Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన జీవితం ఎల్లప్పుడు ఒకే విధంగా సాగదు. ఒడుదుడుకులు, ఎత్తు పల్లాలు తప్పనిసరి. కుటుంబంలో ఒకరి ఉపాధి ద్వారా వచ్చే ఆదాయం ఆగి పోవడంతో ఆ కుబుంబానికి చెందిన చిన్న పెద్ద పిల్లలు సంక్షోభానికి గురవుతున్నారు. పెట్టుబడిదారీ దేశాలు తరచుగా ఆర్థిక సంక్షోభానికి గురువు తున్నాయి. ఆయా ప్రభుత్వాలు అనుసరించే అస్తవ్యస్త విధానాలు కోట్లాది ప్రజల ఉపాధిని పోగొడుతున్నాయి. ఉదాహరణకు కొన్ని నెలల క్రితం తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక ఉద్యోగి అమెరికాలో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడం పలువురికి కంట తడి పెట్టించింది. ఆ ఉద్యోగి చాలా తెలివైన వాడు. ఇక్కడ ఉన్నత చదువులు చదివాడు. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. కార్లు బంగ్లా కొన్నాడు. అమెరికాలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. ఇల్లు కొనేందుకు చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. తనకు కుటుంబానికి నీడనిచ్చిన ఇల్లు పోగొట్టుకున్నాడు. ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. కానీ సాధించలేక పోయాడు. మానసికంగా కృంగిపోయాడు. కొంత కాలం పాటు అతి కష్టంగా గడిచింది. చివరకు అనేక కష్టాలు ఒకేసారి చుట్టుముట్టడంతో ఆయన, అతని భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఉద్యోగి తన వారిని కాల్చి చంపి, తాను స్వయంగా కాల్చుకున్నాడు. ఈ సంఘటనను సంపూర్ణంగా పరిశీలించిన మానసిక శాస్త్రవేత్తలు కొన్ని విషయాలను వెల్లడించారు. ఒక విద్యార్థి ఉన్నత చదువుల్లో మొదటి ర్యాంకులో ఉత్తీర్ణుడై ఉండవచ్చు. ఆ చదువులు జీవిత పోరాటంలో కష్ట కాలాన్ని అధిగమించడానికి ఏమాత్రం ఉపయోగపడలేదని పేర్కొన్నారు. జీవితంలో సంక్షోభం తలెత్తినపుడు దానిని అధిగమించే స్థైర్యాన్ని, దైర్యాన్ని కూడగట్టుకోవాలని, కష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేయాలని సూచించారు.
మిత్రమా.. మనం తరగతి గదిలో నేర్చుకున్న పాఠాల కంటే, నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలే మనకు అనేక పాఠాలు నేర్పుతాయి. జీవిత పాఠాలే మనకు ముఖ్య మైనవి. పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చదువుతో పాటు సామాజిక పాఠాలను నేర్పాలి. సంక్షోభ సమయంలో ఎలా వ్యవహరించాలో బోధించాలి. వాటిని ఎలా అధిగమించాలో శిక్షణ నివ్వాలి. అసలే మన ప్రపంచంలోని అనేక దేశాలు సంక్షోభంలో ఉండగా, కరోనా కారణంగా ఇపుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక ఆటు పోట్లకు గురైంది. ఫలితంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఇంకా కోల్పోతున్నారు. కరోనా లాంటి సంక్షోభాలు భవిష్యత్తులో ఇంకా అనేకం రావచ్చు. వాటి అన్నింటినీ మనం ఎదుర్కొనే మానసిక సత్తాను మనం అలవర్చుకోవాలి.
ఇటీవల కాలంలో మన దేశంలో కోట్లాది మంది వలస కార్మికులు పడుతున్న కష్టాలను సామాజిక మాధ్యమాలు కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మన వలస కార్మికులవి. 139 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో సహజ వనరులకు కొదవలేదు. ఆ సహజ వనరులను సమర్థంగా ఉపయోగించుకున్నట్లయితే ఆకలి చావులు లేని దేశంగా మనం ఈ భూభాగాన్ని తీర్చిదిద్దవచ్చు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వప్రయెజనాల కోసం ప్రజలను చైతన్యవంతులను కానివ్వడంలేదు. ఎవరిని రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వడంలేదు. సామాజిక సంస్థలతో సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలను మెరుగు పర్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే కొంతమంది అసలు విషయాలు తెలియక ఇంకా చీకటిలోనే జీవిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను అందురూ ఉపయోగించుకోవాలి. మిత్రమా.. జీవితమంటే ఒక సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలేని జీవితముండదు. ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు నీ కుండ్లు, కాళ్లు, చేతులు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయి. సమస్యల వల్ల మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే. అందువల్ల నాకు ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమిస్తాననే ఆత్మస్థైర్యాన్ని మనం పొందాలి. జీవితంలో ఉపాధి కల్పించే ఒక దారి మూసుకుపోతే మనకు కచ్చితంగా మనకు మరో దారి కనబడుతుంది. కానీ మూసుకుపోయిన దారినే చూస్తూ కూర్చుంటే కండ్లకు ఎదురుగా ఉన్న మరో అవకాశాన్ని కోల్పోతాం. తమిళనాడుకు చెందిన ఉద్యోగి స్వదేశం తిరిగి వస్తే, ఇక్కడ ఏదో ఒక ఉపాధి లభించి ఉండేది. ఆత్మార్పణం చేసుకునే పరిస్థితిని అధిగమించి ఉండేవారు. అందుకే స్కూల్లో నేర్చుకున్న పాఠాల కంటే జీవిత పోరాటంలో నేర్చుకున్న పాఠాలు గొప్పవని కరోనా కాలంలో మన కోట్లాది మంది వలస కార్మికులు నిరూపించారు. ఎవరి సహాయం లేకుండానే తమ శ్రమనే నమ్ముకుని వేల మైళ్ల దూరాన్ని నడచి తమ ఇండ్లకు చేరారు. అందువల్ల ప్రజల జీవితాల నుంచి మనం నేర్చుకో వలసిన బతుకు పాఠాలు లక్షల్లో ఉన్నాయి.
- జి గంగాధర్ సిర్ప, 8919668843