Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి
- కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ పిలుపు అ ఖమ్మం నగరంలో సైకిల్ ర్యాలీ
నవతెలంగాణ-ఖానాపురంహవేలీ
స్వచ్ఛమైన పర్యావరణానికి, ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం జిల్లాను కూడా మిషన్ ప్లాస్టిక్ ఫ్రీగా సంపూర్ణంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. ఖమ్మం నగర పాలక సంస్ధతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో గల ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేందుకు అమలు చేస్తున్న ప్రణాళికలో భాగంగా ఖమ్మం నగర ప్రజలకు ప్లాస్టిక్ నివారణపై పూర్తిస్ధాయిలో అవగాహన కలిగించేందుకు అదివారం ఖమ్మం నగర పాలక సంస్ధ కార్యాలయం నుండి లకారం ట్యాంక్బండ్ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి నగర పాలక సంస్ధ కార్యాలయం నుండి లకారం ట్యాంక్బండ్ వరకు సైకిల్ ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం నగరంతో పాటు తమ స్వంత గ్రామాలలో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించేందుకు అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్ధలు, నగర ప్రజలు, వాణిజ్య, వ్యాపారవేత్తలు, విద్యార్ధినీ విద్యార్ధులు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి ఖమ్మం జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడంలో ప్రధాన భూమిక పోషించాలని కలెక్టర్ కోరారు. ప్లాస్టిక్ వస్తువులకు బదులు ప్రత్యామ్నాయంగా పేపర్, జనపనార, క్లాత్ వస్తువులను వినియోగించాలని, వ్యాపార, వాణిజ్యవేత్తలు కూడా ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నివారిస్తున్నట్టు సూచిక బోర్డుల ద్వారా వినియోగదారులకు తెలియపర్చాలని కలెక్టర్ అన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల మానవ మనుగడకే కాకుండా పశు ప్రాణులకు కూడా హానీ కలుగుతుందని పర్యావరణం కలుషితం అవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని వీటన్నీంటికి మూలకారణమైన ప్లాస్టిక్ వినియోగాన్ని ఖమ్మం జిల్లాలో పూర్తిగా నివారించి ప్లాస్టిక్ రహిత ఖమ్మం జిల్లాగా మార్చాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆరోగ్య తెలంగాణాలో భాగంగా ఈ మాసంలో నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమాన్ని కూడా పటిష్టంగా అమలు చేసి కౌమార దశ బాలికలు, గర్భిణీలు, బాలింతలకు, చిన్నారులకు సరైన పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సేవలు అందించి అనుబంధ శాఖలన్నీ పోషణ మాసం యొక్క తమ లక్ష్యాలను పూర్తిస్ధాయిలో చేరుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారితో పోషణ మాసం ప్రతిజ్ఞను కలెక్టర్ చేయించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ప్రియాంక, నగర పాలక సంస్ధ కమిషనర్ జె.శ్రీనివాసరావు, అడిషనల్ కమిషనర్ జగన్, కార్పొరేటర్ నీరజ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మరందామరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి మదన్మోహన్, నగర ఏసీపీ వెంకట్రావ్, పోషణ అభియాన్ జిల్లా కో-ఆర్డినేటర్ హిమబిందు, చేతన్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ జీవన్, కృష్ణవేణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్ధినీ, విద్యార్ధులు నగరపాలక సంస్ధ కార్పొరేటర్లు పాల్గొన్నారు.