Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మధిరకు కొత్తగా వచ్చిన పోలీస్ అధికారులు వెంటనే ఎంతో హడావుడి చేసేవారు. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్కు వచ్చే వారి పట్ల దర్పం ప్రదర్శించేవారు. ప్రజలు ముందుగానే భయపడే విధంగా దర్పం ప్రదర్శించి, పోలీస్ అహంకారం ప్రదర్శించేవారు. వాహనాల తనిఖీల పేరుతో రహదారులపైకి వచ్చి పోలీస్ వాహనంలో కూర్చొని ఇష్టానుసారంగా వాహనాలు తనిఖీ చేస్తూ జరిమానాలు విధిస్తూ హడావుడి సృష్టించటం సర్వసాధారణం. దీనికి కారణం కొత్తగా వచ్చిన పోలీస్ అధికారి తన ప్రతాపం ఏమిటో చూపించాలనే ప్రయత్నం. మధిర సీఐగా ఒడ్డేపల్లి మురళి బాధ్యతలు స్వీకరించి సంవత్సరం కాలం పూర్తయింది. అందుకు పూర్తి విరుద్ధంగా ఎక్కడా హడావుడి లేదు, హంగామా లేదు, పోలీస్ అధికారి అహంకార దర్పం, ప్రదర్శన కనిపించలేదు.
మధిర పోలీస్ సర్కిల్ పరిధిలో మధిర టౌన్, మధిర రూరల్, ఎర్రుపాలెం, బోనకల్ పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి. సిఐ మురళి సర్కిల్ పరిధిలో క్రింది స్థాయి సిబ్బందితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రతలు కాపాడటమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తూ మధిర బోనకల్, ఎర్రుపాలెం, మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. జిల్లాలో అప్పటికే మురళికి నిజాయితీ గల పోలీసు అధికారిగా, వివాదరహితుడిగా, శాంతిభద్రతలను కాపాడే విషయంలో సమర్ధుడైన అధికారిగా పోలీస్ శాఖలో పేరు సంపాదించుకున్నాడు. రాజకీయంగా చైతన్యవంతమైన మధిర ప్రజలు మురళి పనితీరును పరిశీలించి శాంతిభద్రతల విషయంలో పోలీసు శాఖ తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలిపారు. ప్రజల సహకారం, సిబ్బంది కృషితో మురళి పర్యవేక్షణలో వినాయక చవితి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడంలో మంచి కృషి చేశారు. అంతేకాకుండా జిల్లాలో సంచలనం సృష్టించిన ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రేమిడిచర్ల మైనర్ బాలిక కిడ్నాప్ కేసు చేధించారు. మధిరలో ఐరన్ షీట్లు చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. బోనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో జరిగిన హత్య కేసును చేధించారు. ఇలా అనేక కేసుల సత్వర పరిష్కారంలో పురోగతిని సాధిస్తూ పోలీస్ అధికారులకు ఆదర్శంగా నిలిచే జిల్లా పోలీస్ కమిషనర్ ప్రశంశలు పొందారు. మధిరలో సీఐ కార్యాలయాన్ని అనేక ఏళ్ళ నుంచి మధిర టౌన్ పోలీస్ స్టేషన్లోనే నిర్వహిస్తున్నారు. సంవత్సరాల తరబడి పోలీస్ సర్కిల్ కార్యాలయంకు ప్రత్యేకంగా కార్యాలయం లేదు. సీఐగా బాధ్యతలు స్వీకరించిన మురళి అనతికాలంలోనే సర్కిల్ కార్యాలయం పూర్తిచేసి సిపి విష్ణు వారియర్ ద్వారా ప్రారంభోత్సవం చేయించారు. ప్రతిరోజు రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా కట్టడికి చాలా వరకు కృషి చేశారనే చెప్పవచ్చు. యువత గంజాయి బారిన పడకుండా రాత్రివేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేసి గంజాయి వినియోగిస్తున్న యువతను అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలు చేసి కరోనా నియంత్రణకు విశేషంగా కృషి చేశారు. యువతలో మార్పు కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అన్యాయానికి గురైన వారు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని, ఆ విధంగా బాధితులు చేయగానే తక్షణమే స్పందించి కేసును పూర్వాపరాలు పరిశీలించి బాధితులకు సత్వరం న్యాయం చేస్తున్నారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా సంవత్సరం పాటు నిధులు నిర్వహించి మధిర ప్రజల మన్ననలు పొందిన ఘనత సిఐ మురళికి దక్కిందనటంలో ఎటువంటి అతియోశక్తి లేదు. సంవత్సరం పదవీ కాలం పూర్తి చేసుకున్న సిఐ మురళికి మధిర సర్కిల్ పరిధిలో గల ప్రజలు, మీడియా మిత్రులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా వ్యవహరించి పోలీస్ శాఖకు వన్నె తీసుకు రావాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.