన విషయం జనార్దన్ జీర్ణించుకోలేకపోయాడు. ఎంతోమంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినా అందరూ ఒకే మాట... అతనికి వున్న వ్యాధి మూర్ఛ. మెదడులో నరాలకు సంబంధించిన వ్యాధి. జీవితాంతం మందులు వాడాలి. ఇక ఎప్పుడూ ఒంటరిగా అతన్ని వదలకూడదని, జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇంకా ఒక డాక్టరైతే మెదడుకి చిన్న ఆపరేషన్ చేయాలన్నాడు కూడా. మెదడుకి చేసే ఆపరేషన్ చిన్నదెలా అవుతుందో జనార్దన్కి అర్థం కాలేదు.
తనకు వ్యాధి వుందన్న విషయం జనార్దన్ని మానసికంగా, శారీరకంగా బాగా కుంగదీసింది. అప్పటి వరకు ఎంతో సరదాగా, హుషారుగా బతికిన ఆయన ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోవాలంటే జైల్లో బంధించినట్లు ఫీలయ్యాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చుట్టాలు చూపే జాలి, చెప్పే జాగ్త్రతలు భరించలేకపోయాడు. మందులు వేసుకోవడం అతనికి ఇష్టంలేదు. కానీ తప్పడం లేదు. అతని జీవితం మారిపోయింది దినచర్యతో సహా.
కొంతకాలం మందులు తీసుకున్న తర్వాత ఈ స్థితిని భరించలేకపోయాడు జనార్దన్. ''ఎంతకాలం ఇతరులు నన్ను జాగ్రత్తగా చూసుకోగలరు? ఎంతకాలం ఇతరుల మీద ఆధారపడాలి? అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుంటారు కదా?'' అనుకున్నాడు.
తనపై తానే ప్రయోగం చేసుకుంటూ...
కొన్ని రోజులకు అతను ఒక నిర్ణయానికికొచ్చాడు... తనకు మూర్ఛవ్యాధి లేదని ఊహించుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు రాత్రి సైలెంట్గా బయటకి వెళ్ళి చాలా దూరం నడిచాడు. ఇలా చాలా రోజులు చేశాడు ఎవరికీ తెలియకుండా. ఈ నడక అతనిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచింది, తనకున్న వ్యాధి వల్ల ఎటువంటి ప్రమాదం లేదని. అలాగే ఈ వ్యాధికి ముగింపు లేదని కూడా వైద్యపరంగా ఎక్కడా నిరూపణ కాలేదని తెలుసుకున్నాడు. రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు.
తర్వాత ఒకసారి జనార్దన్ వాళ్ళబ్బాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సితార్ పోటీల్లో పాల్గొన్నాడు. తన కొడుకు పోటీలో పాల్గొనడం చూడాలన్న కోరికతో సైకిల్ మీదనే 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు. 40 ఏండ్లలో అదే మొదటిసారి అతను సైకిల్ పట్టుకోవడం. ఇంటికి తిరిగి వచ్చేసరికి మొత్తం 77 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కాడు జనార్దన్. ఈ సంఘటన తర్వాత అతనికి, తనలో ఏ లోపం లేదన్న నమ్మకం, ధైర్యం పెరిగింది. ఇక అప్పటి నుండి సైకిల్ తొక్కడం అతనికి ఇష్టమైన పనిగా మారింది.
తర్వాత 132 కిలోమీటర్ల దూరంలో వున్న తన ఊరికి సైకిల్మీద ప్రయాణమయ్యాడు. ఆయనకి అర్థమైంది... ఏదైనా మనసులో గట్టిగా అనుకుంటే శరీరం తప్పకుండా సహకరిస్తుందని. శరీరాన్ని, మనసుని ఆరోగ్యంగా వుంచుకోగలిగితే ఏదైనా సాధ్యమే అని.
