Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22 లోపు రైతులు అభ్యంతరాలు తెలపాలి
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎస్. నవీన్ రెడ్డి, రైతు సంఘం నాయకులు తక్కెళ్ళపాటి భద్రయ్య
నవతెలంగాణ-రఘునాథ పాలెం
నాగపూర్ నుండి అమరావతి నేషనల్ హైవే కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఐ(యం) రఘునాధపాలెం మండల కార్యదర్శి ఎస్.నవీన్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం మండల నాయకులు తక్కెళ్ళపాటి భద్రయ్యలు అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం నాడు భూ నిర్వాసితుల రైతుల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రఘునాధపాలెం మండలానికి చెందిన కామంచికల్, రేగుల చేలక, రఘునాథ పాలెం, బల్లేపల్లి, వి వెంకటాయపాలెం, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన తీర్ధాల,మంగళ గూడెం గ్రామాల పరిధిలో గత సంవత్సరం భూసేకరణ కోసం గెజిట్ విడుదల చేశారని, రైతులు ఐక్యంగా భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించడం ద్వారా సంవత్సరం పాటు భూసేకరణ జరగ కుండా ఆపగలిగారని తెలియజేశారు. సంవత్సరం పూర్తయిన తర్వాత గెజిటెడ్ రద్దయిందని గుర్తుచేశారు. కరోన నేపథ్యంలో భూసేకరణ చేసే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వ్యతిరేకంగా రైతులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గెజిట్లో చూపించిన సర్వేనెంబర్ లన్నీ బహుళ పంటలు పండే భూములను వారు అన్నారు. ప్రస్తుతం కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లాక్ డౌన్ పరిస్థితిలో రైతులు ఎటూ కదలలేని సందర్భం చూసి ప్రభుత్వం మరలా తిరిగి భూసేకరణ కోసం బుధవారం ప్రముఖ దినపత్రికలలో గెజిట్ విడుదల చేసిందని వారు తెలిపారు. రైతులు బయటికి వెళ్లలేని లాక్ డౌన్ పరిస్థితుల్లో కనీసం అభ్యంతరాలు తెలుపుటకు అవకాశం లేని సందర్భం చూసి గెజిట్ విడుదల చేయడాన్ని వారు తప్పుపట్టారు. ఈ నెల 22న అభ్యంతరాలు తెలుపుటకు చివరి తేదీ అని, తక్షణమే రైతులందరూ తమ అభ్యంతరాలు తెలపాలని పిలుపునిచ్చారు. భూ సేకరణకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఉదతంగా పోరాటాల నిర్వహణకు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాయల శ్రీనివాస్, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, కృష్ణ, నాగేశ్వరరావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.