Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనులు వాయిదా వేయవద్దు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. పనులు పూర్తి చేశామన్న మానసిక తృప్తి మిగులుతుంది. జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలనుకునే వారు పనులు వాయిదా వేసే అలవాటును మానుకోవాలి. తలపెట్టిన ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తే పూర్తి చేయాల్సిన పనుల జాబితా తగ్గుతుంది. ఏదైనా ఒక పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయకుండా రేపు మాపంటూ వాయిదా వేసుకుంటూ పోతే ఆ తరువాత జరిగే నష్టం అపారం. తగిన సమయం కేటాయించకపోవడం, బద్ధకం, తగిన ప్రణాళిక లేక పోవడం వల్ల వ్యక్తిత్వ వికాసంపై ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓడిపోతామనే భయం, పట్టుదలగా ప్రయత్నం చేయకపోవడం, నుదుటి రాత సరిగా లేదని సర్దుకుపోవడం వల్ల చాలా నష్టం జరుగుతున్నదని వారంటున్నారు. ఈ కారణం వల్ల ఒక మనిషిలోని సహజమైన ప్రతిభ, సత్తా వెలికి రాకుండా మూఢ నమ్మకాలు అడ్డుపడుతున్నాయి. ఫలితంగా ఈ ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు నిస్సారంగా జీవనం సాగిస్తున్నారు. కర్మ ఫలితం అంటూ అపజయానికి కారణాలు చెప్పే వారంతా బద్ధకంతో బాధపడే వారేనని, పనులు వాయిదా వేసే అలవాటు ఉన్నవారేనని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయాలను కొత్త సంవత్సరంలో కచ్చితంగా అమలు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ పట్టుదలగా పని పూర్తి చేయలేక చతికిల బడతారు. దానికి అనేక సాకులు చెబుతారు. తమ అదృష్టం బాగాలేదని, ఏ పని చేపట్టినా కలిసి రావడం లేదని వాపోతారు. 90 శాతం పనులు అమలు కాకుండా వాయిదా పడేందుకు కారణం బద్ధకమేనని చాలామంది గుర్తించరు. ఉదాహరణకు భార్యభర్తల మధ్య జరిగే కీచులాటలు, గిల్లికజ్జాల్లో అధిక శాతం ఇద్దరిలో ఎవరో ఒకరికి వాయిదా వేసే అలవాటు ఉండడమేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ బిల్లుల బకాయిలు, పరీక్ష ఫీజులు, బీమా డబ్బుల చెల్లింపులో 80 శాతం మంది వ్యక్తులు గడువు ముగిసే వరకు మేల్కొనరు. క్రెడిట్ కార్డు విషయంలో 90 శాతం మంది నిర్దేశించిన సమయంలో చెల్లిద్దామని భావిస్తారు. పని ఒత్తిడిలో మరచిపోతారు. గడువు ముగిసిందని బాధపడి జరిమానా చెల్లిస్తారు. ప్రస్తుత రోజుల్లో అలస్యం విషంతో సమానమేనని వ్యక్తిత్వ వికాస నిపుణుల ఆంతరంగం.
స్మార్ట్వర్క్ పేరుతో చివరి నిమిషంలో లక్ష్యాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పైకి లోపంగా కనిపించని ఇలాంటి లక్షణం ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశాలున్నవారిని పాతాళానికి తొక్కేస్తుంది. ఒక మనిషికి ఎన్ని తెలివితేటలున్నా, మంచి ప్రతిభ ఉన్నా, బద్ధకం, వాయిదా వేసే గుణం ఎవరినీ ముందుకు సాగనియ్యదు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, అధికారులు, రాజకీయనాయకులు ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజల్లో వాయిదా వేసే అలవాటు కనిపిస్తోంది. ఫలితంగా తాము వెనుక బడిపోతున్నామని గుర్తించి అనేక మంది మానసిక నిపుణులను సంప్రదిస్తున్నారు. ఆకాశం విరిగి మీద పడుతున్నా, తొణకని, బెణకని మనోనిబ్బరం కొందరిది. ఇంకొందరు వ్యక్తులు తమకు అప్పగించిన పనులు చివరి నిమిషం వరకు చేపట్టరు. ఇలా పనులు వాయిదా వేసే వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుందని, నిద్రలేమి సమస్య ఉంటుందని ఇజ్రాయెల్ దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
రెండేండ్ల క్రితం 600 మంది వ్యక్తులపై అనేక పరిశోధనలు చేశారు. తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయని వారిలో అనేక ఆలోచనలు చక్కర్లు కొడుతుంటాయి. దాని వల్ల నిద్రకు దూరమవుతారు. ఉదయాన్నే దిన చర్యను ప్రారంభించనందువల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. అన్ని పనులకు సమయం సరిపోదు. అతి నిద్రతో బద్ధకం అలవడుతుంది. ఈ రెండూ అంశాలు ప్రతికూల ఆలోచనలకు కారణమై అపజయాన్ని తీసుకు వస్తాయి. మనిషిలో చురుకుదనం తగ్గడంతో వాయిదా వేసే గుణం అలవడుతుంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో దినచర్య చురుకుదనాన్ని దూరం చేస్తుంది. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, తగిన పాళ్లలో పోషకాహారాన్ని తీసుకోవడం, శారీరక వ్యాయామం ఒక మనిషిని ఉన్నత స్థితికి తీసుకు వెళుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
పిల్లల్లో వాయిదా వేసే అలవాటు దూరం కావాలంటే ముందుగా తల్లిదండ్రులు మారాలి. వారిని చూస్తూ ఎదిగే పిల్లలు తమలాగానే మారతారని గ్రహించాలి. అన్ని వర్గాల ప్రజలు తమకు కేటాయించిన పనులు, బాధ్యతలను ఎప్పటికప్పుడు పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి. ఆఖరి క్షణంలో హడావుడి పడకూడదు. ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలి. జీవితంలో ఒక్కొక్క వాయిదాతో జరిగిన నష్టాన్ని గుణపాఠంగా తీసుకోవాలి. అలాంటి వాయిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడితే విజయాన్ని అందుకోవడం కష్టం కాదు.
- జి గంగాధర్ సిర్ప,
9010330529