Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్ ప్రబలమైన, ప్రభావవంతమైన సృజన. సృజనాత్మక సాహిత్యంలో మకుటాయమానమైన ప్రక్రియ. పాఠకుల మన:ప్రపంచానికి వెలుగుదారులు చూపే అద్భుత సృష్టి. మనిషి అనుభవ పరిధిని విస్తరింపజేసే విలక్షణ సాహిత్య వనరు. వాస్తవికత, కాల్పనికతలకు నడుమ సరిహద్దుల్ని చెరిపేస్తూ కొత్తలోకాల్ని దర్శింపజేసే రీతి సైన్స్ ఫిక్షన్ విశిష్టత. సైన్స్ ఫిక్షన్ రచయితల ఊహాశాలిత అనుపమానం, అపారం. అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక పోకడలకు సంబంధించిన ఒక సాహిత్య విస్ఫోటనం సైన్స్ ఫిక్షన్. సైన్స్నీ, కాల్పనికతనీ మేళవించిన సృజనాత్మక ఇంద్రజాలం.
ఈ ఇంద్రజాలం తొలుదొలుత కె.సదాశివరావు గారి కథల ద్వారా పరిచయమయింది. గత ఆరేళ్ళుగా వారు రాసిన సైన్స్ ఫిక్షన్ కథలు, సైన్స్ ఫిక్షన్ రచయితల పరిచయాలు సైన్స్ ఫిక్షన్ మీద పాఠకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. సైబర్ జస్టిస్, సరస్వతీ తీరాన, డాక్టర్ అశ్విని ఎం.డి., గాలక్టిక్ బార్, త్రికాలసంధి కథల ద్వారా తెలుగు కాల్పనిక సాహిత్యంలోకి సైన్స్ ఫిక్షన్ని బలంగా ప్రవేశపెట్టారు. బ్రహ్మసూత్రం, ఆత్మాఫాక్టర్, మానవ ఫాక్టర్ వంటి కథల్ని ఇరవయ్యేళ్ళ కిందటనే రచించినప్పటికీ 2010 తర్వాత రాసిన కథల ద్వారా తెలుగు పాఠకులకు సైన్స్ ఫిక్షన్ పైన మమకారాన్ని ఇనుమడింపజేశారు.
గ్లోబలైజేషన్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్, సైన్స్ ఫాంటసీ సంబంధిత సినిమాలు తెలుగునేలమీదకు వచ్చాయి. కొత్త తరం ఈ సినిమాల్ని ఆస్వాదిస్తోంది. కానీ సైన్స్ ఫిక్షన్ సాహిత్యం మాత్రం పాఠకుల్లోకి అంతగా చొచ్చుకుపోలేదు. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ పాఠకుల పరిధి విస్తరించలేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల ఫలాల్ని అనుభవిస్తున్నప్పటికీ వాటిని తమ జీవితాచరణలోకి తీసుకోలేని దౌర్బల్యం భారతీయుల్లో, ప్రత్యేకించి తెలుగు వారిలో ఉంది.
సైన్స్ అంటే ఇంజనీరింగ్ చదువులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అమెరికా తదితర దేశాలకు కొలువుల కోసం తరలిపోయేందుకు తోడ్పడే ఉపకరణంగానే చూస్తున్నారు. అంతే తప్ప శాస్త్రీయ వివేచనకీ, శాస్త్రీయ దృష్టికోణం సంతరించుకోడానికి తోడ్పడేదిగా అర్థం చేసుకోలేకపోయారు. కనుకనే మన దగ్గర సైన్స్ చదువుల అర్థం, కుదించుకుపోయింది. తెలుగు ప్రచురణ, సాహిత్య రంగాల్లోనూ నేలబారు ఆలోచనలే రాజ్యమేలుతున్నాయి. ఈ కారణంగా రామాయణ, మహాభారతాలు, లలితనామ స్తోత్రాలు, జ్యోతిష్యగ్రంథాలే తెలుగువారి ఇళ్ళల్లో కొలువుదీరాయి. రచయితలు సైతం రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఉపనిషత్తులు, బౌద్ధగాథలనే మరల మరల తిరగరాస్తున్నారు. రాసిందే రాయడం, చెప్పిందే చెప్పడమనే విదూషకత్వం ఇక్కడి రచయితల భావదారిద్య్రాన్ని, సృజనలేమిని తెలియజేస్తున్నది.
