Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందాల కాశ్మీరం అగ్నిగుండంగా రగులుతూ ఉంటే... ఆ అగ్నికి మరింత ఆజ్యం పోసింది పుల్వామా ఉగ్రదాడి. ఆ దాడి అనంతర పరిణామాలను ప్రత్యక్షంగా పరిశీలించి రిపోర్ట్ చేయడానికి వెళ్లారు సీనియర్ జర్నలిస్ట్ రెహనా. ఓ టీవీ ఛానల్ కోసం పనిచేస్తున్న ఆమె... కాశ్మీర్లో తన అనుభవాలను 'సోపతి' పాఠకులకోసం రాస్తున్నారు. ధారావాహికగా సాగే ఆమె వ్యాసంలో మొదటి భాగం ఇది.
నాయని కృష్ణకుమారి గారి 'కాశ్మీర దీపకళిక' చదివినప్పటి నుంచి... కాశ్మీరం నా మనసులో ముద్ర వేసుకుని కూర్చుంది. వెన్నెల పరిచినట్లు, వెన్న చిలికినట్లు ఉండే ఆ పర్వత శిఖరాలు చూడాలని, కురిసే మంచు పూల వానను దోసిలి నిండా పట్టుకోవాలని, తులిప్ పూల సొగసు, దాల్ లేక్ విహారం... ఇలా ఎన్నో ఊహలు ఆ శ్వేత ప్రపంచం గురించి నాలో మెదులుతూనే ఉండేవి. ఇది ఓ పార్శ్వం. పాత్రికేయంలో అడుగు పెట్టిన తర్వాత కాశ్మీర్ గురించి తెలుసుకున్న, తెలుసుకోవాలనుకున్న దృక్కోణం మారిపోయింది. అందులోనూ సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో జమ్ములో, భారత-పాక్ సరిహద్దుల గుండా ప్రయాణించిన తర్వాత అత్యంత సంఘర్షణ పూరిత ప్రాంతాలైన పుల్వామా, బారాముల్లా వంటి ప్రాంతాలకు వెళ్ళలేదన్న లోటు మనసును పట్టి పీడిస్తుండేది. అక్కడి ఉగ్రవాదం, వేర్పాటువాదం, కల్లోలం గురించి పత్రికల్లో చదవటమే కాని ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నది లేదు. స్థానిక జీవితాన్ని దగ్గరగా చూసినప్పుడే, వారితో మాట కలిపినప్పుడే వాస్తవాల పై మనకో స్పష్టత వస్తుంది. మనదైన కోణం ఆవిష్కృతమవుతుంది. పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ కోసం వెళ్లిన సందర్భం కాశ్మీరీల గురించి, వారి ఆకాంక్షల గురించి, వారి ఆవేదనల గురించి తెలుసుకునే అవకాశాన్నిచ్చింది.
ఉదయం 8 గంటలు, 15, ఫిబ్రవరి, 2019. ఎయిర్ పోర్టుకు వెళ్ళటం కోసం కారెక్కి... వాట్సప్ లో వచ్చిన ఫ్లైట్ టికెట్లు, బోర్డింగ్ పాసులు డౌన్ లోడ్ చేసుకున్నా. అంతకు ఓ గంట క్రితం ఆఫీసు నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో హుటాహుటీన వయా ఢిల్లీ కాశ్మీర్ కు ప్రయాణం అయ్యాను. కెమెరా మ్యాన్, ఫోర్ జీ టెక్నీషియన్ ఢిల్లీ నుంచి బయలుదేరి శ్రీనగర్ లో నన్ను కలుస్తారు. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రదాడి! 40 మంది సీఆర్పీ ఎఫ్ జవాన్లు రెప్పపాటు కాలంలో అమరులైన విషాద సంఘటన. అది కూడా ఓ స్థానిక కాశ్మీరీ ఉగ్రవాది మానవ బాంబుగా మారి దాడికి పాల్పడ్డాడు. ఆలోచిస్తుంటేనే నరాలు గుంజుతున్నాయి. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలన్న ఉద్రేకం నరాల్లో రక్తం కంటే వేగంగా ప్రవహిస్తోంది. తునాతునకలైన జవాన్ల మృత దేహాల చిత్రాలు, జరిగిన విధ్వంసం మనసుని కకావికలం చేశాయి. ఏడు దశాబ్దాలుగా కాశ్మీర్ మంచు కొండల్లో రక్తం ఎందుకు చిందుతోంది? తమ ప్రాణం పోయినా పర్వాలేదు... ఇల్లూ, వాకిలి వదిలి దేశం కోసం సేవ చేస్తున్న జవాన్లను మట్టుబెట్టాలన్న కసి కాశ్మీరీల్లో ఎందుకు వస్తోంది? లోపం ఎక్కడ ఉంది? తెర వెనుక ఉన్న చీకటి వాస్తవాలేమిటి? సతమతపరుస్తున్న ఆలోచనలు మనసు నిండా పరుచుకుంటే... మంచు పరుచుకున్న శ్రీనగర్ గడ్డ పై అడుగు పెట్టాను.
