Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చనిపోయాడనుకున్నారు.. అంత్యక్రియలకు ఏర్పాటు జరిగాయి.. బంధుమిత్రుల శోకాలు మిన్నంటాయి.. ఇక స్మశానానికి తరలించే చివరి దశలో తిరిగి ప్రాణం పోసుకుంటే ఎలా ఉంటుంది... అవాక్కవ్వడం...ఆశ్చర్య పోవడం కుటుంబసభ్యులు, గ్రామస్తుల వంతైంది. ఈ ఘటన పిల్లలమర్రిలో జరిగింది. గంధం సైదమ్మకు ఇద్దరు కుమారులు. 14 సంవత్సరాల క్రితం భర్త ఉపేందర్ అనారోగ్యంతో మృతి చెందారు. జూన్లో ఆమె కొడుకు కిరణ్కు వాంతులు విరేచనాలు కావడంతో పరిస్థితి విషమించింది. బ్రైన్డెడ్ అయ్యాడనీ, వెంటిలేటర్ తీస్తే చనిపోతాడని హైదరాబాద్ వైద్యులు చెప్పి డిశ్చార్జి చేశారు. ఆయన చనిపోతాడని గ్రామంలోని కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం ఇవ్వడంతో హైదరాబాద్ నుంచి వచ్చేలోపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పూలదండలు, బాణాసంచాతో పాటు శ్రద్ధాంజలి తెలిపే ఫ్లెక్సీ కూడా తయారు చేశారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దూర ప్రాంతల నుంచి బంధుమిత్రులు, గ్రామస్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రానికి గ్రామానికి చేరుకున్న అంబులెన్స్ నుంచి అచేతనంగా ఉన్న కిరణ్ను దించారు. అంత్యక్రియల చివరి దశలో అతను శ్వాస తీసుకుంటుండడాన్ని గమనించి అంత్యక్రియలను ఆపారు. మరుసటిరోజు మధ్యాహ్నం నుంచి అతని కంటి నుంచి నీళ్లు కారడాన్ని తల్లి గమనించింది. కొడుకు బతుకుతాడని ఆశ కలిగింది. వైద్యుల సాయంతో మందులు వాడగా వారం రోజుల్లో అతనిలో కదలికలు వచ్చాయి. క్రమంగా చూడటం, మాట్లాడటం మొదలు పెట్టాడు. చనిపోతాడని భావించిన కొడుకు బతకడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొడుకుపై ఉన్న తల్లి ప్రేమే అతనికి తిరిగి ప్రాణంపోసిందని కొనియాడుతున్నారు.
- పుప్పాల