Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి
నవతెలంగాణ-ఖమ్మంటౌన్
ఒకనాడు మహిళలను వంటింటి కుందేలు గా అభివర్ణించిన పరిస్థితి ఉందని, కానీ నేడు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో తన సత్తా చాటుతూ ఆ నానుడిని తిరగరాశారనిఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో జరిగిన మిడిల్ క్లాస్ మహిళా స్టడీ సర్కిల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో నానాటికీ కొత్త పుంతలు తొక్కుతున్న శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కూడా ఉండటం విశేషమన్నారు. అలాంటి మహిళలపై ఏదో ఒక మూలన ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉందని, మగాళ్ల అకృత్యాలకు అడ్డు లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాలు మహిళా రక్షణ కోసం ఏర్పాటైన చట్టాలను సరైన రీతిలో అమలు చేయకపోవడమే ప్రధాన కారణమన్నారు. చట్టాలు సరిగా అమలయ్యే రీతిలో మహిళలు ప్రభుత్వాలపై ఉద్యమాలు సాగించాలని పిలుపునిచ్చారు. మహిళా కన్వీనర్ భాగం అజిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐద్వా అధ్యక్షురాలు బండి పద్మ, ఉపాధ్యక్షురాలు మెహరున్నీసా బేగం, వన్ టౌన్ కార్యదర్శి సరస్వతి, అధ్యక్షురాలు సరిత, డాక్టర్ మురళి, ఉపాధ్యాయురాలు నస్రీన్ పాల్గొన్నారు.