Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ- నేలకొండపల్లి
నేలకొండపల్లి ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలను ఆయన పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యల గురించి వైద్యాధికారి డాక్టర్ రాజేష్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినందుకు తగిన డాక్టర్స్ను, సిబ్బందిని, ఎక్యుప్మెంట్ను ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుసుకునేందుకు పౌర స్పందన వేదికను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విద్య వైద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా పౌరుల స్పందన అడిగి తెలుసుకోవడం ఈ వేదిక ముఖ్య ఉద్దేశం అన్నారు. తద్వారా సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయ నున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించాలని, ప్రతి పేదవాడికి విద్య వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట పౌర స్పందన వేదిక జిల్లా నాయకులు ఏ.రవికుమార్, కె.కుటుంబరావు, యుటిఎఫ్ జిల్లా నాయకులు అరవింద్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి గురవయ్య, అధ్యక్షుడు విజరు కుమార్ ఉన్నారు.