Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
నేటి సమాజంలో వికలాంగులు కూడా అన్ని రంగాలలో రాణిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. బి.హెచ్.ఇ.ఎల్ సౌజన్యంతో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం టి.ఎన్.జి.ఓస్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన వికలాంగుల సహాయ ఉపకరణాల బహూకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని వికలాంగులకు సహాయ ఉపకరణాలను అందజేశారు. ఖమ్మం జిల్లాలో ప్రత్యేక శిబిరాల ద్వారా ఎంపిక చేసిన సుమారు 200 మంది వికలాంగులు సుమారు 24 లక్షల విలువైన 443 సహాయ ఉపకరణాలను బి.హెచ్.ఇ.ఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ వసంతరారు జాదవ్తో కలిసి కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన బిహెచ్ఇఎల్ తమకు వచ్చిన లాభాలలో కొంతశాతం వాటాను కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందజేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ఇటీవలే దివ్యాంగులకు జరిగిన ఓలపింక్ క్రీడలలో సాధారణ క్రీడాకారులు కంటే అధికంగా దివ్యాంగ క్రీడాకారులు సుమారు 2 వందల మెడల్స్ సాధించారని కలెక్టర్ అన్నారు. వికలాంగత్వం ఉందని నిరాశ పడకుండా తపన, పట్టుదల, కృషితో అన్ని రంగాలలో మరింతగా రాణించాలని కలెక్టర్ కోరారు. బిహెచ్ఇఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ వసంతరావు జాదవ్ మాట్లాడుతూ పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని, సమాజంలోని దివ్యాంగులకు సహాయ పడేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద బి.హెచ్.ఇ.ఎల్ అవసరాలు గుర్తించి తదనుగుణంగా సమాజానికి ఉపయోగపడాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలను అందిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఎంపిక చేసిన లబ్దిదారులకు 51 ట్రైసైకిల్స్, 26 వీల్ చైర్స్, 19 రోలెటర్స్, 130 క్రెచెస్, 20 వాకింగ్ స్టిక్స్, 136 డిజిటల్ వినికిడి పరికరాలు, 29 కాలికె, 18 లింబ్స్ వంటి మొత్తం 443 సహాయ ఉపకరణాలను అందిస్తున్నట్లు తెలిపారు. అలిమ్కా జనరల్ మేనేజర్ కెవి. రాజేష్ మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలను తెలుసుకొని వారికి అండగా నిలిచేందుకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు. దివ్యాంగ విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్ళేందుకు ట్రైసైకిల్స్, వినికిడి పరికరాలు, ఇతర వికలాంగత్వం కలిగిన వారికి వారి అవసరాలకనుగుణంగా సహాయ ఉపకరణాలను బి.హెచ్.ఇ.ఎల్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖాధికారి సంధ్యారాణి, బి.హెచ్.ఇ.ఎల్ మేనేజర్ రాజేష్, జిల్లా సంక్షేమశాఖ కార్యాలయపు సిబ్బంది, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.