Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈనాటి తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు హైదరాబాద్ దక్కన్గా పిలవబడే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నది. నాడు ఈ రాష్ట్రంలో మహారాష్ట్రులు, ముస్లింలు, తెలుగు వాళ్ళు, కన్నడిగులు కలిసి ఉండేవారు. నిజాం రాష్ట్ర పరిపాలనలో సామాజిక (ఆర్థిక, రాజకీయ, సాహిత్య) పీడననే గాక భాష పైన జరిగిన దాడి తీరు వర్ణనాతీతం. నాడు తెలుగు మాట్లాడే వారు తమ తెలుగు భాషను అభివృద్ధి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కారణం నాడు ఉర్దూ రాజ భాష కావడం. అదేవిధంగా పరిపాలన వ్యవహారాలు అన్ని ఉర్దూ భాషలో ఉండటమే. నాడు ఒక తెలుగు వారు మాత్రమే కాదు మహారాష్ట్రులు, కన్నడిగులు కూడా ఇలాంటి పరిస్థితి చవిచూసిన వారే.
నాడు అఖండ భారతావనికి స్వాతంత్రం లభించినా హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం నిజా ఏలుబడి లో ఉండటం వలన స్వాతంత్రం లభించక ప్రజలు అసంత ప్తితో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నాడు తెలుగు మాట్లడేవారు, వారి భావాలు ప్రకటించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి అవకాశంలేని సమయంలో, నలుగురు కలిసి ఒకచోట కూర్చొని మాట్లడుకోవడానికి, తెలుగు భాషను రక్షించు కోవడానికి రాజకీయ విషయాలు మాట్లడుకోవడానికి 1911 సవత్సరం లో మహబూబియా ఆంధ్ర భాషా నిలయం ఖమ్మం జిల్లా , ఎర్రుపాలెం లో భాషాభిమానుల ప్రోద్బలంతో స్థాపించారు.
1911 సంవత్సరం లో మాడపాటి హనుమంతరావు మాతామహుల ఊరు ఎర్రుపాలెం కావడంతో మాడపాటి మేనమామ దేశపాండ్య జమలాపురం జగన్నాధ రావు (జమిందార్) నాడు గ్రామంలో ఉన్న అక్షరజ్ఞానం కలిగిన వారందరితో కలసి మహబూబియా ఆంధ్ర భాషా నిలయం గ్రంథాలయం (1911)స్థాపించారు. దీని పక్కనే ఉన్న రెమిడిచెర్ల గ్రామంలో కూడా సిద్ధ మల్లేశ్వర గ్రంథాలయం స్థాపించారు.
నాడు సాహిత్య అభిమానిగా పేరుగాంచిన దేశ పాండ్య జమలాపురం జగన్నాధ రావు పుత్రుడు జమలాపురం చిన్న రామారావు వారింట్లో గ్రంథాలయం స్థాపించడం జరిగింది. వారు సేకరించిన కొన్న పుస్తకాలకు చక్కగా పుటలు వేసి, కుట్టి, మంచిగా నెంబర్లు వేసి, పేరు వ్రాసి పెట్టడం గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను పద్దతిగా అమర్చడం లాంటి కార్యక్రమాలు చేసేవారు.
మహబూబియా ఆంధ్ర భాషా నిలయం ప్రధాన ఉద్దేశ్యం ఖమ్మం జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో తెలుగు భాషను పరిరక్షించడం. అదే విధంగా ఆక్షరాస్యతను వృద్ధి చేయడం. నాడు ఈ గ్రంథాలయ 62 పుస్తకాలతో ప్రారంభించారు. తరువాత వితరణ, దానం రూపంలో 1931 నాటికి 15162 గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. తరువాత 1946 నాటికి దాదాపు 35 వేల పై చిలుకు గ్రంథాలు కలవు. వాటిలో భారతం, రామాయణం, వివిధ బాషల సాహిత్యం, జీవిత చరిత్రలు, నాటకాలు, కవితలు, పురాణ గాథలు సామాజిక, రాజకీయ, విజ్ఞాన శాస్త్రం, పురాణాలు, ఇతిహాసాలు, వివిధ విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఈ గ్రంథాలయంలో తెలుగు గ్రంథాలే గాక హింది, ఇంగ్లీష్, ఉర్దూ భాషకు సంబంధించిన పుస్తకాలు కలవు.
