Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగర పాలక సంస్థ నందు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ తదితర పద్దతుల్లో పనిచేస్తున్న కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్పీ 60 నెం.జి.ఓ ఆధారంగా వెంటనే మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచి కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణు వర్ధన్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్ టియు) రాష్ట్ర అధ్యక్షులు జి.రామయ్య, (ఐయన్ టియుసి) మున్సిపల్ కార్మిక సంఘం ఖమ్మం నగర అధ్యక్షులు యం. జయరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం కార్పొరేషన్ మేనేజర్ విజయానంధ్కు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు,కార్మికులకు ప్రభుత్వం వేతనాలు పెంచి జీఓలను జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు, జూన్ నెల నుండే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వేతనాలు చెల్లిస్తామన్నారని, కానీ ఇంతవరకూ పెంచిన వేతనాలు చెల్లించలేదని అన్నారు. ప్రభుత్వం జీ.ఓ. జారీచేసి చేతులు దులుపుకొని వేతనాలు చెల్లించకుండా జాప్యం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తక్షణమే మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారిగా వేతనాలు సాధించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఎఐటియుసీ, ఐఎఫ్టియు, ఐయన్ టియుసి తదితర మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్మిక సంఘా
ల రాష్ట్ర జాయింటు కమీటిల పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీన మున్సిపల్ కార్మికులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా కార్యక్రమంలో ఖమ్మం నగర పాలక సంస్థ కార్మికులు పాల్గొంటున్నారని, ఆ రోజు విధులు బహిష్కరిస్తున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటంలో పాలక వర్గం, నగర పాలక సంస్థ అధికారులు, నగర ప్రజలు సహాకరించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో సిఐటియు మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జినక శ్రీను, నగర అధ్యక్షులు దొడ్డా నర్సింహారావు, ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు బొడ్డు పాపారావు, కార్యదర్శి యస్.కె.హుస్సెన్, ఐఎఫ్టియు ఖమ్మం నగర అధ్యక్ష కార్యదర్శులు కంకణాల శ్రీనివాస్, ఆడెపు రామారావు, ఐఎఫ్ టియు మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కి గురవయ్య, ఐయన్ టియుసి మున్సిపల్ కార్మిక సంఘం ఖమ్మం నగర కార్యదర్శి లింగనబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.