Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
నాలుగు దశాబ్దాల పాటు మూడు రాష్ట్రాల పోలీసులకు ముచ్చెమటలు పట్టించి, సుమారు కోటి రూపాయల రివార్డు గలిగి వెలుగొందిన అరుణతార, సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్(63) అలియాస్ రామకృష్ణ(ఆర్కే), అలియాస్ సాకేత్, అలియాస్ మధు, అలియాస్ శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆర్కే మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అభరు పేరిట శుక్రవారం లేఖ విడుదల చేశారు. అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021 ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడని పేర్కొన్నారు. అకస్మాతుగా కిడ్నీల సమస్య రావడంతో వెంటనే డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడైనాడని తెలిపారు. ఆయనకు పార్టీ మంచి వైద్యం అందించినప్పటికీ దక్కించుకోలేకపోయామని వెల్లడించారు. ఆయనకు విప్లవ శ్రేణుల మధ్యనే అంత్యక్రియలు నిర్వహించి శ్రద్ధాంజలి అర్పించినట్టు తెలిపారు. రామకష్ణ అమరత్వం పార్టీకి తీరని లోటని ఆ లేఖలో తెలిపారు.
ఉద్యమ నేపథ్యం..
కామ్రేడ్ హరగోపాల్ 1958 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని పల్నాడ్ ప్రాంతంలో జన్మించాడు. తండ్రి ఒక స్కూల్ టీచర్. హరగోపాల్ పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యనభ్యసించాడు. కొంత కాలం తండ్రితో పాటు టీచర్గా పని చేశాడు. 1978లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షించబడి భాకపా (మాలె) (పీపుల్స్ వార్)లో పార్టీ సభ్యత్వం తీసుకొన్నాడు. 1980లో గుంటూర్ జిల్లా పార్టీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. 1982 పార్టీలోకి పూర్తికాలం కార్యకర్తగా వచ్చాడు. గుంటూరు పల్నాడ్ ప్రాంతంలో గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించాడు. ఆ క్రమంలో విప్లవోద్యమ నాయకత్వంగా ఎదిగి 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎదిగాడు. 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైనాడు. తరువాత దక్షిణ తెలంగాణ ఉద్యమానికి 4 సంవత్సరాలు నాయకత్వం అందించాడు. 2000లో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడంతో పాటు, 2001లో జనవరిలో జరిగిన పీపుల్స్వార్ 9వ కాంగ్రెసులో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ మధ్యలో జరిగిన చర్చల్లో పార్టీ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించాడు.
ప్రభుత్వం ముందు ప్రజల డిమాండ్లను పెట్టి తన ప్రతినిధుల బృందంతో పాటు సమర్ధవంతంగా చర్చించాడు. ఈ చర్చల ప్రక్రియలో పార్టీ రాజకీయ దృక్పథాన్ని రాష్ట్ర, దేశ ప్రజల్లోకి వ్యాప్తి చేశాడు. ప్రభుత్వం చర్చల నుండి వైదొలిగి తీవ్ర నిర్బంధం ప్రయోగించి కామ్రేడ్ రామకృష్ణనను హత్య చేయడానికి ప్రయత్నాలు చేయడం ప్రారంభించగానే, ఆయన్ని ఏఓబీ ఏరియాకు కేంద్ర కమిటీ బదిలీ చేసి, ఏఓబీ బాధ్యతలు ఇచ్చింది. ఆయన 2014 వరకు ఏవోబీ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తర్వాత ఏవోబీని కేంద్ర కమిటీ నుండి గైడ్ చేసే బాధ్యత నిర్వహిస్తున్నాడు. 2018లో ఆయన్ని కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోలో నియమించింది. ప్రస్తుతం ఏఓబీలో ప్రభుత్వం కొనసాగిస్తున్న అత్యంత నిర్బంధ కాండలో పార్టీనీ, కేడర్లను రక్షించే కార్యక్రమాన్ని ఎంతో ధృఢంగా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్య సమస్య తలెత్తి అమరుడైనాడు.
కామ్రేడ్ హరగోపాల్కు విప్లవోద్యమంలోనే కామ్రేడ్ శిరీషతో వివాహం జరిగింది. వారికి ఒక బాబు జన్మించాడు. ఆయన కుమారుడు కామ్రేడ్ మున్నా(పృధ్వి) కూడా విప్లవోద్యమంలో తండ్రి బాటనే నడిచి 2018లో జరిగిన రామగూడ ఎన్కౌంటర్లో అమరుడైనాడు.