Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం టౌన్
కరోనా పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దని, ప్రభుత్వం శక్తివంచన లేకుండా అన్నిచర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. అత్యవసర సమయంలో కరోనా నిర్దారణ కోసం, పాజిటివ్తో హౌమ్ క్వారెంటైన్లో ఉండి చికిత్స పొందుతున్న వారి సౌలభ్యం కోసం ఖమ్మం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన కరోనా వ్యాధి నిర్దారణ ర్యాపిడ్ యాంటిజన్ టెస్టింగ్ కిట్, హోమ్ ఐసొలేషన్ కిట్లను మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్తో కలిసి మంత్రి ప్రారంభించారు. జిల్లాలో పూర్తి స్థాయిలో కరోనా టెస్టులు చేసే సదుపాయాన్ని ప్రధానాసుపత్రితో పాటు మమత హాస్పిటల్లో ఆగస్టు నుంచి ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గర్భిణీలు, అత్యవసర సర్జరీలు, యాక్సిడెంట్ కేసులు, అత్యవసర పరిస్థితుల్లో కరోనానిర్దారణ చేసేందుకు ర్యాపిడ్ యాంటిజన్ టెస్ట్ కిట్స్ను నేటి మంగళవారం నుంచి ప్రధానాస్పత్రితో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పాజిటివ్తో హౌమ్ క్వారెంటైన్లో ఉన్న వారికి 12 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ను కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఈ సౌలభ్యంలేదని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో మనకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
అవసరానికి అనుగుణంగా ర్యాపిడ్ టెస్ట్లను నిర్వహించాలని మంత్రి వైద్యాధికారులకు సూచించారు.
కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ ప్రధానాస్పత్రితో పాటు అన్ని పీహెచ్సీల్లో మంగళవారం నుంచి ర్యాపిడ్ టెస్టులు అందుబాటులో ఉంటాయన్నారు. గర్భిణీలు, శస్త్రచికిత్సలు, ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర సమయాల్లో కరోనా నిర్దారణ కోసం ర్యాపిడ్ టెస్టులను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా ప్రధానాసుపత్రికి వెయ్యి కిట్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 1124 కిట్లను అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. అలాగే అన్ని సబ్ సెంటర్లకు థర్మల్ స్కానర్స్, పల్స్ ఆక్సీమీటర్లను ఏఎన్ఎమ్లు ఇంటింటి సర్వే చేసేందుకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, సుడా ఛైర్మన్ బచ్చు విజరు కుమార్, ఆర్జేసీ కృష్ణ, డీఎంహెచ్వో మాలతి, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో శ్రీనివాసరావు, ప్రోగ్రామ్ అధికారి నీలోహన ఉన్నారు.