ఈ నేపథ్యంలో గత ఎనిమిదేళ్ళుగా సదాశివరావు పరంపరగా రాస్తున్న సైన్స్ ఫిక్షన్ కథలు, సైన్స్ ఫిక్షన్ రచయితల పరిచయ వ్యాసాలు గొప్ప కనువిప్పు, ఈ తరానికి గొప్ప మేల్కొల్పు. గొప్ప సాహిత్యం కోసం, వినూత్నమైన సృజన కోసం దప్పికగొన్నవారి దాహం తీర్చే సృజనాత్మక సంపద వారు మన ముందు పరచిన సైన్స్ఫిక్షన్ రచయితల సాహిత్య ప్రపంచం.
సైన్స్ ఫిక్షన్కు సంబంధించిన తొలి నవలా కర్త మేరీషెల్లీ (30 ఆగస్టు 1797-2 ఫిబ్రవరి 1851) గురించి తెలుసుకోడం మరింత ఆసక్తికరం. పందొమ్మిదో శతాబ్దపు తొలినాళ్ళలో ఆమె సైన్స్ ఫిక్షన్ రచనలు చేసింది. వాటిలో ఆమె రాసిన 'ది ఫ్రాంకెన్ స్టీన్' (1818) నవల ఈనాటికీ నిలిచి వుంది. ఈ నవల ఆధారంగా ఇప్పటికే 35 సినిమాలు వచ్చాయంటే దాని విశిష్టతని అర్థం చేసకోవచ్చు. రెండువందల సంవత్సరాల కిందటి రచన నేటితరం పాఠకుల్ని సైతం చదివించడం అద్భుతం. ఈ నవల ఇతివృత్తాన్ని, రచయిత్రి మేరీ షెల్లీ జీవితంలోని మలుపుల్ని, ఆమె ఇతర రచనల వైశిష్ట్యాన్ని అర్థం చేసుకోడానికి సదాశివరావు వ్యాసం మార్గం చూపింది.
మేరీషెల్లీతో మొదలయిన సైన్స్్ ఫిక్షన్ రచయితల పరిచయ వ్యాసాల పరంపర ఎనభై వ్యాసాలని దాటింది. వీటన్నిటిని చదవడం తెలుగు పాఠకులకి ఒక ఐంద్రజాలిక అనుభవం. సైన్స్ ఫిక్షన్ రచయితలది ఒక్కొక్కరిది ఒక్కొక్క పార్శ్వం. ఒక్కొక్కరి జీవితం వైవిధ్యభరితం. ఎవరికీ జీవితం వడ్డించిన విస్తరి కాదు. కొద్దిమందికి తప్పిస్తే అనేకమంది సైన్స్ ఫిక్షన్ రచయితలు జీవితానికి ఎదురీదినవారే. కాలానికి ఎదురీదుతూ రచయితలుగా తమ ప్రయాణాన్ని సాగించిన వారే.
సదాశివరావు రాసిన ఈ వ్యాసాలు ఆసక్తిని కలిగించడానికి ప్రబలమైన కారణం రచయితల జీవిత విశేషాల సమాహారాన్ని అందించడం. కేవలం ఆయా రచయితల రచనల ప్రాధాన్యం చెప్పడం వరకే పరిమతం కాలేదు. అసలు ఈ పరిచయ వ్యాసాలని రాసిన పద్ధతిలోని ఆకర్షణ ఉంది. మొదట ఆయా రచయితల భావధారనీ, ఆలోచనా స్రవంతినీ తెలియజెప్పే వారి మాటల్ని కొటేషన్లుగా అందించారు. ఆయా రచయితల రచనల్లోని, మాటల్లోని సారభూతమైన అంశాల్ని ఎంచుకొని చెప్పడం వల్ల చదువరికి ఆసక్తి కలుగుతుంది. ఇక ఆ తర్వాత ఆయా రచయితల జీవిత నేపథ్యం, పుట్టి పెరిగిన పరిస్థితులు, వారి తల్లిదండ్రులు, వారి బాల్యం, చదువులు, ఉద్యోగాలు, రచనా రంగంలోకి ప్రవేశించిన తీరుని తెలియజెప్పిన విధం పఠితలో ఆసక్తిని పెంచుతుంది. ఒక మనిషి రచయితగా మారడానికి, మారాక నిలదొక్కుకోడానికి, ప్రభావవంతమైన రచనలు చేయడానికి దోహదం చేసిన నేపథ్యం చాలా కీలకం. ఆ నేపథ్యాన్ని ఆసక్తికరంగా వివరించారు సదాశివరావు.
