Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కాలమా! నా పదిహేడో సంవత్సరాన్ని తిరిగి నాకు కానుకగా ఇవ్వు'' అచ్చంగా ఈ వాక్యాలే కాకపోయినా ఇలాంటి భావంతోనే తెలుగు కవి శివసాగర్ ఒక కవిత రాశాడు. దేవుడు వరమందిస్తే చాలా మంది తమ బాల్యం తమకు కావాలి అని కోరుకుంటారు. కానీ ఒక డెబ్బయి ఏళ్ళ బామ్మ మాత్రం తుర్రుమనే తూనీగ లాంటి యవ్వనం కావాలని కోరుకుంది. డెబ్బయి ఏళ్ళ వయసులో ఇరవైనాలుగేళ్ల యవ్వనం తిరిగి రాగానే ఒకే జన్మలో రెండు జీవితాలను జీవించే అవకాశం బామ్మకి కలిగింది. రెండో జీవితంలో బామ్మ ఏమి చేసింది?
వారం క్రితం విడుదల అయి క్లీన్ అండ్ నీట్ సినిమాగా పేరు తెచ్చుకున్న 'ఓహ్ బేబీ' సినిమా కథ ఇది. 2014లో వచ్చిన దక్షిణ కొరియా సినిమా 'మిస్ గ్రానీ' ఈ సినిమాకు ఆధారం. ఎక్కడా మార్పులూ చేర్పులూ లేకుండా 'మిస్ గ్రానీ'ని యథాతథంగా అనువదించినా, 'మిస్ గ్రానీ'లో లేని గ్రేస్ ఏదో ఈ సినిమాకు సంతరించి పెట్టింది దర్శకురాలు నందినీ రెడ్డి.
జేరంటాలజీ ప్రొఫెసర్ శేఖర్ది అందమైన కుటుంబం. భార్య, ఒక కొడుకు, కూతురు, తల్లి. అమ్మంటే అపరిమితమైన ఇష్టం శేఖర్కి. ఎంత ఇష్టం అంటే భార్యా? అమ్మా? అన్న ప్రశ్న వస్తే అమ్మ వైపే అతడి త్రాసు మొగ్గుతుంది. కానీ అమ్మ కాస్త నోరు గల ఆడది. అలాగని మరీ సూర్యకాంతం టైప్ కూడా కాదు. బంధం అంటే, ప్రేమ అంటే బాధ్యత మాత్రమే, ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నెరవేర్చాలి, అందులో ఎలాంటి లోపం వుండకూడదు అనుకునే పర్ఫెక్టనిస్ట్. వాసన చూసి చేపల పులుసులో ఉప్పు తక్కువ అయిందని చెప్పగలిగేంత సూక్ష్మ గ్రాహి. ఆమెకు ఉన్న ఏకైక బలహీనత కొడుకు. కొడుకుకి ఏ కాస్త అసౌకర్యం కలిగినా ఆమె భరించలేదు.
భర్త పట్ల అత్తగారి పొసెసివ్నెస్ భార్యకి అస్సలు నచ్చదు. అలా అని అత్తగారిని ఏమీ అనలేదు. ఈ ఒత్తిడితో ఒక రోజు మైల్డ్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతుంది. భార్య ఆరోగ్యం బాగుపడాలి అంటే అమ్మను బయటకు పంపవలసిన విచిత్ర స్థితి శేఖర్కి ఎదురవుతుంది. అతడు చెప్పలేక ఇబ్బంది పడుతుంటే కూతురు కుండ బద్దలు కొడుతుంది. మనసులో బాధపడిన బామ్మకి విచిత్రంగా ఒక మిస్టీరియస్ మ్యాన్ ఎదురయి అంతకంటే విచిత్రమైన ఫోటో స్టూడియోలో ఆమె ఫొటో తీసుకునేలా చేస్తాడు. అలా ఫొటో తీసుకున్న మరుక్షణం డెబ్బయి ఏళ్ళ బామ్మ కాస్తా ఇరవైనాలుగేళ్ల పడుచు పిల్లగా మారిపోతుంది.
