Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) వైరా పట్టణ కమిటీ డిమాండ్
నవతెలంగాణ-వైరా టౌన్
నిరుపేదల పిల్లలు చదువుతున్న గురుకుల విద్యాలయాలు, హాస్టల్స్ వెంటనే ప్రారంభించి దళిత, గిరిజన, పేద పిల్లల భవిష్యత్తుకు నష్టం వాటిళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. మంగళవారం వైరా సీపీఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగిన సిపిఐ (ఎం) వైరా పట్టణ కమిటీ సమావేశంలో బొంతు రాంబాబు మాట్లాడుతూ ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు రెండు నెలల నుంచి నడుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలు నడుపుతూ, గురుకుల విద్యాలయాల మాత్రం ప్రారంభించక పోవడం వల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సరైన సమాచారం అందజేసి ప్రారంభం అయ్యే విధంగా చూడాలని కోరారు. గత రెండు సంవత్సరాలుగా గురుకుల విద్యాలయాల తెరుచుకోవడంతో వాటిలో చదువుతున్న విద్యార్థులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్నారని, గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు అందరికీ ఆన్లైన్ తరగతులు వినే అవకాశాలు సరిగా లేవని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే గురుకుల విద్యాలయాల ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా మణి, బోడపట్ల రవీందర్, మల్లెంపాటి రామారావు, కురగుంట్ల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు బొంతు సమత, అనుమోలు రామారావు, గుడిమెట్ల రజిత, మల్లెంపాటి ప్రసాదరావు, పైడిపల్లి సాంబశివరావు, రాచ్చబంటి భద్రిన్న తదితరులు పాల్గొన్నారు