Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ఆంధ్రప్రదేశ్కీ, ఒడిషాకీ కాలంతో సంబంధం లేకుండా తుఫానుల బెడద ఎక్కువ. ఒక తుఫానో, సునామీనో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొనే తీరుకి ఒడిషా ఎదుర్కొనే తీరుకి చాలా తేడా ఉంటుంది. తుఫాన్ రాకను మనకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో, లేదా ప్రాకృతిక సూచనల సహాయంతో కొంత ముందుగానే తెలుసుకోవచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, నష్ట నివారణ చర్యలు తీసుకుని, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గించుకోవచ్చు. కానీ కనపడని, కనుగొనలేని శత్రువు సునామీలా విరుచుకుపడితే, ఆ సునామీ ధాటికి మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే ఆ ఉత్పాతాన్ని ఎదుర్కోవడం ఎలా ?
అలాంటి ఉత్పాతాన్ని గత సంవత్సరం కేరళ ఎదుర్కొన్నది. రాష్ట్రం మొత్తం ఏకమై ఆ శత్రువు అంతు చూసింది. యుద్ధం మొదలు పెట్టింది మొదలు ముగించే వరకు కంటి మీద కునుకు లేదు. చేసే పనులకు విశ్రాంతి లేదు. అదొక మహాయజ్ఞం. ఫలశ్రుతి ప్రజల ప్రాణాల పరిరక్షణ. ప్రాణాంతకమైన నిపా వైరస్ మీద కేరళ సాగించిన యుద్ధం, శత్రువును ఎదుర్కున్న తీరు దేశమంతటికీ ఒక స్ఫూర్తిని ఇచ్చింది. కోజికోడ్, మాలప్పురం జిల్లాలని గడగడలాడించిన నిపా వైరస్పై సాధించిన విజయ గాథకు వెండి తెర రూపం 'వైరస్'.
ఆషిక్ అబూ 'వైరస్' సినిమాకు రీమా కల్లింగళ్తో సహనిర్మాతగా వ్యవహరిస్తూ, దర్శకత్వం వహించాడు.
కోజికోడ్కు చెందిన జకరియా జ్వరం, తలనొప్పి, వామిటింగ్స్తో బాధపడుతూ ఒక హాస్పిటల్కి వస్తాడు. వైద్యులు అలాంటి కేసులను చాలా చూసి ఉండటం చేత రకరకాల పరీక్షలు చేసి ఎప్పుడూ చేసే వైద్యం అందిస్తారు. జకరియాను అఖిల అనే నర్స్ అటెండ్ అవుతుంది. వైద్యులు అందించిన చికిత్స ఫలించక జకారియా మరణిస్తాడు. అన్ని రిపోర్టులు మామూలు గానే వున్నా, సరయిన వైద్యం అందించినా జకారియా ఎందుకు మరణించాడో డాక్టర్లకు అర్థం కాదు.
ఆ తరువాత అఖిల కూడా అవే లక్షణాలతో హాస్పిటల్కి వస్తుంది. ఆమె వస్తూ వస్తూనే తనకు ఊపిరి ఆడటం లేదని తనకు ఇంక్యుబేటర్ పెట్టాలని అడుగుతుంది. తను ఇప్పుడే తన బిడ్డకు పాలిచ్చి వస్తున్నానని, ఆమెకు ఏమైనా అవుతుందేమోనని ఆందోళన పడుతుంది. కేరళను నిపా వైరస్ వణికించినప్పుడు మొదటి రోగిని అటెండ్ అయినా నర్స్ లీని పుథుస్సేరీ పాత్రను సినిమాలో అఖిలగా చూపించారు. ఈ పాత్రను రీమా కల్లింగళ్ పోషించింది. సినిమా చూస్తున్న మలయాళీలు అందరికీ అఖిల రూపంలో లినీ నర్స్ కనిపిస్తుంది అంటే అతిశయోక్తి లేదు. ఆమె మాటలతో ఉలిక్కిపడ్డ డాక్టర్లు ఈ జబ్బు మీద సీరియస్గా దృష్టి పెట్టక తప్పదని నిర్ణయించుకుంటారు. ఈలోగా వ్యాధి లక్షణాలతో మరణిస్తున్న రోగుల సంఖ్య పెరిగిపోతుంది. కేరళ ఆరోగ్య శాఖామంత్రి సి.కె.ప్రమీల, కోజికోడ్ జిల్లా కలెక్టర్ పాల్ వ్ అబ్రహంతో కలసి ఒక టీమ్గా ఏర్పడతారు.
ఒక డాక్టర్కి ఇది కర్ణాకర్ణిగా విన్న నిపా వైరస్ ఏమో అన్న అనుమానం కలుగుతుంది. నిపా వైరస్ అంతవరకు భారతదేశంలో ప్రవేశించలేదు కనుక దాని లక్షణాలు కూడా వాళ్లకు ఎవరికీ తెలియదు. ఆ వైరస్తో బాధపడిన దేశాలతో సంప్రదించి జకారియాకు సోకిన వైరస్ అదేనని నిర్ణయించుకుంటారు. కానీ నిపా వైరస్ను నిరోధించే వాక్సిన్ ఏదీ లేదు. పైగా ఇది ఒక మనిషి నుండి మరొక మనిషికి ఊహించనంత వేగంగా వ్యాపిస్తుంది. ఇలా వదిలేస్తే కేరళ స్మశానం అవుతుంది. ఏమి చేయాలి? అది వ్యాపించకుండా చూడటం ముఖ్యం. వ్యాధిని నిర్ధారించడం దగ్గర నుండి నిరోధించడం దాకా ఆ మెడికల్ టీమ్ చేసింది నిజంగా ఒక యుద్ధమే.
