Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయండి
- కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ను నియమించాలని, దళిత బంధును రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న కెవిపిఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే దళితుల మహాధర్నాను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎన్నెస్పీ క్యాంప్లోని సంఘం జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు పాపిట్ల సత్యనారాయణ అధ్యక్షతన కెవిపిఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు, గిరిజనులపై రాష్ట్రంలో అనేకచోట్ల దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరని, దళితులకు అన్యాయం జరిగితే తమ గోడు చెప్పుకోవడానికి ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు చైర్మన్ లేక తలలేని మొండెంలాగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ, ఎస్టీ కమిషన్కు చైర్మన్ను నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు పథకాన్ని అమలు చేసి దళితులకు న్యాయం చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ రుణం కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సబ్సిడీలు వెంటనే విడుదల చేయాలన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎస్సి కార్పొరేషన్ రుణాలు అందించాలన్నారు. పోరాడి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్కు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దళిత వాడలను అభివృద్ధి చేసేందుకు నిర్ధిష్టంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 9వ తేదీన జరుగు మహాధర్నాలో దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం జిల్లా నాయకులు కుక్కల సైదులు, బొట్ల సాగర్, నకరికంటి చిరంజీవి, మట్టే దుర్గాప్రసాద్, బండి శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.