శ్రీనగర్ ఎయిర్ పోర్ట్లో దిగిన వెంటనే ఒక వెహికిల్ మాట్లాడుకుని ఉగ్రదాడి జరిగిన లెత్ పురాకు బయలు దేరాను. ఆ రోజు పట్టణం అంతా కర్ఫ్యూ అమలులో ఉంది. తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొని ఉండటంతో స్పాట్ వరకు ఎలా వెళతానో, మార్గ మధ్యంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో అన్న ఓ ఆలోచనా రేఖ మనసులో సమాంతరంగా కొనసాగుతూనే ఉంది. శ్రీనగర్ నుంచి లెత్పురా 30-35 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీనగర్-జమ్ము హై వే మీదే ఈ ఊరు వస్తుంది. పట్టణంలోనూ, దారి వెంబడి అడుగడుగునా బలగాలు మోహరించి ఉన్నాయి. ఎక్కడా బండి ఆపకుండా పరిసరాలను చూసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. ముందు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని పరిస్థితి గురించి ఆఫీస్కు సమాచారం అందించాలి. ఆ క్షణంలో నా ముందున్న లక్ష్యం అది! సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో లెత్ పురా చేరుకున్నాం. కాస్త దూరంగా రోడ్డు పై టార్పలిన్ వేసి కప్పేసి ఉంది. పరిసరాలు ఆర్మడ్ ఫోర్సెస్ అధీనంలో ఉన్నాయి. రోడ్డుకు ఓ వైపు జాతీయ ఛానల్స్వి ఓ మూడు నాలుగు లైవ్ వాహనాలు, పదిహేను, ఇరవై మంది వరకు మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఇంతలో ఆఫీసు నుంచి ఫోన్లు లైవ్ కోసం! అక్కడి తాజా పరిస్థితి గురించి స్థానిక అధికారులు, మీడియా ప్రతినిధులు, ఆ గ్రామస్థులతో మాట్లాడి సేకరించాను. లైవ్ ఇవ్వటానికి నెట్ వర్క్ కనెక్షన్ లేదు. కాశ్మీర్ వ్యాలీ అంతా ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశారు. అందుకే మాక్ లైవ్ చేసి శ్రీనగర్కు బయలు దేరాను. టౌన్లో ఎక్కడైనా కాస్త నెట్ వర్క్ ఉంటుందన్న ఆశతో...
తూటాలు పేలిన ఆ రోజు...
