Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
శాసనమండలిలో ప్రజా గొంతు వినిపించే నల్లగొండ, వరంగల్, ఖమ్మం వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారథి రెడ్డిని గెలిపించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు గోదా వెంకట నాగమల్లేశ్వరరావు కోరారు. వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారథిరెడ్డి విజయం కోరుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించటంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తూ ప్రైవేట్ విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తుందని విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత మూడు నెలలుగా రైతులు పోరాటాన్ని నిర్వహిస్తున్నారన్నారు జాతీయ విద్యా విధానం పేరుతో విద్యలో కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణకు పాల్పడుతుందని విమర్శించారు. ఐదున్నరేళ్ళుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవని, పాఠశాలల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వేతన సవరణపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు ముప్పై రెండు నెలలైనా అమలు కాలేదన్నారు. నెల మొదటి తేదీకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయట్లేదన్నారు. ప్రజా ఉద్యమాలను నిరంకుశంగా అణచివేస్తున్నారన్నారు. ధర్నా చేస్తే కేసులు పెడ్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 14న జరగనున్న నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై అవగాహనతో ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచే అభ్యర్థి బి.జయసారధిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు, మండల అధ్యక్ష, కార్యదర్శులు కంభం రమేష్, గుగులోత్ రామకృష్ణ, సుశీల, రంగారావు, ప్రీతం, సీనియర్ నాయకులు అప్పారావు, ఏసోబు , సామినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మధిర : వామపక్షాలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, కార్మికులు బలపర్చిన ఎంఎల్సీ అభ్యర్థి జయసారధిరెడ్డి గెలుపును కోరుతూ స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, మండలంలోని పాఠశాలలు, ప్రయివేట్ కళాశాలలు, నిరుద్యోగ యువకులను కలిసి ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి, సీపీఎం మండల కార్యదర్శి మందా సైదులు మాట్లా డుతూ ప్రజా గొంతుకు జయసారథిరెడ్డిని గెలిపిస్తేనే శాసనమండలిలో సమస్యలపై పాలకులను ప్రశ్నిస్తారని, అదే అధికారపార్టీ నాయకులను గెలిపిస్తే కేసీఆర్కు తొత్తుగా మారుతారని అన్నారు. ప్రచారంలో సీపీఎం పట్టణ కార్యదర్శి శీలం నర్సింహారావు, సీపీఐ మండల కార్యదర్శి ఊట్లకొండ, చెరుకూరి వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ, ప్రభాకర్, మధు పాల్గొన్నారు.
కొణిజర్ల : ప్రశ్నించే గొంతుక జయసారథిరెడ్డిని గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్లు కోరారు. వామపక్షాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారధిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామంలో ఇంటింటి ప్రచారంతో పాటు పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి ఓట్లను అభ్యర్థిస్తు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర బాబు, దొండపాటి రమేష్, వేములకొండ రమేష్, పివి రావు, అన్నవరపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.