Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
దసరా వచ్చిందంటే సింగరేణి కాలరీస్ ప్రాంతంలో శ్రీకోటమైసమ్మతల్లి జాతరతో సందడి ప్రారంభమవుతుంది. విజయదశమి మొదలు ఐదు రోజులు నిరంతరాయంగా సాగే జాతర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దజాతరగా చెప్పవచ్చు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో నిర్వహించే కోటమైసమ్మ తల్లి జాతర అన్ని హంగులతో ముస్తాబైంది. జాతర రాత్రి సమయాల్లో విద్యుత్ వెలుగులతో జాతర ద్వైదీప మానంగా వెలుగొందుతుంది. ఖమ్మం జిల్లా నుండి కాక భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వేలాది మంది ఈ జాతరకు తరలివస్తుంటారు. ఈసారి జాతరలో కుటుంబ సమేతంగా వినోదం కోసం పెద్దపెద్ద జాయింట్వీల్, క్రాస్వీల్, కొలంబస్, బ్రేక్డ్యాన్స్, డ్రాగెన్ ట్రైన్ చిన్న పిల్లకు రంగురాట్నం, గండ్రంగా తిరిగే కారు, బైక్ వంటి వినోదాంశాలను ఏర్పాటు చేశారు. ఈ జాతర సంబంధించి ప్రత్యేక కధనాలు ఉన్నాయి.
మృగాల నుండి రక్షించాలని కట్టిన కోట...
ఆలయ అర్చకులు కొత్తలంక కైలాస శర్మ ఆలయ విశిష్టతను నవతెలంగాణకు వివరించారు. 500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన ఆడవి ఉండి కృరజంతువుల బారీన పడి పశువులు, మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో తమను రక్షించమని అమ్మవారికి వారిని కోరుతూ గుట్టమీద కోటను నిర్మించి దానికి కోటమైసమ్మగా నామకరణం చేశారు. 1948వ సంత్సరంలో పర్సా క్రిష్ణారావు-దమయంతి దంపతులు అమ్మవారి శిల్పంను తయారుచేయించి అక్కడ ప్రతిష్టించటం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు అక్కడ ఉత్సవాలు వీరి కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించటం ఆనవాయితీగా జరుగుతుంది. ప్రారంభంలో చిన్న దేవాలయంగా ఉన్న కోటమైసమ్మ తల్లి ఆలయం నేడు అతి పెద్ద జాతరగా రూపాంతరం చెందటం విశేషం. జాతర సందర్బంగా ఆలయ ప్రాంగణంలో భారీ సంఖ్యలో వాహనాల పూజ చేయించుకోవటం ఇక్కడ ప్రత్యేకత. తమ వాహన పూజ చేయిస్తే ఎలాంటి ప్రమాదాలు వాటిల్లవనే ప్రగాఢ విశ్వాసం ఇక్కడి ప్రజలల్లో నెలకొనటంతో జాతర సందర్భంగా వందల సంఖ్యలో వాహనాలు పూజ కోసం తీసుకవస్తుంటారు. కోటమైసమ్మ తల్లి జాతరకు ఉసిరికాయల పల్లిలోని దేవాలయం ముస్తాబైంది. ఈ జాతర ఈనెల 15వ తేది నుండి 19తేది వరకు జరుగనుంది.
పట్టించుకోని ప్రభుత్వ శాఖలు
జిల్లాలోనే అతిపెద్ద జాతరగా చెప్పబడుతున్న కోటమైసమ్మ జాతరను ప్రభుత్వ శాఖలు పట్టించుకున్న పాపాన లేదు. జాతర మూడు రోజులు మాత్రం పోలీసు శాఖ బంద్ బస్తు, వైద్యశాఖ వైద్యశిబిరాన్ని నిర్వహిస్తుంది. రెవిన్యూ శాఖ, ఆర్Êబి, సింగరేణి సంస్ధలు జాతర పట్ల చిన్నచూపు చూస్తున్నాయి. జిల్లాలో జరిగే ఇతర జాతరలతో పోలిస్తే కోటమైసమ్మ జాతరకు వేలాది జనం వస్తున్నారనటంలో సందేహం లేదు. ప్రభుత్వం కొన్ని జాతర్లకు ప్రత్యేక అధికారిని నియమించి వారి పర్యవేక్షణలో జరుపుతుండగా కోటమైసమ్మ జాతరకు మాత్రం ఏ అధికారిని నియమించకుండా విస్మరిస్తున్నారు. ఈ జాతరకు వందలాది మంది ప్రయివేటు వాహనాల్లో వస్తుంటారు. జాతరకు వెళ్లే రహదారులు బాగుపడటంతో ఈ జాతర సందర్బంగా ఆర్టీసీ వారు బస్ సౌకర్యం కల్పిస్తే నడపితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జాతరకు ఏర్పాట్లు పూర్తి-ఈవో అద్దంకి నాగేశ్వరరావు
దేవదాయశాఖ ఆధ్వర్యంలో జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, ఇఓ అద్దంకి నాగేశ్వరరావు లు తెలిపారు. ఇప్పటికే జాతరలో ఏర్పాటు చేసే దుకాణాలు, ఎగ్జిబిషన్, ఇతర వినోద సాధనాలకు వేలం పాట నిర్వహించాన్నారు. భక్తులకు ఇబ్బంది కల్గకుండా త్రాగునీరు సౌకర్యం, మరుగుదొడ్లు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్ని శాఖల అధికారులను జాతరకు సమాయత్తం చేస్తూ సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు జాతర విజయవంతంకు కృషి చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.