వెనుక తుపాకుల మోత మోగుతుంటే... లైవ్ కవరేజ్ ఇవ్వటం ఎప్పుడూ ఉద్విగంగా ఉంటుంది. అటువంటి అరుదైన మూడు సందర్భాలు ఇప్పటి వరకు నా పాత్రికేయ ప్రయాణంలో ఎదురయ్యాయి. ఒకటి 26/11 సంఘటన. 2008, నవంబర్ 26న భారత ఆర్ధిక రాజధాని ముంబాయి నగరం పై పాక్ నుంచి మన భూభాగంలోకి అక్రమంగా జొరబడిన ఉగ్రవాదులు చేసి మారణ హౌమం. దాయాది దేశం పాకిస్థాన్ నుంచి లష్కరే తోయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదుల బృందం అరేబియా సముద్రం దాటి ముంబాయి గడ్డ పై కాలు పెట్టారు. దక్షిణ ముంబాయిలో ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఒబెరాయ్ ట్రెడంట్ హౌటల్, హౌటల్ తాజ్ ప్యాలెస్, తాజ్ టవర్, లియోపోల్డ్ కేఫ్, కామ హాస్పటల్, యూదుల కమ్యూనిటీ సెంటర్ నారిమన్ హౌస్, మెట్రో సినిమా వంటి 12 చోట్ల ఏక కాలంలో కాల్పులకు, బాంబు దాడులకు తెగ పడ్డారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో 174 మంది ఉగ్ర మూకల తూటాలకు బలయ్యారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో హౌటల్ తాజ్ ప్యాలెస్, ట్రడెంట్, నారిమన్ హౌస్ లో మానవ కవచాలుగా కొంత మందిని బందీలుగా నిర్బంధించారు ఉగ్రవాదులు. వారి చెరలో చిక్కిన బందీలను క్షేమంగా విడిపించటం, ఉగ్రవాదులను మట్టుబెట్టడం లక్ష్యంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) కమాండోలు చేపట్టిన ఆపరేషన్ను ''ఆపరేషన్ బ్లాక్ టోర్నడో'' అని పేరు పెట్టారు. ఆ మూడు రోజుల పాటు నేను అక్కడి నుంచి ప్రత్యక్ష్య ప్రసారాలు అందించాను. తూటాలు దూసుకువస్తున్న చప్పుళ్లు, బాంబు పేలుళ్ళు, పైకి ఎగసే చిక్కటి పొగ వీటిని రెండు, మూడు వందల అడుగుల దూరంలో ఉండి చూస్తూ, వింటూ, ఆ పరస్పర కాల్పుల్లో మేము గాయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రిపోర్ట్ చేయటం ఎలా మరిచిపోగలం?
అప్పుడే మొదట సారి కాల్పుల హౌరు జరుగుతుంటే... నా కెమెరాల్లో ఆ శబ్దాలు రికార్డు అవుతుంటే... అక్కడి పరిస్థితులను లైవ్లో కవర్ చేశాను. రెండో సందర్భం 2016 అక్టోబర్లో ఎదురయ్యింది. ఉడి దాడికి ప్రతీకారంగా మన దేశం పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) లోని ఉగ్ర క్యాంపుల పై మెరుపు దాడులకు పాల్పడిన తర్వాత భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ ఛాయలు అలుముకున్నాయి. ఆ పరిణామాల కవరేజ్ కోసం నేను అక్కడి సరిహద్దు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కాల్పుల హౌరు వినటం మరిచిపోలేని సంఘటన. ఆ వైపు నుంచి పాక్ సైన్యం కాల్పులకు దిగితే సరిహద్దుల్లో ఉన్న మన జవాన్లు బుల్లెట్లు, బాంబులతో సమధానం చెబుతున్నారు. కొన్ని గంటల పాటు పరస్పర కాల్పులు జరిగాయి. నిశ్శబ్దం ఆవరించిన ఆ పల్లెల్లో ఉండుండి బయటకు దూసుకువస్తూ... తూటాలు చేసే గాండ్రింపు ఒళ్ళు గగుర్పొడిచింది. తెల్లవారగానే