Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బులు పంచుతూ దొరికితే మాదా తప్పు?
- ఓటమి భయంతోనే అవాకులు చవాకులల
- మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడం లేదని పోలీస్ స్వామ్యంలో జరుగుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించడాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని భట్టిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని గ్రహించే మల్లు భట్టి విక్రమార్క వాస్తవాలు కప్పిపుచ్చి తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల నియమావళిని టీఆర్ఎస్ ఉల్లంఘించిందని ఆరోపణలు చేస్తున్న భట్టి... ఎన్నికల నియమావళి ఉండగా జిల్లా కలెక్టరేట్ లో ప్రెస్ మీట్ నిర్వహించటం ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు.ఖమ్మం నగరంలో కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేస్తే తమకేం సంబంధం అని ప్రశ్నించారు. పోలీస్ లు స్వయంగా పట్టుకున్నారు కాబట్టే పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు. ప్రతిదానికీ టీఆర్ఎస్ పార్టీపై, తనపై అభియోగాలు మోపడం భట్టికి సర్వసాధారణంగా మారిందన్నారు. మీ పార్టీ అభ్యర్థులు డబ్బులు పంచుతుండగా దొరికిపోయి మళ్ళీ తిరిగి తమ పైన కలెక్టర్ కు ఫిర్యాదు చేయడమెంటో అర్థం కావట్లేదన్నారు. వాస్తవాలు తెలియకుండా అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి తనకంతా తెలుసని, పార్టీ అంతర్గత విషయాలపై తాను నోరు విప్పితే మీరు మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియద న్నారు.ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని భ'ఓ'ట్టి విక్రమార్క కొత్త నాటకానికి తెర తీసి సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.