Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు కానూరి హిమబిందు
నవతెలంగాణ - వైరా టౌన్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు కానూరి హిమబిందు అన్నారు. వైరా మండలం అష్ణగుర్తి సీపీఐ(ఎం) గ్రామ శాఖ మహాసభ కొణిదెన కోటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జరిగిన మహాసభలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ పేద ప్రజలపై మోయలేని భారం వేసిందని, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రూపొందించి పంటలు పండించే రైతులను వ్యవసాయం నుండి దూరంచేసి, ఆదాని, అంబానీలవంటి బహుళ జాతి సంస్థలకు వ్యవసాయరంగాన్ని అప్పగించాలని కుట్ర చేస్తున్నదని అన్నారు. అనంతరం సిపిఐ (ఎం) గ్రామ శాఖ కార్యదర్శిగా చిత్తారు నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్య వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, పారుపల్లి ఝాన్సీ, మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, మండల కమిటీ సభ్యులు కిలారు శ్రీనివాసరావు, రాంబాబు, పార్టీ సభ్యులు చిత్తారు మురళి, లక్ష్మి, తాళ్ల పాపయ్య పాల్గొన్నారు.