తర్వాత కాలానికి మాడపాటి రామచంద్రరావు పుత్రుడు మాడపాటి వసంత కుమార్ గ్రంథాలయాన్ని చాల చక్కగా నిర్వహించారు. ఎన్నో పుస్తకాలు కొనటం, దానంగా స్వీకరించడం, వాటిని ఆసక్తిగల వారికి చూపించి చదివేటట్లు చేయటం చేసేవారు. వారి కార్యక్రమాల వలన అప్పుడప్పుడే చదువుకుంటున్నటువంటి వారికి కూడ గ్రంథాలయానికి నిత్యం వెళ్లాలని, ప్రజలకు పుస్తకం చదవాలనే అభిలాష కలిగింది. ఫలితంగా ఎంతోమంది ఆసక్తిగా పుస్తకాలు చదవడం జరిగింది. 1950-80 వరకు ఈ గ్రంథాలయంలో నిత్యం ప్రతి సోమవారం సాహిత్య చర్చలు, సమావేశాలు నిర్వాహించే వారు.
వివిధ దేశభక్తుల, గొప్ప వ్యక్తుల జయంతులు, వర్థంతులు, పండుగల సంధర్బంలో దగ్గరలో ఉన్న విజయవాడ నుంచి మంచి వక్తలను తీసుకువచ్చి ప్రవచనాలు చేయించుట జరిగేది. ప్రతి ఉగాది పండుగ నాడు గ్రంథాలయం లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేవారు. నాడు చదువరులను ఆకర్షించేందుకు ప్రతి నెలలో మెదటి ఆదివారం వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి పుస్తకాలను బహుమతి గా ఇచ్చేవారు. నాడు రోజుకు సరాసరి వందమందికి తక్కువ కాకుండా చదువరులు గ్రంథాలయానికి వచ్చేవారు.
వేసవి కాలంలో (వ్యవసాయ పనులు లేని కాలంలో) గ్రంథాలయంలో దిన పత్రికలను చదివి వినిపించేవారు. రాత్రులు వాడ వాడ తిరుగుతూ గ్రంథాలయానికి రమ్మని చెప్పేవారు. గ్రంథాలయ అద్వర్యంలో హరికథలు, బుర్రకథలు నిర్వహించేవారు.
1953 వరకు ఈ గ్రంధాలయం మాడపాటి రామచంద్రరావు గారింట్లో అంటే నేడు పాత ఆంధ్రాబ్యాంక్ ఉన్న స్థానంలో నడిచింది. నిత్యం వస్తున్న చదువరులతో ఉన్నటువంటి గ్రంథాలయం చాలా ఇరుకుగా ఉండేది. నాడు ఆ ఊరి పెద్దలు అందరు కలసి చందాలు వసూలు చేయాలని ఆలోచనతో సమావేశం నిర్వహించగ దేశ పాండ్య జమలాపురం సూర్యనారాయణ ముందుకు వచ్చి గ్రంథాలయానికి శాశ్వత భవనంకు కావలసిన ఆర్థిక సహకారం అందిస్తానని అన్నారు. వెంటనే మరొక దాత గొల్లమూడి అప్పారావు గారు 3 సెంట్ల భూమిని వితరణగా ఇచ్చారు. ఈ స్థలంలోనే శాశ్వత భవనం నిర్మాణం చేశారు.
