Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల
నవతెలంగాణ-సారపాక
బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక సుందరయ్యనగర్లోని సమస్యలు అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం పార్టీ బృందంతో కలిసి ఆయన సుందరయ్య నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కాలనీలో డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడం వల్ల నీరు రోడ్లపైకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదేవిధంగా డ్రైనేజీలు పొంగి ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయన్నారు. వర్షం పడ్డప్పుడల్లా కాలనీవాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదున్నారు. పక్కనే ఉన్న ఐటీసీ సహాయంతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు గాని, సమస్య ఉన్న చోట మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గట్టిగా ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా సుందరయ్య నగర్ ప్రజల్ని వరదల నుంచి కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యురాలు పాపినేని సరోజన, శాఖ కార్యదర్శి ఎస్ కె అబిద, కనకం వెంకటేశ్వర్లు, తేజావత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.