Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగరంలోని రామచంద్రయ్యనగర్ లో ఇళ్ళు కోల్పోయిన వారికి 15 రోజుల్లోగా పరిష్కారం చూపాలని జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి జిల్లా యంత్రాంగానికి సూచించారు. బాధితుల ఇళ్లు తొలగించిన స్థలంలో గానీ, మరో చోటైనా పునరావాసం కల్పించాల న్నారు. జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి, కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి బుధవారం ఖమ్మం నగరంలో పర్యటించారు. ముందుగా రామచంద్రయ్యనగర్ లో ఇళ్లు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. వారి ఇళ్ల తొలగింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీటీడీసీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితుల నుంచి, అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామచంద్రయ్యనగర్ వాసుల ఇళ్ళు రెగ్యులరైజ్ కాకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. గతంలోనే రామచంద్రయ్యనగర్ భూములను ఎన్ఎస్పీ అధికారులు రెవెన్యూకు అప్పగించారని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ తెలిపారు. గతంలో రెండుసార్లు రామచంద్రయ్యనగర్ భూములపై కమిషన్ ఆధ్వర్యంలో హియరింగ్ జరిగిందన్నారు.
గత ఏడాది జులైలో ఫస్ట్ నోటీస్ ఇచ్చామని, అక్టోబర్ లో రెండోసారి నోటీసులు జారీ చేశామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఎలాంటి ఆధారం లేక 20 ఏళ్ల నుంచి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని ఉంటున్న వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా రాత్రికి రాత్రే ఎలా కూలగొడతారని బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి ప్రశ్నించారు. నిరుపేదల ప్రయోజనం కోసం ప్రభుత్వ అధికారులు సహకరించాలన్నారు. ఇప్పటికే 25 మందికి వేరే చోట పట్టాలిచ్చామని అధికారులు కమిషన్ దష్టికి తెచ్చారు. జాప్యం చేస్తే కేంద్ర స్థాయిలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని కమిషన్ అన్నారు. కమిషన్ ఆదేశాల ప్రకారం 15 రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ హామీ ఇచ్చారు. ఇప్పటికే 25 మందికి పట్టాలిచ్చామన్నారు. మిగిలిన అర్హులకు కమిషన్ ఆదేశాల మేరకు విచారణ చేసి పునరావాస చర్యలు చేపడుతామని కలెక్టర్ తెలిపారు. పోలీసు కమిషనర్ విష్ణు. యస్. వారియర్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జ్యోతి, నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషన్ మల్లీశ్వరి, అర్బన్ తహశీల్దారు శైలజ, సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.