అక్కడనుండి కథ అశ్వవేగంతో పరుగులు తీస్తుంది. ముసలి ఆత్మ, పడుచు దేహం... ఒక హిలేరియస్ కామెడీ జెనరేట్ అయి ప్రేక్షకుడిని గిలిగింతలు పెడుతుంది. యవ్వనంలో వున్నప్పుడు బామ్మా ఏమేమి కావాలి అనుకుందో అవన్నీ ఏ నియంత్రణలూ లేకుండా చేయగల అవకాశం బామ్మకి వస్తుంది. తన కుటుంబానికి దగ్గరగా వున్నా, వాళ్ళెవరూ తనను గుర్తు పట్టలేకపోవడాన్ని ఎంజారు చేస్తూ, ఎవరెవరు తనను ఎలా ప్రేమించారో, ఎలా ద్వేషించారో బేరీజు వేసుకుంటూ యవ్వన వనంలో వీచే కొత్త గాలికి అల్లనల్లన తలలూపే ఒక ముగ్ధ మందారంలా జీవితం అనుభవిస్తుంది.
ఒకానొక విచిత్ర సన్నివేశంలో తానిలా పడుచుపిల్లలా ఎలా మారిందో తన బాల్య స్నేహితుడు చంటికి చెపుతుంది. మనవడి మ్యూజిక్ బ్యాండ్లో పాట పాడి రాత్రికి రాత్రి స్టార్ అయిపోతుంది. కేవలం తన ప్రతిభతోనే మనవడి మ్యూజిక్ బ్యాండ్ను ఒక ఛానెల్ నిర్వహించే కాంపిటీషన్లో మెగా ఫైనల్కి చేరుస్తుంది. ఫైనల్స్ రోజు మనవడు యాక్సిడెంట్కి గురయితే మనసులో దు:ఖ పడుతూనే పాటపాడి విజేతగా నిలుస్తుంది. మనవడికి కావలసిన ఏ బి గ్రూప్ రక్తాన్ని ఇవ్వడానికి సిద్దపడుతుంది. రక్తం ఇచ్చి మళ్ళీ తన పూర్వ రూపాన్ని పొందుతుంది.
ఇదీ కథ. ఈ కథను ఎక్కడా తడబాటు లేకుండా ఒక అందమైన కవితలా వెండి తెరమీద ఆవిష్కరించింది నందినీ రెడ్డి. 'అలా మొదలయింది' తరువాత నందినీ రెడ్డి తన మ్యాజిక్ చూపించిన సినిమా ఇది. వయసు మళ్ళిన బామ్మగా లక్ష్మి, వయసు తొడిగిన బామ్మగా సమంత సెకండ్ టు నన్ అన్నట్లు నటించారు. దాదాపు అర్ధశతాబ్దపు సినిమా అనుభవంతో తనకిచ్చిన పాత్రను అలవోకగా నల్లేరు మీద నడకలా లక్ష్మి తన హస్కీ వాయిస్తో పండించక పోతే ప్రేక్షకుడు ఆశ్చర్యపోవాలి కానీ పండిస్తే ఎందుకు ఆశ్చర్యం?
సమంతను ఈ సినిమాలో చూసిన తరువాత ఎవరైనా ఆమెను సమంత కాదు సమర్థ అంటే అతిశయోక్తి లేదు. పడుచు శరీరంలో, ముసలిభావాలు, ఆలోచనలతో స్క్రీన్ మీద వీరవిహారం చేసేసింది. నా చిన్నప్పుడు ఒక ఫ్రేమ్లో భానుమతీ, నాగేశ్వరరావో, భానుమతీ రామారావో ఉంటే రామారావు, నాగేశ్వరరావు కాకుండా, కేవలం భానుమతి మాత్రమే ప్రేక్షకులకు కనిపించేది అని చెప్పుకుంటుంటే అబ్బురంగా విన్నాను. కానీ ఇవాళ కేవలం సమంత మాత్రమే కనిపిస్తుంటే నిజమని నమ్మక తప్పదు.
