Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో పంచాయతీ
పాలకవర్గ సభ్యులు
నవతెలంగాణ- నేలకొండపల్లి
నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెం గ్రామ సర్పంచ్ పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ గ్రామ పాలకవర్గ సభ్యులు గత సోమవారం ఖమ్మంలో గ్రీవెన్స్ డే లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం స్థానిక విలేకరులతో సర్పంచ్ అక్రమాలపై ఫిర్యాదు వివరాలను అందజేశారు. ఇటీవల గ్రామ రెవెన్యూ పరిధిలోని ఎన్నెస్పీ కాలువ పక్కన గల ప్రభుత్వ భూమిలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు నిధులు మంజూరు కాగా వాటి నిర్మాణం పేరుతో రెండు వందల ట్రక్కుల గ్రావెల్ను ఒక్కో టక్కు 400 రూపాయలు చొప్పున 80 వేల రూపాయలకు గ్రామస్తులకు వ్యక్తిగత అవసరాలకు విక్రయించారని ఆరోపించారు. గ్రామస్తులకు విక్రయించిన గ్రావెల్ తాలూకా సొమ్మును గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేయకుండా చివరకు ట్రాక్టర్ చార్జీలను సైతం గ్రామ పంచాయతీ ఖాతా నుంచి తీసుకున్నారని తెలిపారు. గ్రామంలో రహదారులు సక్రమంగా లేక గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోని సర్పంచ్ ప్రభుత్వ భూమిలో ఉన్న గ్రావెల్ను అమ్ముకోవడంపై ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా డంపింగ్ యార్డు, మట్టితోలకం పనులు సర్పంచ్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారన్నారు. దీంతోపాటు ఇటీవల గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణంలో కూడా సర్పంచి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించ కుండా తన ఇష్టానుసారంగా నిర్మించారు అన్నారు. ఈ విషయమై గ్రామ సర్పంచ్ ని వివరణ కోరగా టెక్నికల్ ఇంజనీర్ చెప్పిన ప్రకారమే నిర్మాణం జరిగిందని మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు.
గతంలో మాజీ సర్పంచి కోటి సైదిరెడ్డి ఇంటి ప్రక్కన మంచినీటి సౌకర్యార్థం ఏర్పాటుచేసిన బోర్ వెల్ ను గ్రామ అవసరాలకు ఉపయోగించకుండా మాజీ సర్పంచ్ వ్యక్తిగతంగా వినియోగించుకోవడం పై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో సర్పంచి చేస్తున్న అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలని కోరినట్లు తెలిపారు. గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వారిలో పాలకవర్గ సభ్యులు జంగం లక్ష్మీనారాయణ, తిరపయ్య, కె.నాగమణి, జి.రంగయ్య, మాజీ సర్పంచ్ తురక పాపయ్య, బోయినపల్లి వీరయ్య, కే.శ్రీనివాసరావు, కె.నాగేశ్వర రావు, బీ.లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా గ్రావెల్ తోలకం విషయంలో జోక్యం చేసుకోవద్దని సర్పంచి తెలిపినట్లు చెప్పడం గమనార్హం.