పాక్ గడ్డ పై నుంచి దూసుకు వచ్చిన బాంబు షెల్స్ను పొలాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో ఏరటం, గోడల పై పడిన బుల్లెట్ల గాయాలు వెతకటం గుండెను మెలిపెట్టింది నాకు. మంచు శిఖరాల ప్రపంచం కాశ్మీర్ గడ్డ పై అటువంటి మరో అరుదైన సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలబడ్డాను. పుల్వామా దాడికి సూత్రధారి, మాష్టర్ మైండ్, జైష్-ఏ-మహ్మద్ టాప్ కమాండర్ రషీద్ ఘాజీని మట్టుబెట్టిన కీలక ఆపరేషన్ అది. సరిగ్గా చెప్పాలంటే శ్రీనగర్ నుంచి ఎన్కౌంటర్ జరుగుతున్న గ్రామం వరకు చేసిన ప్రయాణమే సవాళ్ళను విసిరింది. ఎప్పుడూ చూడని అరుదైన, భయం గొల్పే దృశ్యాలు నా కళ్ళలోని రెటీనా పై చెరగని ముద్రలు వేశాయి. దక్షిణ కాశ్మీర్ లోని అత్యంత సంక్లిష్ట ప్రాంతం గుండా చేసిన ప్రయాణం ఓ వైపు బెరుకును, మరోవైపు ముందుకే వెళ్ళాలన్న మొండితనాన్ని నాలో నింపింది.
అది ఫిబ్రవరి 17. ఉదయం ఆరు పది. అంతకు ఓ ఐదు నిమిషాల ముందే నిద్ర లేచాను. ఎనిమిది గంటలకు పుల్వామా దాడికి పాల్పడిన మానవ బాంబు అదిల్ అహ్మద్ దార్ గ్రామం కాకపొరా బయలు దేరటానికి ఏర్పాట్లు చేసుకున్నాను. అక్కడి ఓ స్థానికుడు అదిల్ ఇంటికి తీసుకువెళ్ళటానికి అంగీకరించాడు. ఫోన్ తీశాను అప్ డేట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడటానికి. సదరు వ్యక్తి నుంచి తెల్లవారు ఝామున రెండు, మూడు గంటల ప్రాంతంలో రెండు మెసేజ్లు వచ్చి ఉన్నాయి. ఎన్కౌంటర్ జరుగుతోంది. ఆదిల్ వాళ్ళ గ్రామానికి వెళ్ళే ఆలోచనను ఆ రోజుకు విరమించుకోమని వాటి సారాంశం. వెంటనే ఫోన్ చేశాను. ఎన్కౌంటర్ జరుగుతున్న ఊరు, కాకపోరాను ఆనుకునే ఉంటుంది. కనుక ఇవాళ ఆ పరిసర గ్రామాల్లో పరిస్థితులన్నీ తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళటం అసాధ్యం అని స్పష్టంగా చెప్పాడు. అతని మాటలతో తీవ్ర నిరాశకు లోనయ్యాను. జాతీయ మీడియా పట్ల అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉంటారు. తమ అసలు సమస్యను మీడియా రిపోర్ట్ చేయటం లేదన్నది వారి ప్రధాన ఆరోపణ. సరే, నేను జాతీయ మీడియా ప్రతినిధిని కాను, తెలుగు రాష్ట్రాలకు చెందిన జర్నలిస్ట్ అని చెప్పటం, వారిని ఒప్పించటం ఆ పరిస్థితుల్లో అంత తేలిగ్గా సాధ్యం అయ్యే విషయం కాదు. వారికి వివరించే సమయం దొరికే లోపు పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. నేను చెప్పిన పై రెండు కాల్పుల సందరాÄ్భలు ఇప్పటి పరిస్థితికి భిన్నం. ఇక్కడ ఉగ్రవాదులు, బలగాలు అనే రెండు పక్షాలతో పాటు స్థానికులనే మూడో పక్షం ఉంటుంది. రాళ్ళు రువ్వే ఆందోళనకారుల నుంచే అసలు ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు ఎటు నుంచి ఏ రాయి వచ్చి పడుతుందో, ఎవరు ఎలా స్పందిస్తారో ఎవరూ ఊహించలేరు. ఈ పరిస్థితుల అవగాహన ఉన్నా... వెళ్ళటానికే సిద్ధమయ్యాను.
