Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నిరసనలు
నవతెలంగాణ-ఖమ్మం ప్రతినిధి
సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఖమ్మం రీజియన్ పరిధిలో ఆరు డిపో (సత్తుపల్లి, మధిర, ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం) లలోని ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన గళాన్ని పెంచారు. మూడ్రోజుల కిందటే రాష్ట్ర నాయకత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు డిపోల కార్మికలు 2,800మంది ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరు కానున్నారు. మధ్యాహ్నాం సమయంలో డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నారు. రేపు కూడా ఈ నిరసన కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసీ నాయకులు మీడియా కు వెల్లడించారు. ఆర్టీసీ ఖమ్మం డిపో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మేరుగు రవింద్రనాథ్(టీఎంయూ), తోకల బాబు(ఎస్డబ్ల్యూఎఫ్), మలినేని శ్యామ్ సుందర్రావు (ఈయూ) నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా ఈనెల 30వ తేదీన రెండు జిల్లాల్లోని ఆరు డిపోల కార్మికుల ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టనున్నామని వారు తెలిపారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
ఖమ్మం ఆర్టీసీ రీజియన్లోని ఆరు డిపోల్లో మొత్తం ఆర్టీసీ, ప్రయివేటు బస్సులు కలుపుకుని 650బస్సులు, సుమారు 2,800మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, కార్మికులు, ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు. వీరికి కార్పొరేషన్నుండి చాలాకాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోక పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధానంగా వేతన సవరణ చేయాల్సిందేననీ, లేకపోతే ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మెకు దిగాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. కాగా నేడు, రేపు ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీ పరిరక్షణకు ప్రభత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీ బకాయిలు వెంటనే చెల్లించాలి. క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదలచేయాలి. బడ్జెట్లో ఒకశాతం నిధులు ఆర్టీసీకి కేటాయించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్న నష్టాలను మెట్రోకు చెల్లిస్తున్న రీతిలో టీఎస్ ఆర్టీసీకి వయబిలిటీ ఫండ్ను కూడా చెల్లించాలి. రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయించిన నిధులను విడుదల చేయాలి. చట్ట సవరణ అనుగుణంగా జీహెచ్ఎంసీనుండి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. డీజిల్పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వమే భరించాలి. సామాజిక బాధ్యతతో నడుస్తున్న ఆర్టీసీకి ఎంవీ టాక్స్ను రద్దుచేస్తూ అన్ని రకాల పన్నులపై మినహాయింపు ఇవ్వాలి. కండక్టర్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 1ఏప్రిల్ 217నుండి రావాల్సిన జీతభత్యాల సవరణ వెంటనే చేయాలి. అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయాలి. సీసీఎస్, పీఎఫ్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలి. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలిస్తూ ఆర్హతను బట్టి సూపర్వైజర్పోస్టులు కూడా ఇవ్వాలి. రిటైరైన ఉద్యోగులకు సెటిల్మెంట్తో పాటు సకల జనుల సమ్మె వేతనాన్ని చెల్లించాలి. వన్టైం మేజర్ కింద ఇంటర్ స్టేట్, జోన్, రీజియన్ ట్రాన్స్ఫర్లు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మాదిరిగా మహిళా ఉద్యోగులకు చైల్డ్కేర్ సెలవులు ఇవ్వాలి. మెడికల్ అన్ఫిట్ కలర్ బ్లైండ్ అయిన ఉద్యోగులకు వెంటనే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం నుండి తీసుకున్న మినహాయింపు సర్క్యులర్ను రద్దుచేయాలంటూ నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు.