Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వం భాషా సాంస్కృతిక వ్యవహారాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచి ఆ దిశగా పనిచేస్తోంది. వాటి వ్యాప్తి కోసం కృషి చేస్తోంది. హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న రవీంద్ర భారతి వేదికగా మూడు వందల అరవై అయిదు రోజుల్లో దానికి రెట్టింపు కార్యక్రమాలను తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ నిర్వహించడం ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మరోవైపు తెలంగాణ సాహిత్య అకాడమీ రాష్ట్ర వ్యాప్యంగా వందలాది కార్యక్రమాలకు ఆర్థిక సహకారాన్ని అందించడమే కాక కావ్యమాల, నవలలపై విస్తృత ప్రసంగాలను ఏర్పాటుచేయడం, తెలంగాణాకు చెందిన పూర్వకవులు, విస్మృతికి గురైన కావ్యాల ప్రచురణ చేపట్టడం మరో గొప్పవిషయం.
ప్రపంచ తెలుగు మహాసభలకు ముందు, తర్వాత భాషా సంస్కృతుల వికాసం కొరకు చాలా అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయాలు తీసుకుంది. తెలుగును తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టడం, సాహిత్య అకాడమీతో పాటు తెలంగాణ సంగీత నాటక అకాడమిని ఏర్పాటు చేయడం, రవీంద్ర భారతిలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు ఉచితంగా వేదికను కల్పించడం వంటివి వీటిలో కొన్ని మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ కుంటి సాకులు, కారణాలతో గత ప్రభుత్వాలు రద్దుచేసిన సాహిత్య అకాడమి, సంగీత నాటక అకాడమి, బాలల అకాడమి వంటి సంస్థలు లేక పోవడంతో రెండు తరాలు వాటికి దూరం కావాల్సి వచ్చింది. ఇటీవల నూతనంగా సంగీత నాటక అకాడమి కూడా ఏర్పాటై పనిచేస్తోంది. ఇదే కోవలో బాలల అకాడమీ కూడా ప్రారంభం కావాల్సివుండె. సాహిత్య అకాడమి, సంగీత అకాడమీలు ఏర్పడి సేవలందిస్తున్నప్పటికీ ప్రధాన స్రవంతి అయిన మన బాలల కోసం, వాళ్ళ సర్వతోముఖ వికాసానికి అవసరమైన బాలల అకాడమిని ఏర్పాటు చేసుకోవాల్సిన చారిత్రక అవసరం తెలంగాణా ప్రభుత్వం, ప్రజల ముందు ఉంది. బాలల వికాసం, బాల సాహిత్య విస్తారం, ప్రచురణ, ప్రచారం వంటి కార్యక్రమాలను చేయాల్సిన బాలల అకాడమి రాష్ట్ర ప్రగతికి తొలి సోపానంగా చెప్పొచ్చు. 'ఏ దేశంలోనైతే బాల సాహిత్యం సమృద్ధిగా వికాసం చెందదో ఆ దేశ ప్రగతిని కాంక్షించలేం' అంటాడో యురోపియన్ రచయిత. ఇవ్వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో బాల సాహిత్యం విరివిగా వస్తోంది. అందులోనూ రాశిలోనూ, వాసిలోనూ మేటిగా వెలువడుతోంది. అన్నింటికి మించి మన పిల్లలు కూడా రచనలు చేయడం, వారి సంఖ్య వేలాదిగా ఉండి వందకు పైగా పుస్తకాలు రావడం శుభపరిణామం.
దేశంలో ఇవ్వాళ చాలా రాష్ట్రాల్లో బాలల అకాడమిలు, బాల భవనాలు విస్తృతస్థాయిలో విస్తరించి మారుమూల పల్లెల్లో సైతం తన కారక్రమాలు నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నాయి. అందులో కేరళలోని 'కేరళ సెంటర్ ఫర్ చిల్డ్రన్ లిటరేచర్' విలక్షణ కార్యక్రమాలు జరిపి దేశంలోనే ముందు వరుసలో ఉంది. నిజానికి పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో బాలల అకాడమినీ మొట్ట మొదటగా ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం కూడా మన ఉమ్మడి రాష్ట్రమే కావడం విశేషం. డెబ్బయ్యవ దశకంలో బడిపిల్లలుగా ఉన్న వాళ్ళకు బహుశా గుర్తుండే ఉంటుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1974 అక్టోబర్లో మొదటిసారిగా 'అఖిల భారత తెలుగు బాలల మహోత్సవాలు' జరిపింది. ఈ సభలు ఆనాటి బాలల్లో, బాల వికాసకారుల్లో గొప్పచైతన్నాన్ని కలిగించాయి. ఈ సభల్లో జరిగిన చర్చలకు కార్యరూపంగా బాలవికాసకారుల వినతిపై అప్పటి ప్రభుత్వం బాలల కోసం పనిచేసే ఒక సంస్థను ఏర్పాటు చేసేందుకు సంకల్పించింది. ఆ దిశగా సంస్థ నిర్మాణాన్ని, దాని స్వరూపాన్ని, విధులను సూచిస్తూ ప్రభుత్వ విద్యాశాఖ 1976 మార్చి 14 వ తేదీన జి.ఓ. ఎమ్.ఎస్. సంఖ్య 241 ని జారీ చేసి బాలల అకాడమిని రూపొందించింది.
