Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేలకొండపల్లి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్రావు పిలుపునిచ్చారు. అక్టోబర్ 1వ తేదీన నేలకొండపల్లి మండలంలో జరిగే సంఘం11వ మండల మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం మండలంలో విస్త త ప్రచారం నిర్వహించారు. అనంతరం స్థానిక రావెళ్ల భవనంలో సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన చట్టాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రధానంగా బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సరైన పని లేక పూట గడవక పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇసుక రవాణాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో నిర్మాణ రంగంలో పనులు పూర్తిగా మందగించాయని, దీంతో కార్మికులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పని భద్రత ఆరోగ్య భద్రత కల్పించాలని, కార్మికులందరికీ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఏదైనా ప్రమాదాలు సంభవిస్తే తగిన ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని, ప్రధాన అడ్డాల వద్ద కార్మికుల సౌకర్యార్థం షెడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు వారికి అవసరమైన పనులు కల్పిస్తూ జీవనోపాధిని చూపాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు జరుగు తున్న మహాసభలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు మండల అధ్యక్షులు షేక్ ఖాజా మియా, జిల్లా నాయకులు పగిడి కత్తుల నాగేశ్వర రావు మద్దినేని మహేష్, గంగారపు రామారావు, పల్లపు శ్రీను, నరసింహారావు, చిలక వెంకటేశ్వర్లు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కోటేశ్వరి, పాల్గొన్నారు.