Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలోచన ఒక అడుగు ముందు వేసి నడుస్తుంటే చుట్టుపక్కల వారికి అది వింతగానో మొండితనంగానో కనిపిస్తుంది. తృప్తీ పటేల్ విషయంలో అదే జరిగింది. 1974లో ఆమె బరోడా ఫైన్ ఆర్ట్స్ ఫాకల్టీలో కళాభ్యాసం కోసం చేరినప్పుడు టెర్రకోట క్లేని శిల్పం తయారు చేసే పదార్థంగా వాడేవారు కాదు. క్లే (మట్టి)ని చిన్న శాంపిల్ శిల్పం చేసి చూసుకునే పదార్థంగానే వాడేవారు. లోహం, రాయి వంటి వస్తువే శిల్పం తయారీకి వాడేవారు. తృప్తి క్లే టెర్రకోటతో గుండ్రటి పెద్ద శిల్పాలు చేయాలంటే తన గురువులు ఒప్పుకోకపోవడంతో నిరాశ చెందింది. అయినా తనకు నచ్చిన విధంగానే తను శిల్పం చేసి చివరకు అందరి మన్ననలు అందుకుంది. ఆపై రాయల్ కాలేజ్ ఆఫ్ లండన్లో సిరామిక్స్లో ఉన్నత విద్యనభ్యసించడానికి స్కాలర్షిప్ అందుకుని వెళ్ళింది. ఒక దశాబ్దం పైన అక్కడే నివశించి సిరామిక్స్లో కళాసృష్టి చేసింది. 20 సంవత్సరాల క్రితం గుజరాత్ తిరిగి వచ్చి బరోడాలో నివసిస్తూఉన్నది. ఆమె తల్లిదండ్రులు గుజరాత్ వారైనా వారు ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు 1957లో ఈమె అక్కడ జన్మించింది. అక్కడ మన సంప్రదాయం అర్థం కాదని తాతగారింట వుంచి ఆమెను చదివించారు. ఆపై బోర్డింగ్ స్కూల్లో వున్నా ... ప్రతి చోటా ఆమెకు చెట్లు, పరిసరాలు, పూలు, మొక్కలు, ప్రకృతి నేస్తాలయ్యాయి.
లండన్ నుండి తిరిగి వచ్చినాక అమితంగా ఆనందింపజేసిన విషయం... మళ్ళీ తన చిన్ననాటి నేస్తాలయిన పూలు, పండ్లు, కూరలు, మొక్కల వాసనలు, రంగులు, అందాలు. ప్రతీ పండు, కూరలకూ ఒక ప్రత్యేకత వుంటుంది. వాటి పోషణ ఆహారాలతో ముడిపడి వున్న ఒక రంగూ, లక్షణం వుంటుంది. ఆ విధంగా వాటి ఆహార పోషణ లక్షణాన్ని ఒక గరిట ఆకారంలో మలచి వాటి రంగుని ఆ గరిటలో గ్లేజ్ రంగు వేసి, గరిట కాడని ఆ చెట్టు లక్షణంగా చూపి, ఆ విధంగా 101 గరిట కాడలని మలచి '101 సిప్స్' శీర్షికగా పేరు పెట్టింది. తాను చేసిన ప్రతీ శిల్పాన్ని ఇలా ప్రయోగాత్మకంగానే మలచింది.
ప్రతి ప్రాంతపు మట్టిలో కొన్ని ఆ ప్రాంతపు చరిత్రలు కలిసి వుంటాయి. మన భారతదేశం గుండా కర్కట రేఖ పోతున్నది. ఆ రేఖపై వున్న రాష్ట్రాలన్నింటి నుండి క్లే మట్టి తెచ్చి శిల్పాలుగా మలచింది. అలాగే గుజరాత్ క్లేతో మలచిన శిల్పం ఒకటైతే, మన దేశపు అన్ని రాష్ట్రాల క్లేతో మరో శిల్పం తయారౌతోంది.
ఇంటి గడప మన సంస్కృతిలో ఒక విలువ సంతరించుకుంది. ఇంటిలోకి ఇంటి బయటకు మధ్య వారధి ఈ గడప. ఎన్నో రకాల పండుగ పబ్బాలలో గడప గుర్తుగా చేసి పూజలు చేస్తారు. కొత్త కోడలు ఇంట్లోకి రావడమంటే గడప దాటి లోపలకు రావడం. ఆ గుర్తుగా గడపని ఒక ధైర్యం ఇచ్చే స్తంభంలా కొన్ని శిల్పాలు చేసింది. 'లుకింగ్ ఎట్ హర్' అనే శీర్షికన చేసిన శిల్పాలు స్త్రీ మనసుని తెలుసుకోండి, ఆమె అందాన్ని కాదు అని చెప్పేందుకు చేసింది.
ఆమెకు మట్టితో, భూమితో వున్న అనుబంధం మరిన్ని ఆలోచనలకు దారి తీసింది. ప్రస్తుతం తను సాగు చేసే భూమిలో మన ఆదివాసీ పురాతన పద్ధతిలో తయారు చేసే విత్తనం వేసి పంట పండించి, అవే తను ఆహారంగా తీసుకుంటూ గ్రామీణులకూ విత్తనంగా పంచిపెడుతోంది. ఇదీ తన ఉద్దేశ్యంలో ఒక కళారూపంగా చూస్తుంది. ప్రతీ పంటా రకరకాల ఆకారాల్లో దర్శనమిస్తుంది తృప్తికి.
- డా|| ఎం.బాలామణి,
81067 13356