Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి స్త్రీ తన మనోభావాలను, చెప్పదలచిన మాటని ఎలా చెపుతుందో, ఆ మాటల శైలిని క్రోడీకరించి చూడటమే స్త్రీవాదాన్ని అర్ధం చేసుకోవటమౌతుంది. అంతే కాని ప్రత్యేకించి స్త్రీవాదానికి నిర్వచనం ఇదీ అని చెప్పవలసిన పనిలేదేమో. కళాకారులు ఏదైనా ఒక అందమైన విషయాన్ని, ప్రదేశాన్ని గురించి చిత్రం వేసి చూపదలచినప్పుడు దానికి కొంత నాటకీయతను చేర్చి మరింత అందంగా అర్ధవంతంగా చూపుతారు. దీపా గోపాల్ దానికి విరుద్ధం. ఆమె విధానమే వేరు. తాను ప్రయాణించిన కొత్త ప్రదేశాలను అందమైన స్థలాల ఫొటోలు తీసుకుని, ఆ తరువాత వాటిని చిత్రాలు వేస్తుంది. అందమైన ఒక చెక్క గెస్ట్హౌస్ని చూసినప్పుడు సరస్సు ఒడ్డున వున్న ఆ గెస్ట్హౌస్ని ఎంతో అందంగా యాక్రిలిక్స్, పెన్సిల్స్, పాస్టెల్స్తో చిత్రాలు వేసినా... నాటకీయతను జోడించి మరింత ఆహ్లాదం జోడించేకన్నా, ఆ చిత్రంలోని ఒక గొంతు నిజానికి దగ్గరగా తీసుకువస్తుందనే సంగతిని గ్రహించాలి. ఇది అందని అందమైన ఆకాశం అనుకునే భావం కన్నా... చేతికందే నీరు, చెట్లు, పచ్చదనం మనం అందుకోవచ్చు అనే భరోసానిస్తూ నిజాన్ని చూపుతుంది. ఆ నిజంలోని అందం మరింతగా చూపరులని ఆకట్టుకుంటుంది. 'ఐస్లాండ్ హౌమ్' అనే శీర్షికన చేసిన చిత్రంలో సముద్రపు బాక్ వాటర్స్ మధ్య ఒక ఒంటరి గృహం చెట్ల నీడన నిల్చున్న తీరు అదీ నిజమే అనిపిస్తుంది. తను అలా కంపోజ్ చేసింది అని అనుకోవటం కష్టం అవుతుంది.
'లింగరింగ్ మెమోరీస్, పాడీ ఫీల్డ్స్, రెడ్ హౌస్' వంటి చిత్రాలు చిన్న చిన్న జ్ఞాపకాల వరుసల చిన్న చిన్న కథలు అని అర్థమవుతాయి. అన్నీ చిత్రాలకు తన అనుభవాల, ఆలోచనల నుండి రూపం ఇస్తుంది. తన కూతురు చిన్నతనం నుండి స్కూల్ చదువు పూర్తి చేసి కాలేజ్ చదువులకు వచ్చిన నాటి వరకూ తీసిన ఫొటోలను ఆధారం చేసి చాలా ఆలోచనలకు రూపం ఇచ్చింది. సంఘంలో ఆడపిల్లల పై జరిగే అత్యాచారాలకు, ఊహల్లోని ఆలోచనలకు తన బిడ్డ చూపే వివిధ భావాలతో పోల్చుకుంటుంది. ఊహలని నిజమైన రూపాలుగా చూపే ఈమె 'రిపర్కషన్స్' శీర్షిక చిత్రాల్లో ఒక చిత్రంలోని స్త్రీ ఏకాంతంలో స్వగతం మాట్లాడుతూ ఆకాశం లోతుల్ని చూస్తూ ఏకధ్యాసలో నడుస్తున్నట్టుంటుంది. నాక్టర్న్ శీర్షిక చిత్రాల్లో అనంత దూరంలోని ఆకాశాన్ని, అతి ఎత్తైన చెట్ల మధ్య నుంచి నలుపు నీలం ఆకాశం మధ్య నక్షత్రాలని మనకు చూపుతుంది. అందమైన విషయం నిజానికి దూరం కాదు కదా, మనం ఎందుకు అందుకోలేం అనే ఈమె, ఏకాంతంలోని లోతైన ఆలోచనలకి రూపం ఇస్తుంది. దీపా 1976లో జన్మించింది. కేరళ నివాసి. తను స్వయంగా రచయిత, ఆర్ట్ క్యూరేటర్ కూడా. లిటరేచర్లో పట్టా పొందిన ఈమె స్వయం కృషితో చిత్రం వేయటం నేర్చుకుంది. దుబారు, కేరళ, చండీఘర్, ఇండోర్, అబూదాబీలలో ప్రదర్శనలిచ్చింది. కొచ్చి బీనాలే సమయంలోనూ, కొచ్చి దర్బార్ హాల్లో మరోసారి ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. తను ష్ట్రబవర.అ.రష్ట్రaసవర అనే పేరు మీద నడిపే బ్లాగ్స్పాట్కి అవార్డులు కూడా సంపాదించింది. మనుషులు, మనస్తత్వాలు, ప్రకృతిపై ఈమె వేసే చిత్రాల్లోని ఆలోచన తీరు శూన్యమైన ఒంటరితనానికి, భావాలు నిండిన ఏకాంతపు ఆలోచనలకి మధ్య తేడా చూపినట్టుంటాయి.
- డా||ఎం.బాలామణి,
81067 13356