Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
యాసంగిలో వరి విత్తనాలను అమ్మే డీలర్లపై చర్యలుంటాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని, ప్రభుత్వ నిబంధనలు పాటించని విత్తన డీలర్ల షాపు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ హెచ్చరించారు. వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోళ్ళు ఉండవని ఎఫ్.సి.ఐ ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ జిల్లా స్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు, విత్తన విక్రయ డీలర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాసంగిలో కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే సాగవుతుందని, బాయిల్డ్ రైస్ ఎఫ్.సి.ఐ కొనుగోలు చేయదని తేల్చి చెప్పిందన్నారు. భూసారానికి అనుకూలంగా వరికి ప్రత్యామ్నాయ పంటలకు మళ్లించాలన్నారు. ఈ నెల 27 నుండి 29 వరకు ప్రతి రైతువేదికలో పెద్దఎత్తున రైతు అవగాహన సదస్సులు నిర్వహిం చాలన్నారు. ఈ మేరకు రైతులను చైతన్య పర్చాలని వ్యవసాయా ధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటలపై శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో రైతులకు ఆదాయం లభించే మార్గాలను తెలపాలన్నారు. ఈ నెల 30 లోపు జిల్లా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచిం చారు. దీనిపై వ్యవసాయ విస్తరణాధికారులకు ప్రత్యేక వర్క్ షాపు నిర్వహించడం ద్వారా వ్యవసాయ విస్తరణాధికారులు క్లస్టర్ స్థాయిలో ప్రతిరోజు రైతుల చెంతకు వెళ్ళి పూర్తిగా అవగాహనపర్చాలన్నారు. యాసంగిలో రైతులందరూ ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే విధంగా సన్నద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.విత్తన డీలర్లు కూడా రైతులకు దిశా నిర్దేశం చేయాలని దీనితో పాటు విత్తనాల కంపెనీలతో సంప్రదించి ప్రత్యామ్నాయ పంటలైన పెసలు, మినుమలు, నువ్వులు, ఆముదాలు, సన్ ఫ్లవర్, వేరుశనగ, బెంగాల్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ వంటి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, కె.వి.కె శాస్త్రవేత్త హేమంత్ కుమార్, మధిర ఏ.ఎస్.ఆర్ శాస్త్రవేత్త, వ్యవసాయ శాఖ ఏ.డిఏలు, ఏ.ఓలు, విత్తన విక్రయ డీలర్లు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.