నాతో ఉన్న కెమెరా మ్యాన్ భయపడకుండా రావటానికి సిద్ధపడటంతో ఎనిమిదింటికి శ్రీనగర్లో కారెక్కాం. మాతో ఉన్న డ్రైవర్కు ఎన్కౌంటర్ విషయం తెలిస్తే స్టీరింగ్ ముట్టుకోడు. కాస్త భయస్తుడు. పైగా అప్పటికే అతని బండి రాళ్ళ దెబ్బల రుచి చూసి ఉంది. అందుకే అసలు విషయం చెప్పకుండా కాకపోరాకు వెళదాం అన్నాను. శ్రీనగర్-జమ్ము హైవే పై కొంత దూరం వెళ్లాక కుడి వైపు గ్రామాల దారిలోకి మా బండి మళ్ళింది. హై వే నుంచి ఏడెనిమిది కిలోమీటర్ల లోపలికి వెళితే కాకపోరా వస్తుంది. దాని కంటే ముందు పాంపొర్ గ్రామం వచ్చింది. ఇది కూడా ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండే ఊరే. అలా నెమ్మదిగా ముందుకు వెళుతున్నాం. పల్లెలన్నింటా శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎక్కడా పెద్దగా అలికిడి లేదు. షాపులు మూతపడి ఉన్నాయి. దానికి తగినట్లు ఆకురాలు కాలం! ఎక్కడ చూసినా మోడువారిన చెట్లే. వాతావరణం అంతా ఒక నైరాశ్యం, నిస్తేజం అలుముకున్నట్లుంది. ఒకటి అరా జెన్, మారుతి 800 వంటి చిన్న, వైట్ నెంబర్ ప్లేట్ వాహనాలు తారసపడుతున్నాయి కాని బయటి ట్యాక్సీలు, అద్దె వాహనం ఒక్కటి కూడా తారసపడలేదు. విచిత్రంగా పహారా కాస్తూ సిపాయిలూ కనిపించలేదు. స్థానికులు మినహా బయటి వ్యక్తి ఎవరూ లేరు. వీధుల్లో, అరుగుల మీద, నాలుగు రోడ్ల కూడళ్ళల్లో గుంపులుగా గ్రామస్థులు కూర్చుని, నిలబడి ఉన్న దశ్యాలు మమ్మల్ని దాటుతున్నాయి. 90 శాతం మంది మగవారే. అక్కడక్కడ ఆడవాళ్లు కనిపించినా... అక్కడి వాతావరణ ప్రభావం ఏమీ వారిలో కనిపించలేదు. మగవారు అందరూ వాళ్ల సంప్రదాయ ఫిరాన్ దుస్తుల్లో ఉన్నారు. సల్వార్ వేసుకుని ఆ పైన ఫిరాన్ ధరిస్తారు. చలికి చేతులను ఫిరాన్ లోపలే పెట్టుకుని ఉంటారు ఎక్కువ మంది. దీనితో ఫిరాన్కు ఉండే చేతులు బయటకు వేళాడుతుంటాయి. చూడటానికి కాస్త భయం గొల్పుతుంది. ఆ పొడవైన ఫిరాన్ లోపల ఏముందో అన్న అనుమానం రేగుతుంది. ఈ ఫిరాన్ లోపలి భాగంలో ప్రత్యేక జేబులు లాంటివి ఉంటాయి. వీటిలో 'కంగ్రి' అనే నిప్పు కుండలు పెట్టుకునే సదుపాయం ఉంటుంది. దేహానికి అంత దగ్గరగా నిప్పు కుండలను మనం అస్సలు ఊహించలేం. కాని గడ్డలు కట్టే ఆ చలి నుంచి రక్షణ కోసం ఇటువంటి ఏర్పాట్లు తప్పవు వారికి. ఈ విషయం తెలియకపోతే... కంగ్రి వల్ల సహజంగా కాస్త ఎత్తుగా, ఏదో తేడాగా ఉందే అనిపించేలా ఉండే వారి వస్త్ర ధారణ చూసి ఆందోళన పడతాం. ఆ పొడవైన, నిండుగా కప్పుకున్న దుస్తుల వెనుక చిన్న పాటి తుపాకులే కాదు ఏకే 47 పెట్టుకున్నా పైకి పోల్చలేం. రాళ్లు కచ్చితంగా పెట్టుకుని ఉండవచ్చు. మనసులో అనుమాన గాలి వీస్తుంటే ఇలాంటి ఆలోచనలే వస్తుంటాయి మరి!