అప్పటి నుండి జనార్దన్ ఎన్నో సైక్లింగ్ రేసుల్లో పాల్గొన్నాడు. 68 ఏండ్లప్పుడు ట్రెక్కింగ్ కూడా మొదలుపెట్టాడు. 72 ఏండ్ల వయసులో పరుగుపందెంలో పాల్గొన్నాడు. హిమాలయ ట్రెక్కింగ్లో పాల్గొనాలని వెళ్తే, అక్కడి ఆర్గనైజర్లు నిరాకరించారు... ఈ వయసులో ఏమైనా జరుగుతుందేమోననే భయంతో. దానికి జనార్దన్ సమాధానం... ఏమైనా జరిగితే, ఇక నుండి ఇల్లు కదలను అని.
ఆయన ప్రమాదాల్ని ఎంత తేలికగా తీసుకున్నాడంటే, రెండు సార్లు ప్రమాదాలకు గురైనా ఎవరికీ తెలియనివ్వలేదు. ఒకసారి కొండమీదకి ఎక్కాక, ఒక వ్యక్తి కత్తితో వచ్చి తోసేసి, దగ్గరున్న డబ్బు, వస్తువులన్నీ తీసుకుని వెళ్తుంటే, తన కెమెరా పాడైపోయినా పర్వాలేదని, ఆ దొంగ ముఖం మీద కెమెరాతో కొట్టాడు. అలాంటిదే మరో సంఘటన కూడా. ఐనా అధైర్య పడలేదు.
ఒకసారి శరీరానికి దృఢత్వం వచ్చాక ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకుంటున్నా, పూర్తిగా అథ్లెట్స్ లాగా మాత్రం తీసుకోవట్లేదంటాడు. అథ్లెట్స్తో పోటీ పడే అతను శాకాహారం మాత్రమే తీసుకుంటాడు. బయటి ఆహారానికి దూరంగా వుంటాడు. ఉదయాన్నే ఖర్జూరాలతో ఆహారం తీసుకోవడం మొదలుపెట్టి, మొలకెత్తిన చిరుధాన్యాలు, పచ్చి కూరగాయ ముక్కలు, పచ్చ అరటి, పాలు వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటాడు.
మెట్ల మీద సైక్లింగ్ పోటీలకు ఎక్కువగా ఇష్టపడే జనార్దన్, 32 అంతస్తుల్ని నాలుగు సార్లు, 52 అంతస్తులు, దుబారులోని 64 అంతస్తుల బిల్డింగ్ని కూడా సునాయాసంగా ఎక్కాడు.
ముంబయిలో మూడు సార్లు, బెంగళూరులో రెండు సార్లు, దుబారులో ఒకసారి మారథాన్లలో పాల్గొన్నాడు. అతను దుబారు, సిడ్నీ సరిహద్దుల్ని కూడా దాటాడు.
చాలామంది ప్రయాణాలకు బైకుల్ని, కారుల్ని ఉపయోగిస్తుంటారు. కానీ జనార్దన్ మాత్రం సైకిల్పై ప్రయాణించడానికే ఎక్కువ ఇష్టపడతాడు. సిటీలో తిరగడానికైనా, వేరే ఊరు వెళ్ళడానికైనా సైకిల్నే ఉపయోగిస్తాడు. ఇప్పటికీ రోజుకు 55 కిలోమీటర్లు దూరాన్ని ఈజీగా సైకిల్మీద ప్రయాణించగలడు.
కర్నాటక ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక కెంపగౌడ అవార్డుని రెండేండ్ల క్రితం అందుకున్నాడు. అతని ఫొటోని స్టాంపుగా కూడా బెంగళూరు పోస్టాఫీస్ వారు ముద్రించారు.
నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో ముందు తెలుసుకోవాలి. నెగిటివ్గా ఆలోచించడం మానేయాలి అనేది జనార్దన్ తత్వం. యువతకు స్ఫూర్తిగా వుండటంతోపాటు, తనకు తాను ఉత్సాహాన్ని నింపుకోవడం జనార్దన్కు ఇష్టమైన పని.