Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు
నవతెలంగాణ-సత్తుపల్లి రూరల్
కేసీఆర్ ప్రభుత్వం మండలంలో రెండు పడకల ఇండ్ల నిర్మాణంలో పూర్తిగా విఫలం అయ్యిందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని యాతాలకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని రెండు పడకల ఇండ్లు నిర్మాణంలో ఉన్న ఇండ్లు సందర్శించారు. ఈ సందర్బంగా జాజిరి మాట్లాడుతూ.. మండలంలో 21 గ్రామ పంచాయతీలకు గాను ఏదో కంటితుడుపుగా నాలుగైదు పంచాయతీలలో మాత్రమే పదోపరకో కేసీఆర్ ప్రభుత్వం రెండు పడకల ఇండ్లు మంజూరు చేశారన్నారు. అందులో ఒక్క యాతలకుంట గ్రామంలో మాత్రమే 43 ఇండ్లు మంజూరు చేసి 22 ఇండ్లు నిర్మాణం చేపట్టారని అన్నారు. నాణ్యత లోపించిందన్నారు. ఈ గ్రామంలో నిరుపేదలైన గిరిజనలు, దళితులు ఇతరులు రెండు మూడు కుటుంబాలు ఒకేఇంట్లో నివాసముంటూ అనేక రకాలుగా ఇక్కట్లు పడుతున్నారని జాజిరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి నిర్మాణాలు పూర్తి నాణ్యతతో త్వరగా పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు, యాతలకుంట గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.