ఊపిరి బిగపట్టి ఒక్కో ఊరు దాటుతున్నాం. అక్కడంతా కర్ఫ్యూ వాతావరణం ఉందన్న వరకు అర్థం చేసుకున్నాడు డ్రైవర్. అతని సూచనతో కెమెరా, ఎన్టీవీ లోగో ఉండే గన్మైక్ బ్యాగుల్లో సర్దేశాం. ఎవరైనా అడ్డగిస్తే ప్రయాణికులం అని చెప్పాలని నిర్ణయించుకున్నాం. ప్రయాణం ఎక్కడికి అని ప్రశ్నిస్తే? ఠకీమని సమాధానం ఇచ్చాడు మా డ్రైవర్. మేము షోపియాన్ పట్టణానికి వెళుతున్నాం. ఇది షోఫియాన్ జిల్లా హెడ్ క్వార్టర్. పింగ్లానా నుంచి 24 కిలోమీటర్ల దూరం. చారిత్రక నేపథ్యం ఉన్న మార్గం ఇది. మొగలులు ఈ మార్గం ద్వారానే రాకపోకలు సాగించే వారు. అందుకే దీన్ని మొగల్ రోడ్ అంటారు. షోఫియాన్ ఇప్పుడు ఉగ్రవాద సమస్యతో అగ్గి కుంపటి అయ్యింది కాని... మొగలుల కాలంలో ఒక వైభవాన్ని చవి చూసింది. అప్పట్లో దీన్ని షీన్-ఏ-వాన్ అని పిలిచే వారు. 'షీన్-ఏ-వాన్' అంటే మంచు అడవి అని అర్ధం. అంతా కొండ ప్రాంతం. కాకపొర కూడా చిన్నపాటి పట్టణమే. మా బండి స్పీడ్ లిమిట్ 30, 40 కి.మీ దాటడం లేదు. జాగ్రత్తగా పరిసరాలను చూసుకుంటూ కాకపొర దాటి కాస్త ముందుకు వెళ్లాం. చిన్నపాటి నాలుగు రోడ్ల కూడలి లాంటిది వచ్చింది. ఓ బండి యూ టర్న్ తీసుకుంటోంది. ఆ వాహనానికి దారిచ్చి... ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాం. రోడ్డు పై పొడుగాటి వస్త్రాల్లో ఉన్న కొంత మంది బండి ఆపారు. ఏమవుతుందో అన్న ఆందోళన నాలో!
