Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేగా మాటలు అసత్యమైనవి, అసందర్భమైనవి ఖండిస్తున్నాం
- మత తత్వశక్తులకు అవకాశం లేకుండా చూడాల్సిన బాధ్యత కమ్యూనిస్టులదే
- దేశాన్ని అప్పులపాలు చేస్తున్న మోడీ
- పోతినేని, మిడియం బాబూరావు
నవతెలంగాణ-భద్రాచలం
పొత్తులున్నా లేకున్నా భద్రాచలం నియోజకవర్గంలో సీపీఐ(ఎం) పోటీ చేస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియా బాబురావు అన్నారు. సోమవారం ఎం.బి.నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ పట్టణస్థాయి జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులకు నామినేటెడ్ పోస్టులు ఇస్తే సరిపోతుందని, కమ్యూనిస్టులను చులకన చేస్తూ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. పొత్తులు ఖరారు అయినట్లు మాట్లాడడం అసత్యమైనవి అసందర్భమైనవని అన్నారు. కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు వాస్తవాలు మాట్లాడితే మంచిదని హితవు పలికారు. మతతత్వశక్తులకు అవకాశం లేకుండా చూడవలసిన బాధ్యత కమ్యూనిస్టులదేనని, మత ప్రాతిపదికన ప్రజలను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, మతత్వ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు అన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాక పేదరికం రోజురోజుకీ పెరుగుతోందని, దేశంలోని మొత్తం సంపద 10 శాతం మంది వద్ద పోగు పడిందని, అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయని వారు అన్నారు. నరేంద్ర మోడీ దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతూ దేశాన్ని అప్పులు పాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీని నిలువరించే దానిలో భాగంగానే బీఆర్ఎస్తో కలిసి సీపీఐ(ఎం) పనిచేయడానికి సిద్ధమయిందని, అర్థం చేసుకోలేని రేగా కాంతారావు అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. పొత్తులున్నా లేకున్నా భద్రాచలం నియోజకవర్గంలో సీపీఐ(ఎం) పోటీ చేస్తుందని, పార్టీ కార్యకర్తలు అకుంటత దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, మచ్చ వెంకటేశ్వర్లు పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కమిటీ సభ్యులు ఎం రేణుక, సున్నం గంగా పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై వెంకట రామారావు, పి.సంతోష్ కుమార్, ఎన్.లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు బి.కుసుమ, డి.లక్ష్మి, జ్యోతి, జీవనజ్యోతి సిహెచ్ మాధవరావు, కుంజా శ్రీనివాస్, ఎస్డి పిరోజ్, ఎస్.రామకృష్ణ, జి.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.