Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో ధరణి పెండింగ్ కేసులు వారంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వివిధ సంస్థల నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలను గుర్తింపును సత్వరమే పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం మండలాల వారీగా సమీక్షించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, గురుకులాలు, కళాశాలలు, వెజ్-నాన్ వెజ్ మార్కెట్లు, క్రీడా ప్రాంగణాలు తదితర నిర్మాణాలకు తహశీల్దార్లు మండల పరిధిలో అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి సంబంధిత శాఖలకు అప్పగించాలన్నారు. సంస్థల నిర్మాణాలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు సద్వినియోగమయ్యేలా స్థలాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మ్యుటేషన్ లు, కోర్టు కేసులు, గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్, పి.ఓ.బి పెండింగ్ కేసులపై కలెక్టర్ సమీక్షించారు. పెండింగ్ కేసులు అధికంగా ఉన్న మండల తహశీల్దా ర్లను రెండు రోజులలోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పి.ఓ.బి పెండింగ్ కేసులపై తీసుకున్న పరిష్కార చర్యల రోజువారీ నివేదిక సమర్పించాలన్నారు. వారంలోగా పి.ఓ.బి పెండింగ్ కేసులన్నీ పరిష్కరించాలని కలెక్టర్ తహశీల్దార్లను ఆదేశించారు. పెండింగ్ కోర్టు కేసులు స్లాట్ బుకింగ్, మార్టిగేజ్ దరఖాస్తుల పరిష్కార చర్యలపై జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా మండలాలు పరిధిలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. పూర్తి నిబంధనలను పాటిస్తూ లాటరీ పద్ధతిన పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని కలెక్టర్ సూచిం చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, తహశీల్దార్లు, కలెక్టరేట్ కార్యాలయపు పరిపాల నాధికారి మదన్ గోపాల్ పాల్గొన్నారు.