Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువుకీ ఒక అర్థం వుంటుంది. ప్రకృతి మనకు ఎంతో సమాచారాన్ని అందిస్తుంది. సందేశం ఇచ్చే శక్తిలా తోడుగా నిలిచి, మనకు జీవన మార్గం అవుతుంది. ఇలాంటి ఎన్నో ఆలోచనల కలయికతో తన కళాప్రయాణాన్ని సాగిస్తాడు దేవరాజ్ డాకోజీ. హైదరాబాద్ దగ్గర వున్న ధర్మోజీ గూడెం లో 1944లో జన్మించాడు. 1965లో హైదరాబాదులోని జెఎన్టియు ఫైన్ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పట్టా పొంది, ఆపై లలిత కళా అకాడమి వారి స్కాలర్షిప్ మీద బరోడాలోని ఫైన్ఆర్ట్స్ ఫాకల్టీలో ప్రింట్ మేకింగ్ కళలో మాస్టర్ డిగ్రీ పొందాడు. గత మూడు దశాబ్దాలుగా న్యూయార్క్లోని రాబర్ట్ బ్లాక్ బర్న్ ప్రింట్ మేకింగ్ సంస్థలో మాస్టర్ ప్రింటర్గా పనిచేస్తూ, ప్రింట్ మేకింగ్ పాఠాలు చెపుతూ, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ వున్నాడు. తన మనసుకు ఎంతో నచ్చిన ప్రింట్ మేకింగ్ కళపై యువతరానికి అవగాహన పెంచటం కోసం, తనకు మరింత నిపుణత వున్న లిథోగ్రఫీ (సున్నపురాయిపై చిత్రాలు) గీసి, ప్రింట్లు తీసే పద్ధతిలోని మెళకువలను నేర్పిస్తున్నాడు.
ఈయన చిన్నతనం తన సొంతవూరైన ధర్మోజీ గూడెంలోనే గడచింది. తల్లి జ్ఞాపకాలు ఇతనికి ఎంతో సంతోషం కలిగిస్తాయి. ఇతనికి చిన్నతనాన లెక్కలు, ఇంగ్లీష్ పాఠాలు సరిగా రాక ట్యూషన్ టీచర్ వద్ద చదువుకుంటూ మధ్య ఖాళీ సమయంలో బొమ్మలు గీసేవాడు. ఆ టీచర్ ఇతన్ని ''ఏమిరా పెద్దైనాక ఆర్టిస్ట్వి అవుతావా?'' అని అడిగేవాడట. ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయటం ఈయనతో పాటు పెరిగి పెద్దదవుతూ వచ్చిన అలవాటు. ఇతని తండ్రి, తాతలు ఆయుర్వేద వైద్యులు. తండ్రి వృత్తిరీత్యా హైదరాబాద్కి మారినప్పుడు, కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. తండ్రిని ఒప్పించి ఫైన్ ఆర్ట్స్ విద్యలో చేరాడు. తన తమ్ముడు కాశ్మీర్లో జబ్బుపడితే, అతనికి సాయం చేయడానికి వెళ్ళి అక్కడి ప్రకృతి, పరిసరాల అందాలను డ్రాయింగ్లు, చిత్రాలుగా వేసి హైదరాబాద్లో 1965లో ప్రదర్శన ఇచ్చాడు. ఆనాటి మంత్రి పి.వి.నరసింహారావు గారు ప్రదర్శన ప్రారంభించి, చిత్రాలలోని కాశ్మీర్ పరిసరాలను, సంస్థలను గుర్తిస్తూ ఎంతో సంతోషించారట.
ఈ విధంగా పరిసరాలను గుర్తించగలిగేలా నిపుణతతో వేసే ఇతని రూప చిత్రాలు, ఆపై నిరూప చిత్రాలుగా మారాయి. ఆరోజుల్లో హైదరాబాదు చుట్టుపక్కలంతా కొండలు గుట్టలు విరివిగా వుండేవి. రాత్రిపూట వాటిని చూస్తే మనుషులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా అనిపించేదట దేవరాజ్గారికి. తర్వాత పట్టణీకరణ పెరిగిపోయే క్రమంలో ఈ కొండలు, గుట్టలు మాయమవుతూ వచ్చాయి. బంజారాల నివాసంగా ఉన్న కొండలు ఇప్పుడు ఆధునిక భవంతులకు ఆలవాలమై 'బంజారా హిల్స్' అవ్వడం ఇందుకు మంచి ఉదాహరణ. కొండలు, గుట్టలు, పక్షులు, ప్రకృతిలోని ఇతర ఆకృతులను ఆయన నేస్తాలుగా భావిస్తాడు. అందుకే తన నేస్తాలకే తన చిత్రాల్లో చోటుకల్పించాడు. ఈ అన్నింటి మధ్య గల ప్రాపంచిక సంబంధాలను గురించి ఆలోచిస్తూ చిత్రాలు గీస్తాడు. బుద్దుడి ఆలోచనా తత్వాన్ని సమర్థించే ఇతనికి ప్రకృతి, మానవాళి అందరిలోనూ ఒక ఆత్మీయత కనిపిస్తుంది. ప్రేమానుబంధాలు అత్యవసరమనుకుంటాడు. ప్రకృతిలో ప్రతిజీవీ, వస్తువూ (జీవులు, నిర్జీవులు) సమానమే. అన్నీ గౌరవానికి అర్హమైనవే అంటాడు. చిన్నపిల్లల డ్రాయింగ్ల లాగానో, బొమ్మల లాగానో వేసే ఈయన చిత్రాలు గొప్ప పేరు పొందిన పాశ్చాత్య కళాకారుడు పాల్క్లీని గుర్తుకు తెస్తాయి. కంటికి ఎదురుగా కనిపించే రూపాలకన్నా, ఆ రూపాల లోతుల్లో దాగి వున్న ప్రకృతి అర్థాలను, సంబంధాలను, అర్థం కాకుండా వున్న సృష్టి రహస్యాలను గీతలుగా పట్టుకోవడానికీ, తన కాన్వాస్పై చిత్రించడానికీ ప్రయత్నిస్తాడు.
