Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.18వేలు అమలు చేయాలి
- దిక్కుతోచని స్థితిలో సాక్షరభారత్ ఉద్యోగులు
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-చింతకాని
కాంట్రాక్టు, ఔట్ సోర్సీంగ్ ఉద్యోగుల కనీసవేతనం 18 వేలకు పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణపు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో సీఐటీయూ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మికులకు హక్కులు లేకుండా చేస్తున్నాయని, 46 కార్మిక చట్టాలను 4కు కుదించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదన్నారు. వివిధ కేంద్ర రాష్ట్ర ప్రాయోజిత కార్యక్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు చాలీ చాలని జీతాలిచ్చి వారితో వెట్టి చాకిరి చేయిస్తున్నదన్నారు. పదేండ్లపాటు సాక్షర భారత్ కార్యక్రమంలో పనిచేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 వేల మంది సాక్షర భారత్ సమన్వయకర్తలను నేడు కార్యక్రమం తీసేసి వారిని నిరుద్యోగులుగా మార్చిందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు ఇవ్వకుండా వారికి నెలవారి వేతనాలు చెల్లించకుండా, అంగన్వాడీ సిబ్బం దికి, ఆశా కార్యకర్తలకు, గ్రామపంచాయతీ ఉద్యోగులకు పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా వారిని అన్ని విధాలుగా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకుంటు వారి శ్రమ దోచుకుంటుం దన్నారు. కార్మిక చట్టాలు సీఐటీయూ పోరాట ఫలితమేనని కార్మికులు గుర్తించాలన్నారు. సీఐటీ యూను మరింత బలపరుచుకోని మన హక్కులు సాధించుకుందా మని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గోపాల్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వత్సవాయి జానకిరాములు, సీఐటీయూ మండల కార్యదర్శి గడ్డం రమణ, కన్వీనర్ గంటేల స్వామిదాసు, అధ్యక్షులు షేక్ హిమామ్, మధ్యాహ్న భోజన కార్మికులు, సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తలు, గ్రామ పంచాయతీ గుమస్తాలు, పంప్ ఆపరేటర్లు, అశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, బిల్డింగ్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ మండల కన్వీనర్గా స్వామిదాసు : సీఐటీయూ మండల కన్వీనర్గా మండల పరిధిలోని చిన్నమండవ గ్రామానికి చెందిన గంటెల స్వామిదాసు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. సీపీఐ(ఎం) మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఐటీయూ మండల మహాసభలో ఆయనతో పాటు మరో 15 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.