కాలానుగుణంగా వస్తున్నటువంటి చదువరులను దృష్టి లో పెట్టుకొని గ్రంథాలయంను విస్తరించాలనే ఉద్దేశ్యం తో సరిగ్గా 27 సంవత్సరాల కింద ఊరి వాళ్ళందరూ చందాలు వేసుకొని 6 వందల రూపాయలు తో 143 గజాల స్థలాన్ని, గ్రంథాలయం ఆనుకొని ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ గ్రంథాలయం అభివ ద్ధి కోసం జమలాపురం రామచంద్రరావు కృషితో మాజీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఎంపి నిధుల నుండి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
నాడు ఖమ్మం లో జరిగిన అనేక పోరాటాలకు ముఖ్యంగా నిజాంకి వ్యతిరేకంగా జరిగిన ప్రతీ ఉద్యమం లో గ్రంథాలయం తో సంబంధం ఉన్నదే. నాడు ఈ గ్రంథాలయం లో పగటి పూట కంటే రాత్రి వేళలో రాజకీయ సమావేశాలు కొన్ని కొన్ని సార్లు తెల్లవార్లు జరిగేవి. కారణం పగటి పూట అయితే నిజాం అధికారులు చూసి ఇబ్బంది పెడతారనే భయం. తరువాత కాలంలో ఈ గ్రంథాలయం అభివృద్ధి కుంటుపడింది. గ్రంథాలయ పాలన కష్టమైపోయింది. 1959-60 కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రంథాలయాన్ని పౌర గ్రంథాలయ వ్యవస్థ లో కలపడం జరిగింది. చాల విలువైన పుస్తకాలు కనుమరుగు అయ్యాయి. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో 21, 665 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి, 11 దిన పత్రికలు, 22 మాస, త్రైమాసిక , వార్షిక, అర్ధ వార్షిక పత్రికలు, జర్నల్స్ వస్తున్నాయి.
- ఈ గ్రంథాలయ అభివృద్ధిలో జమలాపురం జగన్నాధరావు కొడుకు చిన్నరామారావు, మాడపాటి రామచంద్రరావు కొడుకు మాడపాటి వినరు కుమార్ ఎనలేని కృషి చేశారు.
- ఈ గ్రంథాలయానికి మహబూబియా ఆంధ్ర భాషా నిలయం అని పేరు పెట్టడానికి కారణం ఉంది. ముస్లిం పేరుతో భాషా నిలయాన్ని స్థాపిస్తే ఆ భాషా నిలయం జోలికి గాని లేదా భాషా నిలయం పై నిఘా పెట్టరనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయానికి మహబూబియా ఆంధ్ర భాషా నిలయం అని పేరు పెట్టడం జరిగింది అని వినికిడి.
- జమలాపురం జగన్నాధరావు, కేశవరావు, మాడపాటి హనుమంతరావు, మాడపాటి రామచంద్రరావు, జమలాపురం చిన్న రామారావు, సూర్యనారాయణరావు ఇలా ఎంతోమంది ఉద్దండులు ఈ గ్రంథాలయం లోని పుస్తకాలతో కుస్తీలు పట్టినవారే.
- మహబూబియా ఆంధ్ర భాషా నిలయం స్థాపించి 2011 నాటికి వంద వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఘనంగా ఉత్సవాలు చేయవలసి ఉండె. కాని అనేక కారణాలతో 7 సంవత్సరాల అనంతరం 2018 డిసెంబర్ మాసంలో వారం రోజుల పాటు నామ మాత్రంగా నిర్వహించారు.
విజ్ఞాన వారసత్వ సంపదను కాపాడవలసిన బాధ్యత మన అందరిది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రాజా రామ్ మోహన్ రారు లైబ్రరీ ఫౌండేషన్ వారి ద్వారా నిధులు అందిపుచ్ఛుకునే ప్రయత్నం చేయాలి. ఆదే విధంగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్వర్యంలో 100 సంవత్సరాలు దాటిన గ్రంథాలయాలు/భాషా నిలయాలు అన్వేషణ కోసం చేస్తున్న ప్రయత్నం లో దీనిని చేర్చి తగు సౌకర్యాలు కల్పించాలి.
- డా|| రవి కుమార్ చేగొని