నిజానికి ఇవి కేవలం పరిచయ వ్యాసాలు కావు. సైన్స్ ఫిక్షన్ రచయితల సాహిత్యాన్ని విశ్లేషించే విమర్శనా వ్యాసాలు. ఎందుకంటే రచయితల సమాచారం, రచనల జాబితా అయితే వికిపీడియాలోని దొరుకుతుంది. కానీ వారి రచనల్ని స్వయంగా చదివి, వారు సృజించిన సైన్స్ ఫిక్షన్ ఏ జానర్లోకి వస్తుందో, ఆయా రచయితల మీద ఎవరెవరి ప్రభావం ఉన్నదో, వారి సమ కాలికుల్లో వారికి ఉన్న స్థానం ఏమిటో సదాశివ రావు సోదాహరణంగా విశ్లేషించారు. ఈ కారణం గానే వీటిని సైన్స్ ఫిక్షన్ విమర్శనా వ్యాసాలుగా పరిగణించాలి.
వందలాది నవలలు, జీవితచరిత్రలు, ఆత్మకథలు చదివిన అనుభవం తాలూకు గాఢత, సాంద్రత సదాశివరావు సైన్స్ ఫిక్షన్ రచనల్లో కనబడుతుంది. 'ఎన్నో నూతన ప్రక్రియలకు ఆద్యుడు' అని ఎడ్గార్ అలన్ పో గురించి చెబుతారు. 'మహాప్రస్థానం'లో 'గంటలు' కవితలో పో ప్రస్తావన ఉంది. అయితే పో కవి మాత్రమే కాదు అనేకానేక ప్రక్రియల్ని సృజించిన సాహితీవేత్త. మరీ ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్లో అద్భుత రచనలు చేసిన సృజనశీలి అంటూ సదాశివరావు చేసిన విశ్లేషణ పో ని అర్థం చేసుకోడానికి దారి చూపుతుంది. అమెరికా, యూరోపియన్ దేశాలకు పరిమితంగాక ఆసియన్ దేశాలకు విస్తరించిన సైన్స్ ఫిక్షన్ కాలక్రమం లో కొత్త పుంతలు తొక్కుతూ ఎలా నిలదొక్కుకున్నదో ఈ వ్యాసాలు తెలియజేస్తాయి.
సైన్స్ ఫిక్షన్ భావనకు గల మూలాల్ని తన తొలినాళ్ళ వ్యాసాల్లో చర్చించారు సదాశివరావు. సైన్స్ వేరు, సైన్స్ ఫిక్షన్ వేరు. అలాగే సూడో సైన్స్ ఫిక్షన్ వేరు. సైన్స్ అంటే ఫాంటసీ కాదు. ఫాంటసీ కూడా సైన్స్ ఫిక్షన్లో భాగం కావచ్చు. కానీ కేవలం ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కాదనే అవగాహన ఈ వ్యాసాలు చదివితే ఏర్పడుతుంది. మనిషి ఊహాశాలితకీ, స్వప్నాలకీ ఎక్కడో చోట ఆధారం దొరుకుతుంది. ఊహల మూలంగా కాల్పనికతకు తావు ఏర్పడుతుంది. అయితే ఊహలు వేరు. నమ్మకాలు వేరు. ఊహలకు భౌతికమైన ఆధారాలు ఉంటాయి. నమ్మకాలకు ఉండవు. వినాయక చవితినాడు చంద్రుడిని చూడరాదనే నమ్మకం ఎంత అర్థరహితం! అలాగే గ్రహణం ఏర్పడిన రోజు చంద్రుడిని పాము మింగుతుందనే మాట కేవల నమ్మకం, అర్థరహితమైన, నిర్హేతుకమైన నమ్మకం.