నిరాటంక ఆలోచనలే కాదు, నిరంతరం పని చేసే గుణమూ ఇతనిలో వుంది. న్యూయార్క్ స్టూడియోలో మాస్టర్ ప్రింటర్గా పని చేస్తున్న కారణంగా ముఖ్య కళాకారుల చిత్రాలను ప్రింట్లుగా తీయాలనుకున్నప్పుడు వారిని నిరంతరం కలిసి సంప్రదించాల్సి వచ్చేది. ఆ కారణంగా ఎనిమిది సంవత్సరాల పాటు నిరంతరం మాన్హట్టన్ నుండి బాబిలాన్ వరకూ రైలులో ప్రయాణించవలసి వచ్చేది. ఆ ప్రయాణ సమయంలో రైలు టికెట్టు మీదనే డ్రాయింగ్లు గీసేవాడట. అవన్నీ భద్రపరచి, అందులో 100 చిత్రాలు ఎంచుకుని డిసెంబర్ 2015, జనవరి 2016లలో ప్రదర్శన చేశాడు. ఇతని మరో ప్రదర్శన శీర్షిక 'వీల్ ఆఫ్ లైఫ్'. జీవితంలో మానవ ప్రయత్నం అనే చక్రాన్ని అదృశ్యంగా వుంచి, శక్తినిచ్చి నడిపేది ప్రకృతి. ప్రకృతి, ఆ సృష్టి శక్తికి దర్పణం అనుకుంటే, ఆ శక్తి మన జీవితాలకు మరో చక్రం అయి నడిపిస్తుంది. ఈ లోతైన ఆలోచనలకు అందమైన రూపాలిస్తాయి ఇతని చిత్రాలు.
ప్రఖ్యాత కళాకారుడు ఎం.ఎఫ్.హుసేన్ కూడా తన చిత్రాలకు ప్రింట్లు తీసే బాధ్యత దేవరాజ్కు అప్పగించేవాడు. ప్రింట్ మేకింగ్ పద్ధతిలో ఎన్నో నిబంధనలు, టెక్నిక్లు ఇమిడి వుంటాయి. దేవరాజ్ వివరించి చెప్పేదేమిటంటే... కళాకారుడిలోని సృజనాత్మకత... టెక్నిక్లను, నిబంధనలను ఒక అడ్డుగా చూడదు. దానిని దాటి కొత్త ప్రయోగాలతో అర్థవంతమైన చిత్రాలను రూపొందించగలుగుతారు కళాకారులు. ఎం.ఎఫ్.హుసేన్కి కావలసిన రకంగా సృజనాత్మక ప్రింట్లు, చిత్రాలు తీయవలసి వచ్చినప్పుడు దేవరాజ్, షింకొలే అనే ప్రింట్ పద్ధతిలో చిత్రాల ప్రింట్లు తీసి హుసేన్కి సాయం చేశాడు.
1996లో దేవరాజ్, తన భార్య ప్రతిభతో కలిసి ఢిల్లీలో అటలియర్ - 2221 అనే ఒక ప్రింట్ మేకింగ్ స్టూడియోని నిర్మించారు. కళాకారులు తమ చిత్రాలకు ఎడిషన్స్ తీయటానికి ఇండియాలో అదే మొదటి స్టూడియో ఆనాడు. కానీ ఎక్కువ కాలం దానిని నడపలేక అమెరికా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆనాడు ఎక్కువమంది కళాకారులు ప్రింట్మేకింగ్ కళకి మార్కెట్ లేకపోవడం వలన ఆ పద్ధతి వదిలేశారు.
బ్రిటీష్ కౌన్సిల్ స్కాలర్షిప్పై 'చెల్సియా' లలిత కళా పాఠశాలలో చదువుకున్నాడు. 76 - 77 లలో యూరోప్లో చాలా చోట్ల ప్రయాణించాడు. 1991లో భోపాల్లో జరిగిన గ్రాఫిక్ అంతర్జాతీయ ప్రింట్ ద్వితీయ సంవత్సర ప్రదర్శనకు కమిషనర్గా, న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. ఢిల్లీలోని లలిత కళా అకాడమి వారి గార్హీ స్టూడియోలకి సూపర్వైజర్గా, ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేశాడు. 1975లో స్వర్ణపతకం, 1983లో నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. 2015లో జాన్ మిషేల్ సంస్థకి ఎన్నికయ్యాడు. మన దేశంలో, విదేశంలో పేరు గాంచి ప్రదర్శనలిచ్చిన దేవ్రాజ్ వాటర్ కలర్స్, కాన్వాస్లపై కూడా అంతే గొప్ప చిత్రాలు వేస్తాడు.
- డా||ఎం.బాలామణి,
81067 13356