Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైనాలోని హుబే ప్రావిన్స్ కి చెందిన లీ ఝిహువా ఐదేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్ళిపోయాడు. ఈ మధ్య తిరిగి అతడు స్పృహలోకి వచ్చాడు. ఇందుకు కారణం అతడి భార్య చూపించిన అనన్య మైన ప్రేమ, సేవలే కారణం.
2013లో లీ హువా కి జరిగిన ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్లో మెదడు తీవ్రంగా దెబ్బతింది. వెంటనే అతడు స్పృహ కోల్పోయాడు. అప్పటి నుంచి 57 ఏళ్ల అతడి భార్య ఝాంగ్ గుయిహువాన్ నిరంతరం కంటికి రెప్పలా అతడిని చూసుకుంటూ వచ్చింది.
డాక్టర్ వాన్ క్వింగ్ విలేకరులతో మాట్లాడుతూ... ''అతడిని ఆస్పత్రికి తీసుకు వచ్చినప్పుడు దేనికీ స్పందించలేని స్థితిలో ఉన్నా''డని అన్నారు. స్వార్థ రహితమైన భార్య సేవల వల్లనే లీ తిరిగి స్పృహలోకి వచ్చాడని, అతడు తిరిగి బతుకుతాడని ఆశ ఏమాత్రం లేకున్నా... వదలకుండా ఆమె సేవలు చేస్తూనే వచ్చిందని పేర్కొన్నాడు.
ఆమె భర్త బెడ్ పక్కనే ఉంటూ అతడితో ఏదో ఒకటి ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేది. అంతేకాకుండా లీ కి ఇష్టమైన పాటలు వినిపిస్తూ ఉండేది. ఈ పనులన్నీ అతడిని మామూలు మనిషిగా మారుస్తాయనే చేసింది. చివరికి అవి ఫలితాన్ని ఇచ్చాయి.
''ఈ పనులన్నీ అతడి నాడీ వ్యవస్థను ఉద్దీపింప చేయడానికి ఎంతో ఉపయోగపడ్డాయ'' ని డాక్టర్ వాన్ అన్నారు.
ఎంతో పట్టుదల గల ఝాంగ్ గుయిహువాన్ కేవలం రోజుకు రెండు మూడు గంటల సేపు మాత్రమే నిద్రపోయేది. మిగతా సమయం అంతా భర్త సేవలోనే గడిపేది. ఈ ఐదేళ్లలో సుమారు 10 కిలోల బరువు తగ్గింది.
ఆమె జాగ్రత్తగా భర్త నోట్లో ఆహారం పెట్టి ఆయన నాలుక పై సుతిమెత్తగా నొక్కేది. ఇలా చేయటం వల్ల అతడు తాను ఆహారం తీసుకో గలడనే విషయాన్ని గ్రహిస్తాడు అని ఆమె భావించిందట.
ఈ విధంగా రోజు పట్టు వదలకుండా చేసిన సేవలకు ఫలితం లభించింది. ఒకరోజు తన భార్య ప్రేమ, నిస్వార్ధ సేవలకు కోమాలో ఉన్న భర్త స్పందించాడు. సపృహ లోకి వచ్చి డాక్టర్లను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రేమ, అంకితభావానికి ఎంత శక్తి ఉందో ఈ భార్యాభర్తల బంధం నిరూపిస్తుంది.