Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-17న ప్రకటించనున్న అధికారులు
నవతెలంగాణ-కల్లూరు
గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండవ విడత నామినేషన్లు ఆదివారం ముగిశాయి. ఈ నేపథ్యంలో ఒక్కొక్క నామినేషన్ మాత్రమే వేసి ఐదు గ్రామపంచాయతీలు ఏకగ్రీవ మయ్యాయి. ఈ నెల 17న ఏకగ్రీవమైనట్టు అధికారికంగా ప్రకటించనున్నారు.
పెద్దకోరుకొండి పంచాయతీకి వేము రత్నమ్మ ఏకగ్రీవం
మండలంలోని పెద్దకోరుకొండి గ్రామపంచాయతీగా ఏర్పడి యాభై ఏండ్లు అవుతుండగా మొట్టమొదటి సారిగా ఏకగ్రీవం కావటం విశేషం. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ గ్రామపంచాయతీ హోరాహోరీగా పోరు ఉండేది. అలాంటిది ప్రముఖ వైద్యులు వేము గంగరాజు తల్లి వేము రత్నమ్మకు అన్ని పార్టీలు మద్ధతు ఇచ్చి ఇండిపెండెంట్గా ఏకగ్రీవం చేశాయి. దీంతో పాటు ఆ గ్రామంలో ఉన్న పది వార్డులకు కూడా ఒక్కొక్కటే నామినేషన్ దాఖలయ్యాయి. దీంతో ఏకగ్రీవం లాంచనప్రాయమే.
కొర్లగూడెం పంచాయతీకి బైరెడ్డి నర్సింహారెడ్డి :
కొర్లగూడెం గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ముగిసే నాటికి సర్పంచ్ పదవికి, ఎనిమిది వార్డులకు ఒక్కొక్కరే నామినేషన్ వేయటంతో బైరెడ్డి నర్సింహారెడ్డి రెండవసారి సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు. గత ఐదేండ్లుగా సర్పంచ్ పదవి చేపట్టి గ్రామంలోని అనేక సమస్యలను ఆయన పరిష్కరించి ప్రజల మన్ననలు పొందారు. దీంతో ఈసారి కూడా ఓసీ జనరల్ కావడంతో తిరిగి మళ్లీ ఆయన్నే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నారాయణపురం పంచాయతీకి కనకదుర్గ :
నారాయణపురం గ్రామ సర్పంచ్గా ప్రస్తుత ఎంపీటీసీ అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి సతీమణి అంకిరెడ్డి కనకదుర్గ ఒక్కరే నామినేషన్ వేయటంతో సర్పంచ్ పదవికి ఏకగ్రీవం లాంచనప్రాయంగా మారింది. నారాయణపురం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పొంగులేటి సుధాకర్రెడ్డి సొంత గ్రామం. గత మూడుసార్లుగా సర్పంచ్ పదవికి పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకోవటం ఆనవాయితీగా మారింది. అదే ఆనవాయితీని ఈసారి ఎన్నికల్లో కూడా కొనసాగించారు.
పుల్లయ్యబంజర పంచాయతీకి పెద్దబోయిన కృష్ణవేణి :
పుల్లయ్యబంజర గ్రామం గతంలో కల్లూరు మేజర్ పంచాయతీలో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం చిన్న పంచాయతీలుగా చేయటంతో పుల్లయ్య బంజర తొలిసారిగా గ్రామపంచాయతీగా ఏర్పడింది. గ్రామంలోని నాయకులు, ప్రజలు కలిసికట్టుగా సమావేశమై కల్లూరు సొసైటీ అధ్యక్షుడు పెద్దబోయిన మల్లేశ్వరరావు సతీమణి పెద్దబోయిన కృష్ణవేణిని ఏకగ్రీవంగా తొలి సర్పంచ్గా ఎన్నుకున్నారు.