1976 నవంబరు 14న అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దిన్ అలీ అహమ్మద్ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని జూబ్లి హాలులో దీనిని ప్రారంభించారు. తొలి అధ్యక్ష, కార్యదర్శులుగా మండలి వెంకటకృష్ణారావు, రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావులు సేవలందించారు. బాలల్లో సాహిత్యాభిలాషను పెంపొందించి ప్రోత్సహించడం, సంగీతం, నృత్యం, బాలల చలనచిత్రం, నాటకం, ఫొటోగ్రఫీ వంటి రంగాల్లో పిల్లలను ప్రోత్సహించడం, బాలల ప్రయోజనం కొరకు తోడ్పడే రచనలను ప్రోత్సహించడం, బాలల వికాసం కోసం పనిచేస్తున్న వ్యక్తులను, సంస్థలను గుర్తించి ప్రోత్సహించడం, కలిసి పనిచేయడం, పిల్లల కోసం వివిధ ఉత్సవాలు, మహా సభలు, సదస్సులు, ఆటల పోటీలు, వేసవి శిబిరాలు నిర్వహించడం, విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేయడం వంటివి అకాడమి ప్రధాన కార్యక్రమాలుగా ఉండేవి. వీటికి తోడు ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో జరిగే వివిధ ఉత్సవాలకు మన పిల్లలను తీసుకు వెళ్ళడం, తోటి బాలలు రాసిన సాహిత్యాన్ని గురించి చర్చించడం, కళలు, కళాకారులను గురించి అధ్యయనం చేయడం, పరిశోధనలు జరపడం, అందుకు పిల్లలను సైతం ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను అకాడమి ఎంతో ఉత్సాహంగా జరిపింది. ఇవేకాక సాహిత్యంలోనూ, కళలలోనూ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వడం, బాలల కోసం రచనలు చేస్తున్న రచయితలకు పురస్కారాలు అందించడం, బాలల గ్రంథాలయాలు నెలకొల్పడం, పాఠశాలల్లో గ్రంథాలయాలకు చేయూతన్విడంతోపాటు బాల సంఘాలు, ఫిలిం క్లబ్లు, బాల భవన్లు మొదలైన వాటిని ఏర్పాటు చేయడం వంటివి బాలల అకాడమి నిర్వహించింది. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో విలక్షణ కార్యక్రమాలను రూపొందించడమే కాక అకాడమి 1977 ఫిబ్రవరి 10 నుండి 13 వరకు 'ఆంధ్ర ప్రదేశ్ బాలల మహాసభలు' కేశవ మెమోరియల్ హైస్కూల్లో నిర్వహించింది. 408 మంది పిల్లలు, 191 మంది పిల్లల సహాయకులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఈ సభల్లో పాల్గొన్నారు. ఆ సభల స్ఫూర్తితో రచయితలుగా, కళాకారులుగా మారిన ఎంతో మంది ప్రసిద్ధ బాలల రచయితలు ఆ సభలను ఇప్పటికీ జ్ఞాపకం చేసుకోవడం విశేషం.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో విలక్షణ ప్రగతిని, అభివృద్ధిని సాధించిన తెలంగాణా బాలల వికాసం దిశగా కూడా పనిచేయాల్సిన అవసరముంది. ఏ దేశమైనా, జాతి అయినా తమ భాషా సాంస్కృతిక వికాసం కొరకు పనిచేస్తుందో అప్పుడే అది తన అస్తిత్వాన్ని నిలుపుకోగలుగుతుంది. వారసత్వాన్ని తదనంతర తరాలకు అందజేయగలుగుతుంది. నన్నయకు పూర్వమే పంపకవి, జిన వల్లభుడు వంటి వారి వారసత్వాన్ని, 'ఆదికవి' పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతనల ప్రాభవాన్ని గుండెల మీద నిలుపుకుని చాటుకునే తెలంగాణ ఆ దిశగా పనిచేయాల్సిన సమయమిది. ఎన్నెన్నో కొత్త కొత్త ఆశలు, ఆలోచనలతో అయిదేండ్ల ప్రస్థానం చేసిన తెలంగాణా ప్రభుత్వం భాషా, సాహిత్య, సాంస్కృతిక వికాసం దిశగా దృష్టిని పెట్టినట్టే పిల్లల సాహిత్యం, బాలల కళలు వంటి వాటికి ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటుచేయాల్సిన సందర్భం మన ముందుంది. దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా ఈ బాలల అకాడమి లేకపోవడంతో తెలుగు పిల్లలు ఎంతగా నష్టపోయారో చెప్పలేం. మా తరం కోల్పోయిన ఆ అవకాశాలను ఇప్పుడు మళ్ళీ మేం అందుకోలేక పోవచ్చు కానీ రేపటి వారసులైన మన పిల్లలు కూడా నష్టపోవడం జరగకూడదు. వీటికి తోడుగా జాతి వైతాళికులు, జాతి రత్నాలు, విస్మృతికి గురైన సాంస్కృతిక అంశాలు, ఇప్పటిదాకా జరిగిన ఉద్యమాలు, వివిధ ఘట్టాలను రేపటి తరానికి పరిచయం చేసే గురుతర బాధ్యత కూడా మనపైననే ఉంది. ఇవన్నీ పుస్తకాలుగా పిల్లల కోసం బాలల అకాడమి ప్రచురణగా తేవాలి. బాల వికాసం గురించి మాట్లాడుతూ 'కేవలం మంచి బడి, ఆట వస్తువులే కాదు మన సంస్కృతి, సాహిత్యం, మూలాల్ని కూడా మన పిల్లలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది' అంటారు బాలచెలిమి కారుడు మణికొండ వేదకుమార్. మన పిల్లల్లో ఉన్న ఈ ఖాళీలను పూరించేది అచ్చంగా బాలల అకాడమి అన్నది నిజం. ఇది ఒక్క తెలంగాణా విషయంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరగాల్సిన అవసరముంది. మన పిల్లల కోసం, రేపటి దివ్వెల కోసం ప్రభుత్వం వెంటనే బాలల ఆకాడమి వినూత్న లక్ష్యాలతో ఏర్పాటు చేయాలి. 'బాలల వికాసమే భవిష్యత్తుకు సోపానం' కనుక బాలల అకాడమితో పాటు నూతనంగా 'తెలంగాణ బుక్ ట్రస్ట్', 'అనువాద అకాడమి'లు కూడా ఏర్పాటు చేసుకుంటే భాష, సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో బంగారు తెలంగాణా అన్ని అడుగులు పూర్తయినట్లే. చేసే గురుతర బాధ్యత కూడా మనపైననే ఉంది. ఇవన్నీ పుస్తకాలుగా పిల్లల కోసం బాలల అకాడమి ప్రచురణగా తేవాలి. బాల వికాసం గురించి మాట్లాడుతూ 'కేవలం మంచి బడి, ఆట వస్తువులే కాదు మన సంస్కృతి, సాహిత్యం, మూలాల్ని కూడా మన పిల్లలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది' అంటారు బాలచెలిమి కారుడు మణికొండ వేదకుమార్. మన పిల్లల్లో ఉన్న ఈ ఖాళీలను పూరించేది అచ్చంగా బాలల అకాడమి అన్నది నిజం. ఇది ఒక్క తెలంగాణా విషయంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరగాల్సిన అవసరముంది. మన పిల్లల కోసం, రేపటి దివ్వెల కోసం ప్రభుత్వం వెంటనే బాలల ఆకాడమి వినూత్న లక్ష్యాలతో ఏర్పాటు చేయాలి. 'బాలల వికాసమే భవిష్యత్తుకు సోపానం' కనుక బాలల అకాడమితో పాటు నూతనంగా 'తెలంగాణ బుక్ ట్రస్ట్', 'అనువాద అకాడమి'లు కూడా ఏర్పాటు చేసుకుంటే భాష, సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో బంగారు తెలంగాణా అన్ని అడుగులు పూర్తయినట్లే.
- డా||పత్తిపాక మోహన్,
9966229548