ఇలాంటి నమ్మకాలకీ భిన్నమైనది ఊహాశాలిత. భూమి సమస్తం ధ్వంసమై పోతే మానవాళి జీవనానికి చోటు ఎక్కడ అనే ప్రశ్నలకి సైన్స్ జవాబు చెబుతుంది. ఆ జవాబులకు మూలమైన ఊహాశాలిత ఫలితంగా సైన్స్ ఫిక్షన్ రూపుదిద్దుకుంది. రోబోట్ల తయారీ, వినియోగం గురించి వందేళ్ళ కిందట కారెల్ కాపెక్ రాశారు. రోబోట్లు మనుషుల మీద తిరుగుబాటు చేసి చంపేయడం గురించి తన 'ఆర్.యు.ఆర్' నాటకంలో ప్రస్తావించారు. ఇవాళ నిజంగానే పలు సందర్భాల్లో రోబోలు మనుషుల్ని చంపేసిన ఉదంతాలు చూస్తున్నాం. వందేళ్ళ కిందట రోబోట్ల తిరుగుబాటు అనేది నాటకీకరణలో భాగంగా చేసిన కల్పన. ఆ కల్పన నిజం కావడం వైచిత్రి మాత్రమే కాదు, కాల్పనికతలోని సామంజస్యానికి నిదర్శనం. ఆర్.యు.ఆర్. (వందేళ్ళ కిందటి ఈ నాటకం ఇప్పుడూ ఇంగ్లాండ్లో ప్రదర్శితమవుతున్నది) కారెల్ కాపెక్ సైన్స్ఫిక్షన్లో భాగంగా రాసిన నాటకం.
''సైన్స్ ఫిక్షన్ అద్భుతాలను ఆవిష్కరించే సాహిత్యం, ఇది ఆధునిక విజ్ఞానపు వూహాగానాల బహుముఖాల్ని ఉపయోగిస్తుంది'' అని డేవిడ్ ప్రింగిల్ అనే విమర్శకుడు చెప్పిన విషయాన్ని సదాశివరావు ఉదహరించారు. సైన్స్ ఫిక్షన్కు అనేక నిర్వచనాలు ఉన్నప్పటికీ ఇది కొంతవరకు సంబద్ధమైంది. ఆయా రచయితల ఊహాశాలిత సైన్స్కు దగ్గరగా ఉంటుంది. అలాగే భవిష్యత్ పరిణామాల సంభావ్యతకు గల మూలాలు అంతర్లీనంగా సైన్స్ ఫిక్షన్లో ఇమిడి వుంటాయి. ఐజాక్ ఆసిమోవ్, ఆర్థర్ సి.క్లార్క్, ఫిలిప్ కె.డిక్, నార్మన్ స్పిన్రాడ్, ఎరిక్ ఫ్రాంక్ రసెల్ వంటి రచనలు చదివితే సైన్స్ ఫిక్షన్లోని బహుళ పార్శ్వాలు బోధపడతాయి. గత వందేళ్ళలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని పరిణామాల పరంపర అనేక నూతన ఆవిష్కరణలకు దారితీసిన వైనం అర్థమవుతుంది. ఆయా రచయితల ఊహాపరికల్పనలు నిజమైన సంగతి తేటతెల్లమవుతుంది.
ప్రపంచానికి జరిగే మేలు గురించి మాత్రమే కాదు, ప్రపంచంలో జరగబోయే కీడు గురించి కూడా సైన్స్ ఫిక్షన్ హెచ్చరిస్తున్నది. అప్రమత్తం చేస్తున్నది. మానవాళి నివా సానికి యోగ్యమైన ఇతర గ్రహా లలో జీవావరణం కోసం జరు గుతున్న అన్వేషణలు, పరిశోధ నలు సైన్స్ ఫిక్షన్ రచయితల ఊహాశాలిత సంబద్ధతకు నిదర్శనం.
సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసే అలవాటు ఉన్నవారిని ఈ వ్యాసాలు మరిం తగా ఆకట్టుకుం టాయి. అనేక మంది సైన్స్ ఫిక్షన్ రచయితల నవలలు సినిమా లుగా వచ్చాయి. ఈ వ్యాసాలు చదివితే ఆయా సినిమాలు ఏ నేపథ్యం లోంచి రూపొం దాయో తెలు సుకో గలుగుతాం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శరవేగంగా వచ్చే మార్పులకీ, సైన్స్ ఫిక్షన్కీ గల సంబంధాన్ని అర్థం చేసుకోడం సులువు అవుతుంది.
సైన్స్ ఫిక్షన్ రచనలు చేయడంలో రచయిత్రులు కూడా ప్రతిభావంతమైన పాత్రని పోషించారు. అందులోనూ స్త్రీవాదాన్ని మరింత విస్తృతంగా చర్చించిన వారు, చిత్రించినవారున్నారు. స్త్రీల మనోభావాల్ని ప్రతిఫలించిన రచయితలున్నారు. జూడిత్ మెరిల్, జో అన్నారస్, టానిత్ లీ, ఉర్సులా లెగ్విన్, మార్గరెట్ అట్ వుడ్ వంటి రచయితల సైన్స్ఫిక్షన్లోని వినూత్న ప్రపంచాల ఆవిష్కరణ విస్మయం గొల్పుతుంది. కొంతమంది ఇతరేతర రచనలు చేస్తూ సైన్స్ఫిక్షన్లోకి వచ్చారు. ఈ కోవలో మార్గరెట్ అట్వుడ్ ప్రముఖంగా కనిపిస్తారు. మహిళలకు సంబంధించిన ఇతివృత్తాల్ని చిత్రించిన పద్ధతి విభిన్నమైంది. అయితే ఆమె తన సైన్స్ ఫిక్షన్ నవలల్లోనూ స్త్రీలకు సంబంధించిన అంశాల్ని చర్చించారు. ప్రాపంచిక వాస్తవికతనీ, మహిళల మనోభావాలనీ సమతూకంతో చిత్రిస్తూ నవలని నిర్వహించిన విధానం ఆకర్షణీయం. అలాగే ఉర్సులా లెగ్విన్, జో అన్నారస్ రచించిన సైన్స్ ఫిక్షన్ నవలలు చదవడం ఉద్విగ అనుభవమని సదాశివరావు చేసిన విశ్లేషణలు చూస్తే తెలుస్తుంది. ఉర్సులా లెగ్విన్ రాసిన నవల 'లెఫ్ట్హాండ్ ఆఫ్ డార్క్నెస్' గురించి చెబుతూ -సైన్స్ ఫిక్షన్ పద్ధతులను తలకిందులు చేసిన నవలగా అభివర్ణిస్తారు. ఈవిధంగా సైన్స్ ఫిక్షన్ రచించిన మహిళలు అందరూ ఏదో ఒక జానర్లో తమదైన విలక్షణతనీ, భిన్నత్వాన్నీ కనబరిచారు. తత్ఫలితంగా సైన్స్ ఫిక్షన్ సంపన్నతకు దోహదం చేశారు.
సైన్స్ ఫిక్షన్ రచయితలు భిన్న మార్గాలలో ప్రయాణి స్తున్నారు. తమదైన కంఠస్వరంతో రచనలు చేస్తున్నారు. శైలీశిల్పాల్లో వైవిధ్యమైన కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయా రచయితల నైపుణ్యం, కథని, పాత్రల్ని నడిపిన సంవిధానం చకితుల్ని చేస్తుంది. ఇతివృత్తాన్ని స్వీకరించడంలోనూ, దానిని నిర్వహించడంలోనూ బహుముఖ కోణాలు దర్శనమిస్తాయి. ఆయా రచయితల సాహిత్యాన్ని విశ్లేషిస్తూ సదాశివరావు ఇచ్చిన శీర్షికలు సైన్స్ ఫిక్షన్లో ఎవరు ఏ జానర్లో రచనలు చేశారో, ఏవిధంగా పాఠకలోకాన్ని ప్రభావితం చేశారో బోధపడుతుంది.
