Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దళిత సాధికారతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో అమలు చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏ.పి.జి.వి.బి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి.సి.సి.బి బ్యాంకుల ఉన్నత స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పేదరికంలో ఉన్న దళితులను యజమానులు చేయడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధుకు శ్రీకారం చుట్టిందన్నారు. త్వరలోనే చింతకాని మండలంలో దళితబంధును అమలు చేయనున్నామని, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయాన్ని ఎటువంటి సబ్సిడీ లేకుండా నేరుగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆయా బ్యాంక్ బ్రాంచ్ లలో లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా ఖాతాలను ప్రారంభించేందుకు బ్యాంకర్లు సిద్ధంగా ఉండాలని కోరారు. ఎక్కడైనా, ఏదైనా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ లబ్ధిదారుకే ఉందన్నారు. వ్యాపారం యూనిట్ స్థాపనకు అవసరమైన మొత్తాన్ని దశలవారీగా డ్రాచేసుకునే సౌలభ్యం ఉందన్నారు. లబ్ధిదారులు ఒకే సారి 10 లక్షలు డ్రా చేసుకోకుండా యూనిట్ల స్థాపన ఆధారంగా సొమ్ము డ్రా చేసుకోవచ్చన్నారు. ఏదైనా వ్యాపారం లేదా యూనిట్లకు సంబంధించిన చెల్లింపుకై జిల్లా కలెక్టర్ ప్రోసీడింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలన్నారు. రూ.10 లక్షలు ఆర్థిక లావాదేవీల పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్ డ్యాష్ బోర్డులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. చింతకాని మండలంలో త్వరలోనే సర్వే ప్రారంభమవు తుందని, సర్వే బందంతో పాటు బ్యాంక్ సిబ్బంది లబ్దిదారుల సమగ్ర సమాచారాన్ని సేకరించవచ్చని కలెక్టర్ సూచించారు. దళితబంధును మన జిల్లాలో విజయవంతంగా అమలుకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఆయా బ్యాంకుల ఉన్నత అధికారులు, లబ్ధిదారుల ఖాతాలను ప్రారంభించే ప్రక్రియపై ప్రభుత్వ నిబంధనలు, రాష్ట్రస్థాయి అధికారుల సూచనల మేరకు పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి అప్పారావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ వి.బి. నారాయణ, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ పార్థసారథి, ఏ.పి.జి.వి.బి రీజినల్ మేనేజర్ రమేష్, డి.సి.సి.బి సి.ఇ.ఓ వీరబాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.