నిజానికి ఇది కనపడని శత్రువు. చివరకు వ్యాధిని నియంత్రణలోకి తీసుకుని వస్తారు. ఈ క్రమంలో వాళ్ళు ఏమేమి చేశారు అన్నది చూడటం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. కర్ఫ్యూ విధిస్తారు, స్కూళ్ళకి సెలవులు ప్రకటిస్తారు. ప్రజలలో అవేర్నెస్ కలగచేయడానికి ప్రయత్నం చేస్తారు. రోగుల వివరాలు, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడింది లాంటి వివరాలు సేకరిస్తారు. అలా రోగులు మాట్లాడిన వాళ్లందరినీ ట్రేస్ చేసి అందరికీ వైద్య పరీక్షలు చేస్తారు. ఇవన్నీ ప్రజలలో భయాందోళనలు సృష్టించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
చివరకు అందరి సహకారంతో వైరస్ను అదుపులోకి తీసుకుని వచ్చి కేరళ మృత్యు ముఖం కాదు గాడ్స్ వోన్ కంట్రీ అని నిరూపిస్తారు.
చదవడానికి ఇది 'ఓ ఇంతేనా?' అనిపించవచ్చు. కానీ వైరస్ నేపధ్యంగా మానవ మనస్తత్వాన్ని అద్భుతంగా విశ్లేషించారు రైటర్స్ ట్రియో. ఒక్కొక్క సామాజిక వర్గం, ఒక్కొక్క ఆర్థిక వర్గం ఈ వైరస్ భయాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నది అన్నది అతి ముఖ్యమని విషయం. వైరస్ సోకిన వ్యక్తినే కాదు అతడి బంధువులను కూడా అనుమానంగా చూసే స్థితిని, శవాలను దహనం చేస్తే ఆ పొగ ద్వారా వైరస్ వ్యాపించవచ్చు అనే అనుమానంతో శవాలను ఖననం చేయాలనీ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని, ప్రాణ భయంతో అడ్డుకున్న ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఖననం చేయడానికి సిద్ధ పడటం దాకా మానవ మనస్తత్వంలోని చీకటి లోయలను, వెలుతురు శిఖరాలను పరమ సున్నితంగా దృశ్యమానం చేస్తారు. అఖిల పాత్ర పోషించిన రీమా కల్లింగళ్ ఒక సన్నివేశంలో మాట్లాడుతూ ఉంటే ''నీ పని నువ్వు చెయ్యి . ఫోన్లో ఆటలాడకు'' అంటూ రోగికి సహాయంగా వచ్చిన ఒక వ్యక్తి అనడం నర్సుల పట్ల ఎంత ఇంసెన్సిటివ్గా ఉంటామో చెప్పడానికి ఒక ఉదాహరణ. నిజానికి ఇలాంటివి చాలా. సెన్సిటివ్ కలెక్టర్గా టోవినో థామస్, నిపా వైరస్ అయి ఉండవచ్చు అని అనుమానించిన డాక్టర్గా రహమాన్, ఆరోగ్య కార్యదర్శిగా పూర్ణిమ, దృఢ చిత్తంతో ప్రజలకు మంచి చేయాలి అనే ఆరోగ్య శాఖా మంత్రిగా రేవతి, వీళ్లందరినీ ముందుండి నడిపించిన డాక్టర్గా కుంచబో బోబన్... అందరికీ తమవైన పాత్రలు వున్నాయి. వాటికి వంక పెట్ట వీలు లేని తమ నటనతో పరిమళాన్ని అద్దారు.
నిజానికి ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి? ఎక్కడ ముగించాలి అనేది ఒక పెద్ద సమస్య. దాన్ని అలవోకగా అధిగమించారు రచయితల త్రయం సుహాస్, ముషిన్ పరారీ, షరఫు. మొదటి సగాన్ని భయాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలోనూ, రెండవ సగాన్ని ఆ భయాన్ని జయించడం లోనూ అద్భుతంగా దృశ్యమానం చేశారు. రాజీవ్ రవి ఛాయాగ్రాహకుడు ఈ సినిమాకు అసలు సిసలు హీరో.
చాలాకాలం క్రితం మల్లాది వెంకట కృష్ణమూర్తి కొత్త శత్రువు పేరుతో ఒక నవల రాశాడు. అది మొదట చతురలో వచ్చి ఆ తరువాత పుస్తక రూపంలో వెలువడింది. ఆ నవల చదువుతున్నప్పుడు అనుకున్నా ''ఈ నవలను ఎవరైనా సినిమాగా తీస్తే బావుండు'' అని. ఇప్పుడు నవల కాదు నిజ జీవిత సంఘటనలతోనే ఈ వైరస్ మంత్రముగ్ధులను చేసింది.
ఈ ఆదివారం ఈ మెడికల్ థ్రిల్లర్ చూడండి.
- వంశీకృష్ణ,
9573427422