దాదాపు వందేళ్ళ కాలంలో వివిధ జానర్లలో పేరొందిన రచయితలందరినీ పరిచయం చేస్తూ, వారి రచనల్ని విశ్లేషించడం వల్ల ప్రపంచంలోని సైన్స్ ఫిక్షన్కు సంబంధించిన దర్శనం ఈ నాలుగు సంపుటాల ద్వారా లభిస్తుంది. ఇంగ్లాండ్, అమెరికాలలోనే కాదు చైనాలోనూ సైన్స్ ఫిక్షన్ పాదుకున్న తీరు బోధపడి మనం ఎక్కడున్నామనే ప్రశ్నని రేకెత్తిస్తుంది. ఎందుకంటే తెలుగులోనే కాదు భారతదేశంలోనే సైన్స్ ఫిక్షన్ రచనలు చేసినవారు లేరు. భారతీయాంగ్ల రచయితల్లోనూ సైన్స్ ఫిక్షన్ సృజించిన వారు కనిపించడం లేదు.
సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు చదవడమేకాదు, సైన్స్ ఫిక్షన్ రచయితలతో స్నేహ సంబంధాలున్న రచయిత సదాశివరావు. జేమ్స్ గన్తో ఇటీవలి కాలంలో రెగ్యులర్గా సంభాషిస్తున్నారు. అలాగే ఫిజిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీత కిప్ త్రోన్ వంటి వారితో మితృత్వం ఉంది. గార్డన్ ఆర్. డిక్సన్ మొదలైన వారికి ఉత్తరాలు రాసేవారు. ఈవిధంగా నిత్యమూ, నిరంతరమూ సైన్స్ ఫిక్షన్ గ్రంథాలతో, రచయితలతో ఉన్న సంబంధమే సదాశివరావుతో ఈ వ్యాసాలు రాయించాయి. ఈవిధంగా తెలుగు పాఠకలోకానికి ఒక గొప్ప కానుకని అందించారు.
విశ్వసాహిత్యంలో విలక్షణ పాత్రని పోషిస్తున్న సైన్స్ ఫిక్షన్ విరాట్ స్వరూపాన్ని అద్దంలో కొండ మాదిరిగా ఈ నాలుగు సంపుటాల ద్వారా అందించిన సదాశివరావు కృషి మన లోపల నూతన అభిరుచులు పాదుకోడానికి తోడ్పడుతుంది. మన సాహిత్య అధ్యయన రీతుల వైశాల్యానికి ప్రేరణనిస్తుంది. ప్రపంచ సాహిత్యంలో అత్యున్నతమైన, సుసంపన్నమైన సైన్స్ ఫిక్షన్తో పరిచయం కలుగుతుంది. సదాశివరావు వ్యాసాలు చదువుతుంటే మన లోపలి ప్రపంచాలు విశాలమవుతాయి. కొత్త వెలుగును సంతరించుకుంటాయి. సైన్స్ ఫిక్షన్ కథలు, నవలలు చదవాలన్న మమకారం ఏర్పడుతుంది. మానవ సమాజంలోని సంక్లిష్టతలకీ, సంక్షోభాలకీ మూలాలు ఎక్కడున్నాయో ఆకళింపు చేసుకోడం మరింత సులభతరమవు తుంది. శాస్త్రీయ దృష్టికోణం, వివేచన మానవ జీవితాన్ని నడిపించే చోదకశక్తులుగా నిలవాల్సిన అవసరం ఏమిటో తెలుసుకోగలు గుతాం. ఈ జాగురూకతనీ, మేల్కొల్పునీ, చైతన్యాన్నీ అందించడం సదాశివరావు సృజన సాఫల్యం.
- గుడిపాటి