పడుచు పిల్లగా మారిన తరువాత మొదటిసారి మనవడి పిలుపు మీద ఇంటికి వెళ్ళినప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర సన్నివేశం, మనవడు రెస్టారెంట్కి కాఫీకి పిలిచినప్పటి సన్నివేశం, నాగశౌర్యను నిద్ర పుచ్చినప్పటి సన్నివేశం ఇలా ఒకటా రెండా? సమంత ప్రతి సన్నివేశంలో తనదయిన ముద్ర వేసింది. ముఖ్యంగా నడుం మీద చేయి పెట్టుకుని నడవడం, కొత్త రెక్కలు తొడుక్కున్నాక గంతులు వేయడం, నాగశౌర్యకి గోధుమరవ్వ ఉప్మా తినిపించడం లాంటి సన్నివేశాలలో పడుచు దేహానికి, ముసలి ప్రవర్తనకి మధ్య సమన్వయం అద్భుతంగా చేసింది.
రాజమండ్రి యాసను గొప్పగా పట్టుకుంది. అర్ధ దశాబ్దం క్రితం తన అనుభవంలో లేని కన్స్యూమరిజం సమకూర్చిన సకల సదుపాయాలను అందుకుంటూ మైమరచిపోయే సన్నివేశాలలో సమంత సమర్ధ అనిపించుకుంది.
రాజేంద్ర ప్రసాద్ మంచి పాత్ర పడాలె కానీ ఎలా రెచ్చిపోగలడో ఈ సినిమాలో మరొకసారి చూస్తాం. డైలాగ్ చెప్పడంతో టైమింగ్, పదాల మధ్య విరుపు అనితర సాధ్యం. జగపతి బాబు, నాగ చైతన్య ఒకటి రెండు సన్నివేశాలలో ఆకట్టుకుంటారు. 'మనం' సినిమాలో అఖిల్ పాత్ర లాంటిదే ఇందులో నాగ చైతన్య పాత్ర కూడా.
సినిమా అంతా నవ్వులు పువ్వులై పూస్తాయి . కానీ ఆ నవ్వుల వెనుక ఎంత విషాదం ఉందని? పెద్ద వాళ్ళు ఉన్నంత వరకే మనం పిల్లలుగా ఉంటాం. వాళ్ళు వెళ్ళిపోతూ పోతూ మన బాల్యాన్ని కూడా తీసుకుని వెళతారు. బాల్యం వెళ్ళిపోయాక మనమూ పెద్ద వాళ్ళం అవుతాం. అప్పుడు తెలిసి వస్తుంది మనం మన పెద్దవాళ్ళ పట్ల ఎంత నిర్దయగా ప్రవర్తించామో. కానీ అప్పటికే సమయం మించిపోతుంది.
ముసలి వాసన వస్తుంది అంటాం, చాదస్తం అంటాం, పదే పదే చెప్పి విసిగిస్తున్నారు అంటాం కానీ ఆ మాటల వెనుక ఉన్న బంధాన్నో, బాధ్యతనో మనం గుర్తించం. మనం గుర్తించని సత్యం ఏంటంటే మనల్ని పిల్లలుగా ఉంచడం కోసం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారని.
'మిస్ గ్రానీ' జపాన్లో 'Sing My Life' పేరుతోనూ, థాయిలాండ్లో 'Suddenly Twenty' పేరుతోనూ, ఇండోనేషియాలో 'Sweet Twenty' పేరుతోనూ రీమేక్ అయి విజయం సాధించింది.
ఈ ఆదివారం మనసారా నవ్వుకోవడానికి, ఇప్పటి దాకా చూడకపోతే చూడండి.
- వంశీకృష్ణ,
9573427422