డోర్ గ్లాస్లు మూసుకునే ఉన్నాం. ఒకతను గన్ పేలుస్తున్నట్లు సైగలతో చెప్పాడు. డ్రైవర్ గ్లాస్ దించి కాశ్మీరీ భాషలో ఏదో మాట్లాడాడు. స్టీరింగ్ను అలా పట్టుకుని నా వైపు తిరిగాడు. ఇంత పని చేస్తావా అన్నట్లున్నాయి అతని చూపులు. ఈవిడతో ప్రయాణిస్తే కిరాయి డబ్బుల సంగతి దేవుడెరుగు... ప్రాణాలకు నీళ్లు వదులుకోవాల్సిందే అన్న భావం అతని ముఖంలో! నన్ను లోపల బాగానే తిట్టుకుంటున్నాడు అనుకున్నాను. అయినా ప్రశాంతంగా అడిగాను ఆ ఊరతను ఏం చెప్పాడని. ''ఎన్కౌంటర్ జరుగుతున్న విషయం మీకు తెలుసుకదా?'' అడిగాడు. ''అతనేమన్నాడు?'' మళ్ళీ నేనే. ''ఆ ముందు ఎన్కౌంటర్ జరుగుతోంది వాహనాలను వెళ్ళనివ్వటం లేదు... రాళ్లు విసురుతున్నారు. వెనక్కి వెళ్లిపోండి అని చెప్పాడ''న్నాడు. ఇంతలో కాల్పుల శబ్దం వినిపించింది. డ్రైవర్కు కోపం, భయం అన్నీ ఒకేసారి ఆవహించాయి. అయినా నా మీద కాస్త గౌరవం ఉంచేమో... తనలో తాను గొణుక్కోవటం మొదలు పెట్టాడు. ''ఏదైనా జరిగితే బాధ్యత ఎవరికి? మీకు ఏదైనా అయితే నన్నే అంటారు. అన్నీ తెలిసి నువ్వెలా తీసుకువెళ్ళావని... అందుకే వద్దంటే విన్లేదు... బండికి ఏమైనా అయితే ఎవరిస్తారు?'' ఇలా సాగుతోంది అతడి మాటల ప్రవాహం. డ్రైవర్ తీరు కెమెరా మ్యాన్కు నచ్చలేదు. ''ఇంత పిరికితనం అయితే పని చేయలేం. ఇక్కడి వాడివి... ఊరు వాళ్లకు ఆ మాత్రం నచ్చచెప్పలేవా...?'' అంటూ మండిపడ్డాడు. మాటకు మాట అంటుతోంది. ఇద్దరికీ గట్టిగా చెప్పాను ఎవరూ మాట్లాడవద్దని. ఒక క్షణం నిశ్శబ్దం బండిలో.... ఏ నిర్ణయమూ తీసుకోలేని స్థబ్దత నాలో. బండికి ఏం కాకుండా చూడాలి. తర్వాత మా టీమ్ భద్రతను దృష్టిలో పెట్టుకోవాలి. నా ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి వెనక్కి చూడకుండా వచ్చిన దారినే శ్రీనగర్కు మళ్లటం. సురక్షిత మార్గం ఇది. రెండు బండి వదిలేసి కెమెరా మ్యాన్తో కలిసి నడుచుకుంటూ ఒక కిలోమీటర్ దూరం నడిచి ఎన్కౌంటర్ స్పాట్కు చేరుకోవటం. నడక సమస్య కాదు. హెల్పెట్లు, సేఫ్ జాకెట్లు వంటి ఎటువంటి రక్షణ సదుపాయాలు లేకుండా అలా ఆ రోడ్డు పై చేతిలో కెమెరా, లోగోలతో నడుచుకుంటూ వెళ్లటం అంటే ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవటమే. కనీసంగా రాళ్ల దెబ్బలు తినటానికి, గరిష్టంగా ప్రాణాలు పోగొట్టుకోవటానికి సిద్ధపడి బండి దిగాలి. బ్రీతింగ్ టైమ్ కోసం మా బండిని ముందు వెనక్కి మళ్ళించమన్నాను. మెదడులో రక్తం పాదరసం కంటే వేగంగా ప్రవహిస్తోంది. నాలుగైదు నిమిషాలు తీవ్రంగా ఆలోచించిన తర్వాత శ్రీనగర్కు వెళ్ళే మొదటి ఆప్షన్ను కొట్టేశాను. అంటే ఎన్కౌంటర్ స్పాట్కు ఎట్టి పరిస్థితుల్లోనూ చేరాల్సిందే. కాని ఇంత ప్రమాదకరంగా కాకుండా కాస్త భద్రతతో...
(వచ్చేవారం కొనసాగుతుంది...)
రచయిత సెల్ : 9010234023