Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సగం విరిగిన ప్లాస్టిక్ డబ్బాల్లో మట్టి ముంతల్లో, వాడకుండా పడేసిన గిన్నెల్లో ఇంటి ముందో వెనకో పగిలిపోయిన బండల సందుల్లో వున్న నీళ్ళల్లో పుట్టి పెరిగీ, గుంపులు గుంపులుగా ఇళ్ళల్లోకి జొరబడ్తున్న దోమల గ్యాంగులు 'ఎదురే మాకు లేదు మమ్మెవరూ ఆపలేరు' అనే పాటని హమ్ చేస్తూ మనుషుల ఒంటి మీద ఎక్కడ ఖాళీ కనపడితే అక్కడ సెటిలయి కనిపించని స్ట్రాలతో విందు చేసుకుంటున్న సీజను.
దోమకాటుకి కొందరు ఒళ్ళు వేడి పెనం అయిన వాళ్ళయితే, కొందరు కళ్ళు పీక్కుపోయిన వాళ్ళయితే, మరికొందరు కళ్ళు తేలేసే వాళ్ళయిపోవడంతో ఆసుపత్రులు కిటకిటలాడేయి. ఖాళీ కొబ్బరి చిప్పలో వున్న చారెడు నీళ్ళలో కళ్ళు తెరిచిన టైగర్ దోమల ఫ్యామిలీ ఒకటి ఇంటి గుమ్మంలోనుంచి లోపల్కి జొరబడ్డది. వాటిల్లో ఒక దానికి ఇంటి పెద్దాయన బ్లడ్ బాగా టేస్టీగా అనిపించి ఆయన పాదం మీద ముద్దు పెట్టి పిక్క మీద సెటిలయి బ్రేక్ఫాస్ట్ చేసి బ్రేవుమంది. ఇంకేంవుంది.. సాయంత్రానికల్లా రెక్కాడితే తప్ప డొక్కనిండని సత్తయ్య కుక్కి మంచానికి అతుక్కుపోయేడు.
మర్నాడు పనికి పోవడానికి సత్తయ్యకి సత్తువ లేకుండా పోయింది. అది మామూలు జ్వరం కాదని డెంగ్యూనో, చికెన్ గున్యానో, మలేరియానో, మరో మాయదారి జ్వరమేమోనని చుట్టుపక్కల వాళ్ళు భయపెట్టడంతో ప్రైవేట్ డాక్టర్ని సంతృప్తి పరిచే శక్తి లేని భార్యా కొడుకూ సత్తయ్యని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళేరు.
అది ఆసుపత్రిలా లేదు. తిరనాళ్ళలా వుంది. జాతర జరుగుతున్నట్టు జనం జ్వరాల్ని ఒంటి మీద మోస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి క్యూలు కట్టేరు. బాగా తిండితిని అలసిపోయిన కొండచిలువలా క్యూలు భారంగా కదుల్తున్నాయి. ఎలాగో తంటాలు పడి సత్తయ్యని డాక్టర్ దగ్గరకి చేరిస్తే అతని ఒంటి మీది వెచ్చదనం మామూలు జ్వరం కాదని, అతన్ని ఆసుపత్రిలో చేర్పించాల్సిందేనని, అయితే ఆసుపత్రిలో పడకల్లేవని, మందులు కూడా లేవని అన్నాడు.
మరో దిక్కులేక నేలమీద పడి వుండటానికి ఒప్పుకోడంతో సత్తయ్యకి ఓ మూల దొరికింది. ఒంట్లో వేడి, ఒంటి కింద బండరాళ్ళ చల్లదనం, కిటికీలో వేలాడదీసిన సీసాలోంచి సత్తయ్య ఒంట్లోకి ఎక్కుతున్న ద్రవం... ఈ దృశ్యం ఒక్క సత్తయ్యకు సంబంధించినదే కాదు. అలాంటి వాళ్ళు చాలామంది వరండాలో నేలమీద వరసకట్టారు.
ఇంటి నుంచి ఓ ఈత చాపో, పాత బొంతో తెచ్చి ఉండాల్సింది అనుకుంది భార్య. ఇంటికి వెళ్ళి ఏదైనా తేవాలి అనుకున్నాడు కొడుకు. అయితే ఓ రోజంతా అలా పడుకున్నాక సగం చిరిగిన చాప ముక్క ఒకటి అందింది సత్తయ్యకి.
మర్నాడు కూడా సత్తయ్యకి జ్వరం కాలుతూ వేలుతూ వుంది. నేలమీద చాలీచాలని చాపమీద పడుండడంతో ఒంటి నెప్పులు విపరీతంగా పెరిగేయి.
సాయంత్రం వరకల్లా తనకు పరుపు వేస్తారని నర్సు చెప్పడంతో సత్తయ్య కళ్ళకి పరుపే కనపడసాగింది. కొంచెం మెత్తగా పడుకోడానికి వుంటే ఒళ్ళు నెప్పులు తగ్గుతాయి, జ్వరం మాట వింటుంది అనుకున్నాడు.
నర్సు అన్న సాయంత్రం రాలేదు కానీ, మర్నాడు మధ్యాహ్నం సత్తయ్యకు పరుపు దొరికింది. అంత జ్వరంలోనూ అతని పెదాలమీద చిరునవ్వు మెరుపయ్యింది. పరుపు మీద ఎంతహాయిగా వుందో అనుకున్నాడు. ఇష్టంగా మందు బిళ్ళలు మింగాడు. పళ్ళు బిగబట్టి ఇంజక్షన్లు భరించాడు.
ఇక ఒకటి రెండు రోజుల్లో సత్తయ్య లేచి కూచుంటాడనుకున్నారు భార్యా కొడుకూ. సత్తయ్యకు రెండు రోజుల్లో జ్వరం దిగలేదు. కానీ మంచం ఇవ్వబోతున్నామని డాక్టరమ్మ చెప్పింది. ఎందరో కటిక నేలమీద, చాపలమీద పడుంటే సత్తయ్యకు మంచం దొరుకుతున్నందుకు సంతోషపడ్డారు భార్యా కొడుకూ. తనకు మంచం మీద పండుకునే అవకాశం వస్తున్నందుకు సత్తయ్య సంబరపడ్డాడు. మంచం మీదకి చేరావంటే మరో రోజులో హాయిగా ఇంటికి వెళ్ళిపోతావులే అంది నర్సు. సత్తయ్యకు మంచం దొరుకుతున్నందుకు నేలను కర్చుకుని ఉన్న కొందరు జ్వరపీడితులు ఈర్ష్య పడ్డారు.
ఇంకాసేపట్లో మంచం వస్తున్న సమయంలో పరుపు మీద చాలాసేపు అటూ ఇటూ మెసిలి మూల్గులు ఆపి కళ్ళు మూసుకున్నాడు సత్తయ్య. మంచం రానే వచ్చింది. కింద పరుపు మీద పడున్న సత్తయ్యను మంచం మీదకి చేర్చడానికి ప్రయత్నించిన వార్డుబోరు మొదట కెవ్వుమని తర్వాత డాక్టర్... డాక్టర్ అంటూ పరుగెత్తాడు.
సత్తయ్యకు మంచం ఎక్కేయోగం లేకుండా పోయింది!!
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులూ మంచాలూ కరువే అయినా మామూలు మనుషుల చివరి ప్రయాణానికి అవి చేసే సేవల్ని మెచ్చుకోవలసిందే!!
- చింతపట్ల సుదర్శన్,
9299809212