Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
గత మూడేళ్ళుగా పెండింగులో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలను తక్షణమే విడుదల చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎన్నెస్పీ క్యాంప్ లోని సంఘం జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో స్కైలాబ్ బాబు పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు గత మూడేళ్ళుగా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని, 3 ఎకరాల భూమి అటకెక్కిందని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి దళితులను తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నారని వారు విమర్శించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దళితులను అవమానిస్తే నేటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే రాజాసింగ్ పైన అట్రాసిటీ చట్టం కింద కేసును నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మార్చి 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వామపక్షాలు బలపరుస్తున్న ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, బి.జయసారధి రెడ్డిలకు కెవిపిఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని వారు స్పష్టం చేశారు. సమావేశంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్, జిల్లా నాయకులు గంట భీమయ్య, కొమ్ము శ్రీను, పగిడికత్తుల నాగేశ్వరరావు, ఎన్.చిరంజీవి, పాపిట్ల సత్యనారాయణ, పి.నాగరాజు, బండి శ్రీను, మట్టి దుర్గాప్రసాద్, రమణ పాల్గొన్నారు.