Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-బోనకల్
రాష్ట్ర ప్రజల సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడిదారులకు కట్ట పెడుతున్నాడని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. మండల కేంద్రమైన బోనకల్ సీపీఐ(ఎం) గ్రామ శాఖ మహాసభ మంద కళావతి అధ్యక్షతన ఆదివారం జరిగింది. తొలుత మహాసభ ప్రారంభ సూచకంగా పార్టీ సీనియర్ నాయకులు భూక్య జాలు సిపిఎం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడితే ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉందని పదే పదే ప్రకటిస్తున్నారని అలాంటప్పుడు హుజురాబాద్ లోనే దళిత బంధు పథకం ప్రారంభం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అనంతరం నూతన శాఖ కార్యదర్శిగా తెల్లాకుల శ్రీనివాసరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభలో పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, శాఖ కార్యదర్శి చెన్నా లక్షాద్రి, సీనియర్ నాయకులు బిల్లా విశ్వనాథం, గద్దె రామారావు తదితరులు పాల్గొన్నారు.